breaking news
Indian-American woman
-
సర్వీస్ స్టార్
‘నా టైమ్ బాగ లేదు’ అనుకున్నాడు తాతయ్య. ఎందుకంటే ఆయన ఆన్లైన్ మోసానికి గురయ్యాడు. దాంతో తీవ్ర నిర్వేదానికి లోనయ్యాడు. ఈ నేపథ్యంలో తన తాతయ్యలాంటి ఎంతో మంది వృద్ధుల కోసం ‘షీల్డ్ సీనియర్స్’ అనే వెబ్సైట్ను రూపొందించిన పదిహేడు సంవత్సరాల ఇండియన్–అమెరికన్ తేజస్వి మనోజ్... టైమ్స్ మ్యాగజైన్ ‘కిడ్ ఆఫ్ ది ఇయర్–2025’ ఘనత సాధించింది. ‘ఆన్లైన్ మోసానికి గురైతే ఏం చేయాలి...’ నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తల వరకు సెమినార్లు, తన వెబ్సైట్ ద్వారా విస్తృత ప్రచారం చేస్తోంది తేజస్వి. ఇప్పుడు తేజస్వి ‘టైమ్’ బాగుంది. ఆమె చెప్పే సాంకేతిక విషయాల గురించి వినడానికి ఆబాలగోపాలం ఆసక్తి కనబరుస్తోంది. టైమ్ మ్యాగజైన్ తేజస్విని ‘సర్వీస్ స్టార్’గా కొనియాడింది...కాలిఫోర్నియాలో పుట్టి డాలస్లో పెరిగింది తేజస్వి మనోజ్. తేజస్వి తల్లిదండ్రులు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. కోడింగ్ అంటే తేజస్వికి ఎంతో ఇష్టం. చాలా చిన్న వయసులోనే కోడింగ్ నేర్చుకోవడం మొదలుపెట్టింది. బొమ్మలతో ఆడుకుందో లేదో తెలియదుగానీ కోడింగ్ ప్రపంచంలో జావా, పైథాన్లతో ఆడుకుంది.కోడింగ్ శక్తి... ‘గర్ల్స్ హూ కోడ్’ అనే స్వచ్ఛంద సంస్థ సైబర్ సెక్యూరిటీపై నిర్వహించే క్లాసులకు రెగ్యులర్గా హాజరయ్యేది తేజస్వి. ఎయిర్ ఫోర్స్, స్పేస్ఫోర్స్ ప్రోగ్రామ్ ‘సైబర్–పేట్రియాట్’లో చురుగ్గా పాల్గొనేది. ‘కోడింగ్ అనేది ఎంతో అద్భుత ప్రక్రియ. కోడింగ్ ను చాలా ఎంజాయ్ చేస్తాను. కోడింగ్ను నేర్చుకోవడం వల్ల దానిశక్తి ఏమిటో తెలుసుకోగలిగాను. భవిష్యత్లో కూడా కోడింగ్తో నా ప్రయాణం కొనసాగుతుంది’ అంటుంది తేజస్వి.ఎంతోమంది తాతయ్యల కోసం...గత సంవత్సరం తేజస్వి తాత ఆన్లైన్ మోసానికి గురయ్యాడు. మోసగాళ్లు ఆయన నుంచి డబ్బు డిమాండ్ చేశారు. అయితే కుటుంబసభ్యులకు ఈ ఆన్లైన్ మోసం గురించి తెలియడంతో వారి ఆటలు సాగలేదు. తాతయ్యకు ఆన్లైన్ మోసాల గురించి అవగాహన లేకపోవడం తేజస్విని ఆశ్చర్యపరిచింది. అయితే తన తాత మాత్రమే కాదు ఎంతోమంది వ్యక్తులకు ఆన్లైన్ మోసాల గురించి బొత్తిగా అవగాహన లేదనే విషయం తెలుసుకుంది. అలా అని తేజస్వి బాధపడుతూ కూర్చోలేదు.