breaking news
Indian musicians
-
Vijayalakshmy Subramaniam: సరిగమలే ఔషధాలు
ఆమె సంగీత విద్వాంసురాలు. అంతేకాదు... వైద్యరంగంలో ప్రొఫెసర్. వృత్తిని ప్రవృత్తిని మేళవించారామె. సరిగమలు వైద్యానికి ఔషధాలయ్యాయి. రాగాలు ఆరోగ్యాన్నిచ్చే టానిక్లవుతున్నాయి. తీయని కృతులు షుగర్ లెవెల్స్ తగ్గిస్తున్నాయి. సంగీత లయ బీపీకి గిలిగింత పెడుతోంది. ప్రొఫెసర్ విజయలక్ష్మి సుబ్రహ్మణ్యమ్... కర్ణాటక సంగీతంలో రాగాల మీద పరిశోధన చేశారు. ఆ రాగాలు డిప్రెషన్ను దూరం చేయడానికి ఏ విధంగా దోహదం చేస్తాయనే విషయాలను శాస్త్రబద్ధం చేశారు. సంగీతం అనారోగ్యాన్ని మాయం చేస్తుందనడానికి ప్రత్యక్ష నిదర్శనం తానేనని కూడా చెబుతారామె. ఇరవై ఒక్క ఏళ్ల వయసులో ప్రమాదానికి గురై చక్రాల కుర్చీలో గడిపిన సమయంలో సంగీత సాధన ద్వారా వేగంగా సాంత్వన పొందిన వైనాన్ని గుర్తు చేసుకున్నారు. డాక్టర్గా తన వృత్తిని సంగీతం పట్ల మక్కువతో మేళవించి రాగాలతో చేస్తున్న వైద్యం గురించిన వివరాలను సాక్షితో పంచుకున్నారు. ► తంజావూరు సరస్వతి మహల్ ‘‘నేను పుట్టింది బెంగళూరు, కర్నాటకలో స్థిరపడిన తమిళ కుటుంబం మాది. నాలో సంగీతాభిలాష ఎలా మొదలైందని చెప్పడం కష్టమే. ఎందుకంటే మా ఇల్లే ఒక సంగీత నిలయం. నానమ్మ గాత్రసాధనతోపాటు వయొలిన్ సాధన కూడా చేసేవారు. అమ్మ ఉద్యోగపరంగా సైన్స్ టీచర్, కానీ ఆమె కూడా సంగీతంలో నిష్ణాతురాలు. మా నాన్న శిక్షణ పొందలేదనే కానీ సంగీతపరిజ్ఞానం బాగా ఉండేది. అలా నాకు మా ఇంటి గోడలే సరిగమలు నేర్పించాయి. నాన్న ఉద్యోగరీత్యా దేశంలో అనేకచోట్ల పెరిగాను. గుజరాత్, బరోడాలో ఉన్నప్పుడు సంగీతంతోపాటు భరతనాట్యం కూడా నేర్చుకున్నాను. సంగీతం నాకు ధారణ శక్తికి బాగా ఉపకరించింది. దాంతో చదువులోనూ ముందుండేదాన్ని. ఎంబీబీఎస్లో సీటు వచ్చిన తర్వాత నా చదువు, అభిరుచి రెండు వేర్వేరు ప్రపంచాలయ్యాయి. రెండింటినీ వేరుగా చూడడం నాకు సాధ్యపడలేదు. నాకు తెలియకుండానే కలగలిపి చూడడం మొదలైంది. సంగీతాన్ని ఒక కళగా సాధన చేయడంతో సరిపెట్టకుండా ఒక శాస్త్రంగా అధ్యయనం చేయడం మొదలుపెట్టాను. నాదయోగ, రాగచికిత్సల గురించి అప్పుడు తెలిసింది. తంజావూరు సరస్వతి మహల్ లైబ్రరీలో సంగీతంతో వైద్యవిధానాల గురించి గ్రంథాలున్నాయి. మెడిసిన్తోపాటు మ్యూజిక్ని కూడా విపరీతంగా చదివాను. రాష్ట్రంలో మూడవ ర్యాంకుతో కర్ణాటక