‘నా వంతుగా ఏదైనా చేయాలి’ అని పరిశోధన బాట పట్టింది. సీనియర్ సిటిజన్లకు ఆన్లైన్ మోసాల గురించి హెచ్చరించడానికి ‘షీల్డ్ సీనియర్స్’ పేరుతో వెబ్సైట్ రూపొందించింది. సైబర్సెక్యూరిటీకి సంబంధించిన ప్రాథమిక సూత్రాలను ‘షీల్డ్ సీనియర్స్’ తెలియజేస్తుంది.స్వతంత్రంగా... సగర్వంగా...‘సీనియర్ సిటిజనులు ఎలాంటి సంకోచం లేకుండా స్వతంత్రంగా, సగర్వంగా ఆన్లైన్ ప్రపంచంలో తమ పనులు తాము చేసుకునేలా షీల్డ్ సీనియర్స్’కు రూపకల్పన చేశాం’ అంటుంది తేజస్వి.ఆన్లైన్ మోసాలపై అవగాహన కలిగించడానికి తేజస్వి నిర్వహించే సమావేశాలకు ఎంతోమంది వృద్ధులు హాజరవుతుంటారు. ఆమె ప్రసంగిస్తుంటే నోట్స్ రాసుకుంటారు. ప్రసంగం పూర్తయిన తరువాత తేజస్విని రకరకాల సందేహాలు అడుగుతుంటారు. వాటికి ఓపికగా జవాబులు ఇస్తుంటుంది తేజస్వి.‘మాది టెక్ ఫ్యామిలీ’ అని ఘనంగా చెబుతుంటాడు తేజస్వి తండ్రి మనోజ్. ఆ ఘనతకు సామాజిక ప్రయోజానాన్ని జోడించి ‘డిజిటల్ డిఫెండర్’గా పేరు తెచ్చుకుంది తేజస్వి. ∙ఆహా... ఆల్రౌండర్!కోడింగ్లో అద్భుత ప్రతిభ కనబరుస్తున్న తేజస్వి మనోజ్ వయోలిన్ అద్భుతంగా వాయిస్తుంది. తన ఆర్కెస్ట్రాతో హైస్కూల్లో ఎన్నో కచేరీలు చేసింది. కరాటేలో కూడా ప్రవేశం ఉంది. స్కౌటింగ్–అమెరికాలో యాక్టివ్గా ఉంది. తాజాగా ఈగిల్ స్కౌట్ ర్యాంక్ అందుకుంది. ‘వైభ’ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా భూటాన్ కాందిశీకుల పిల్లలకు మ్యాథ్స్, ఇంగ్లీష్ బోధిస్తోంది. సామాజిక సేవాకార్యక్రమాలలో ఎప్పుడూ ముందుంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ తనకు ఇష్టమైన సబ్జెక్ట్లు. భవిష్యత్లో కంప్యూటర్ సైన్స్ చదవాలనుకుంటుంది. ‘ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకోవాలనే ఉత్సాహవంతుల దగ్గరికి విజయాలు ఉత్సాహంగా నడిచొస్తాయి’ అని చెప్పడానికి బలమైన ఉదాహరణ తేజస్వి మనోజ్.ఉక్కుకవచం... షీల్డ్ సీనియర్స్‘షీల్డ్ సీనియర్స్’లో ఆన్లైన్ మోసాలకు సంబంధించిన సందేహాలకు చాట్బాట్ ద్వారా సమాధానాలు తెలుసుకోవచ్చు. అనుమానాస్పద టెక్ట్స్, మెజేస్లను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా విశ్లేషించుకోవచ్చు. ‘షీల్డ్ సీనియర్స్’లో నాలుగు విభాగాలు ఉంటాయి. ‘లెర్న్’ విభాగంలో ఇంటర్నెట్ సెక్యూరిటీకి సంబంధించి ప్రాథమిక విషయాలు తెలుసుకోవచ్చు. స్ట్రాంగ్ పాస్వర్డ్స్ రూపొందించుకోవడానికి, ప్రైవసీ సెట్టింగ్స్ను అర్థం చేసుకోవడానికి, ఎలాంటి సమాచారం షేర్ చేయవచ్చు, ఏది చేయకూడదు...