సంగీతంలో కోర్సు పూర్తి చేశాను. మన దగ్గరున్న పురాతన రాతిశాసనాలతోపాటు విదేశాల్లో ఉన్న మ్యూజిక్ థెరపీలను తెలుసుకున్నాను. వైద్యానికీ– సంగీతానికీ మధ్య ఉన్న, మనం మరిచిపోయిన బంధాన్ని పునఃప్రతిష్ఠ చేయాలనే ఆకాంక్ష కలిగింది. ► మతిమరపు దూరం మ్యూజిక్ థెరపీ అనగానే అందరూ ఇక మందులు మానేయవచ్చని అపోహపడుతుంటారు. అలాగే మందులు కొనసాగించాల్సినప్పుడు ఇక మ్యూజిక్తో సాధించే ప్రయోజనం ఏముంది అని తేలిగ్గా తీసేస్తుంటారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే... మా దగ్గరకు వచ్చిన ఒక పోలీస్ ఆఫీసర్ మూడు వందలకు పైగా డయాబెటిస్తో ఇన్సులిన్ తీసుకునేవాడు. మ్యూజిక్ థెరపీతో ఇన్సులిన్ అవసరం లేకుండా మందులు సరిపోయే దశకు తీసుకురాగలిగాం. నత్తితో ఇబ్బంది పడే పిల్లలు అనర్గళంగా మాట్లాడేటట్లు చేసింది సంగీతం. రెండు రోజులకోసారి డయాలసిస్ చేసుకుంటూ కిడ్నీ దాత కోసం ఎదురు చూస్తున్న పేషెంట్కి ఉపశమనం దొరికింది. ఇక నరాలు, నాడీ సంబంధ సమస్యలను నయం చేసి చూపిస్తున్నాం. ప్రతి పేషెంట్నీ వాళ్ల ఆహారవిహారాలు, ఇతర ఆరోగ్య సమస్యల ఆధారంగా విశ్లేషించి ప్రతి ఒక్కరికీ వారికి మాత్రమే ఉపకరించే సంగీత విధానాన్ని సూచిస్తాం. కొంతమంది కోసం ప్రత్యేకంగా పాటలు రాసి కంపోజ్ చేసి ఇస్తాం. పేషెంట్ ఇష్టాలు, మత విశ్వాసాల ఆధారంగా మ్యూజిక్ థెరపీని డిజైన్ చేస్తున్నాం. అయితే దీనికి ప్రత్యామ్నాయ వైద్యవిధానం అర్హత ఉన్నప్పటికీ ఇంకా ధృవీకరణ రాలేదు. కాంప్లిమెంటరీ మెడిసిన్గానే ఆచరణలో పెడుతున్నాం. వార్ధక్యం కారణంగా అల్జైమర్స్, డిమెన్షియాతో బాధపడుతున్న వాళ్లకు మ్యూజిక్ థెరపీతో అద్భుతాలు సాధించామనే చెప్పాలి. ఓ పెద్దాయన అయితే... భార్య పేరు కూడా మర్చిపోయాడు. నేను స్వయంగా పాట పాడుతూ ఆయన ప్రతిస్పందించే తీరును గమనిస్తున్నాను. ఆశ్చర్యంగా పాటలో తన భార్య పేరు రాగానే చిన్న పిల్లవాడిలాగ ‘యశోదా’ అంటూ పెద్దగా అరిచాడు. మా పరిశోధనాంశాల ఆధారంగా మ్యూజిక్ థెరపీని శాస్త్రబద్ధం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను’’ అని చెప్పారు ప్రొఫెసర్ విజయలక్ష్మి. ఇదీ ఆమె మొదలు పెట్టిన ‘ఇల్నెస్ టూ వెల్నెస్ ’ జర్నీ. సరిగమలతో రాగాల వైద్యం త్వరలోనే అందరికీ అందుబాటులోకి రావాలని ఆకాంక్షిద్దాం. రాగాల చికిత్స సంగీతం ఆరోగ్యప్రదాయినిగా అందరికీ అందుబాటులోకి తేవాలనే ఆకాంక్షలున్న వాళ్లందరం ఇండియన్ మ్యూజిక్ థెరపీ అసోసియేషన్ (ఐఎమ్టీఏ)గా సంఘటితమయ్యాం. ఇలాంటి సమూహాలు ఇంకా ఉన్నాయి. కానీ మనదేశంలో మ్యూజిక్ థెరపీ శాస్త్రబద్ధంగా, ఒక వ్యవస్థీకృతమైన అధీకృత సంస్థ ఏదీ లేదు. ఆ లోపాన్ని భర్తీ చేయడానికి ఇటీవల మంగళూరులో మా ఎనెపోయా మెడికల్ యూనివర్సిటీలో ఆన్లైన్ కోర్సు ప్రారంభించాం. ఇది డాక్టర్ల కోసం మాత్రమేకాదు, వైద్యరంగంలో పని చేసే అందరూ ఈ కోర్సు చేయవచ్చు. ఇక నా ప్రయత్నంలో స్పెషల్ చిల్డ్రన్కి మ్యూజిక్ థెరపీ కోర్సు, డయాబెటిస్, హైపర్టెన్షన్, కిడ్నీ ఫెయిలయ్యి డయాలసిస్తో రోజులు గడుపుతున్న పేషెంట్లకు మెరుగైన ఫలితాన్ని చూశాను. – ప్రొ‘‘ విజయలక్ష్మి సుబ్రమణ్యమ్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఓటోరైనోలారింగాలజీ, ఎనెపోయా మెడికల్ కాలేజ్, మంగళూరు, కర్ణాటక – జనరల్ సెక్రటరీ, ఐఎమ్టీఏ – వాకా మంజులారెడ్డి. -
ఏఆర్ రెహమాన్ మెచ్చుకున్న సింగర్.. ఎవరామే?
అక్కడే విని...అప్పుడే మరిచిపోయేట్లు ఉండకూడదు. అది నీడలా మన వెంటపడాలి’ అని అనడమే కాదు నిరూపించింది మాలి ‘కొందరు కళాకారుల అంకితభావం వ్యక్తిత్వంలోనే కాదు వారి సృజనాత్మకప్రక్రియలోనూ బలంగా కనిపిస్తుంది. అది వారిని మరింత పైకి తీసుకెళుతుంది. అలాంటి వారిలో ఒకరు...మాళవిక మనోజ్’ అని ఏఆర్ రెహమాన్ మెచ్చుకోవడం తనకు లభించిన అత్యున్నత పురస్కారం అంటుంది మాళవిక మనోజ్. చెన్నైలోని మలియాళి దంపతులకు జన్మించిన మాళవిక మనోజ్కు సంగీతం అనేది బాల్యనేస్తం. తల్లిదండ్రులు సంగీతకారులు కానప్పటికీ సంగీతప్రేమికులు. పాత, కొత్త, స్వదేశ, పరదేశ...అనే తేడా లేకుండా ఆ ఇంట్లో సంగీతం నిరంతరం ప్రతిధ్వనించేది. అయిదు సంవత్సరాల వయసులో మాళవికను స్విమ్మింగ్ క్లాస్లతో పాటు పియానో, భరతనాట్యం, డ్రాయింగ్ క్లాస్లకు పంపేవారు తల్లిదండ్రులు. కొంతకాలం తరువాత పియానో క్లాస్లకు తప్ప మిగిలిన క్లాసులకు బంక్ కొట్టేది మాళవిక. పదహారు సంవత్సరాల వయసులో పాటలు రాయడం మ్యూజిక్ కంపోజింగ్ చేయడం మొదలు పెట్టింది. పదిహేడు సంవత్సరాల వయసులో గిటార్ వాయించడం నేర్చుకుంది, ఆమె ఫస్ట్ సింగింగ్ పర్ఫామెన్స్ గురించి చెప్పుకోవాలంటే... పన్నెండు సంవత్సరాల వయసులో ఒక విందులో ప్రఖ్యాత అమెరికన్ జాజ్ సింగర్ ఎల్లా ఫిజ్జెరల్డ్ పాట పాడింది. విశేషం ఏమిటంటే ఆ పాటను విందుకు అన్వయించి పాడడం ద్వారా ‘శబ్బాష్’ అనిపించుకుంది మాళవిక. చెన్నైలో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్(బిబిఏ) చేసిన మాళవిక పై చదువుల కోసం ఫ్రాన్స్కు వెళ్లింది. అక్కడి నుంచి తిరిగివచ్చిన తరువాత ముంబైకి వెళ్లింది. మంచి ఉద్యోగం వెదుక్కోవడానికి కాదు.. మ్యూజిక్లో కెరీర్ వెదుక్కోవడానికి!. బేస్–ఇన్–బ్రిడ్జి అనే మ్యూజిక్ బ్యాండ్లో చేరడం ద్వారా తొలి అడుగువేసింది. తన స్టేజ్ నేమ్ ‘మాలి’ అయింది. డెబ్యూ ఆల్బమ్ ‘డిసెప్టివ్’తో వావ్ అనిపించింది. ఏఆర్ రెహమాన్లాంటి సంగీత దిగ్గజాలతో కలిసి పనిచేసింది. యూరో ఇండీ మ్యూజిక్చార్ట్లో తన పాట ఫస్ట్ ర్యాంకులో నిలిచింది. తనకు పాప్గర్ల్గా గుర్తింపు ఉన్నప్పటికీ సంగీతంలో రకరకాల జానర్స్ వినడం, వాటి నుంచి ఇన్స్పైర్ కావడం అంటే ఇష్టం. ‘అతిగా ఆలోచించడం అనేది నా బలం, నా బలహీనత. ఆ ఆలోచనల్లో నుంచే సంగీతం పుడుతుంది’ అంటున్న 28 సంవత్సరాల మాళవిక మనోజ్, సంగీతంలో మరిన్ని ప్రయోగాలు చేయాలనుకుంటోంది. -
గీతానాదం
పుస్తక పరిచయం సంగీతానికి రాళ్లు కరుగుతాయి అంటారు, సత్తిరాజు శంకర్కు మాత్రం పెన్సిల్ కరుగుతుంది. గ్రాఫైట్ రజను పుప్పొడిలా కాగితంపై ఆవరించుకుంటుంది. ఆ పొగబారు వర్ణం వెంట పెన్సిల్ రూపపు దారులు వేస్తుంది. కొన్ని గంటలు, ఒక్కోసారి రోజులు అలా ఆ పెన్సిల్ దానివెంట ఆయన వేళ్లు నాదాన్ని మీటుతూ ఉంటాయి. కాగితంపై కాగితం చేరుతూ వందల చిత్రాలు రూపుదిద్దుకుంటూ ఉంటాయి. గాల్లో తేలుతూ ఆ నాద రేఖలు విన తెలిసిన కళ్లకు చేరుతాయి. ఒకవేళ ఆ కళ్లు గుణం మూర్తీభవించినవైతే తాము పొందిన ఆనందాన్ని పదిమందికి పంచ సంకల్పిస్తాయి. ఈ కాలంలో అటువంటి కళ్లు గల్గినవారిని వరప్రసాద్రెడ్డి అంటారు. వారి సంకల్ప సిద్ధిని ‘నాదరేఖలు’ అంటారు. ఆనాటి నుండి మననాటి వరకు, అన్నమయ్యవారి దగ్గరి నుండి హైదరాబాద్ సోదరులు రాఘవాచారి, శేషాచారి గార్ల దాకా, కర్ణాటక హిందుస్తానీ సంగీత కళామూర్తులు గాత్ర, తంత్రీవాద్య విశేష ప్రతిభావంతులైన 186 మంది మూర్తి చిత్రణ చిత్రకారుడు సత్తిరాజు శంకర్ది, వారి జీవిత విశేషాలను అనల్ప పదాలలో విశేషంగా రచించినవారు డాక్టర్ వైజర్స్ బాలసుబ్రహ్మణ్యం. శ్రుత జ్ఞానం కల్గినవారు మాత్రమే కాదు, విహంగ వీక్షణంగా మన భారతీయ సంగీతకారుల జీవితచరిత్రలని తెలుసుకోవాలనే అభిరుచి కల్గినవారు చూడదగ్గ పుస్తకం.