మొదలైనవి తెలుసుకోవచ్చు. ‘ఆస్క్’ విభాగంలో చాట్బాట్ ద్వారా సందేహ నివృత్తి చేసుకోవచ్చు. ‘ఎనలైజ్’ అనేది మూడో విభాగం. యూజర్లు ఈ ట్యాబ్ క్లిక్ చేసి అనుమానాస్పద టెక్ట్స్, ఈ మెయిల్స్ను అప్లోడ్ చేయవచ్చు. ‘రిపోర్ట్’ సెక్షన్లో ఆన్లైన్ మోసగాళ్లపై ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదులపై స్పందించే 14 ప్రైవేట్, ప్రభుత్వ సంస్థలకు చెందిన లింక్స్ ఇందులో ఉంటాయి. -
టాలెంట్ వదిలేసి బొట్టుపై ట్రోల్స్
ముఖం చూసి బొట్టు పెట్టడమనేది స్థాయీభేదాలను సూచించే సామెత! ఇప్పుడు ఆ బొట్టు అమెరికాలోనూ ఆక్షేపణీయమైంది.. సొలిసిటర్ జనరల్ పదవికి! దాంతో ఆధునిక నాగరికతకు ఆనవాలంగా భ్రమపడే అమెరికా మరొక్కసారి తన జాత్యహంకారాన్ని చాటుకుంది. భారతీయ మూలాలున్న మథుర శ్రీధరన్ అమెరికాలోని ఒహైయో రాష్ట్ర 12వ సొలిసిటర్ జనరల్గా నియమితులయ్యారు. ఈ విషయాన్ని అటార్నీ జనరల్ ఆఫీస్ ఎక్స్ (ట్విటర్) వేదికగా ప్రకటించింది. అంతే నిరసనలు, ట్రోల్స్తో నిండిపోయింది ఎక్స్. మథుర ప్రజ్ఞాపాటవాల మీద సందేహంతో కాదు, ఆమె భారతీయ మూలాల మీద ఆక్షేపణ.. ఆమె పేరు, ఒంటి రంగు, పెట్టుకున్న బొట్టు మీద వ్యతిరేకతతో! ‘సొలిసిటర్ జనరల్గా ఒక ఇండియన్ ఏంటీ? ఒహైయోలో అమెరికన్స్ కరువయ్యారా?’ అంటూ ఒకరు, ‘నుదుటన పర్మినెంట్ చుక్క పెట్టుకుని మరీ వచ్చిందండీ కొలువుకి’ అంటూ మరొకరు, ‘జాబ్స్ లేకుండా స్థానికులు అల్లాడుతుంటే ఈ విదేశీయులకు ఉద్యోగం ఏంటీ?’ అంటూ ఇంకొకరు, ‘బొట్టు పెట్టుకోవడం స్థానికులకు చేతకాదు కాబట్టి వాళ్లకు కొలువుల్లేమో’ అంటూ వేరొకరు ఎక్స్లో కామెంట్లు గుప్పించారు. ఆమెకున్న క్వాలిఫికేషన్స్, శక్తిసామర్థ్యాల గురించి మాత్రం ఎవ్వరూ మాట్లాడలేదు. అయితే.. ఆ ట్రోల్స్, కామెంట్స్కి జవాబుగా ఒహైయో అటార్నీ జనరల్ డేవ్ యోస్ట్ స్పందిస్తూ ‘చాలామంది మథుర శ్రీధరన్ అమెరికన్ కాదనే అపోహలో ఉన్నారు. కానీ ఆమె అమెరికా పౌరులకు పుట్టిన అమ్మాయి. అమెరికా పౌరురాలే! అంతేకాదు అమెరికా పౌరుడినే పెళ్లాడారు. అన్నిటికీ మించి ఆమె చాలా బ్రిలియంట్, సొలిసిటర్ జనరల్ హోదాకు అన్ని అర్హతలున్న పర్ఫెక్ట్ అభ్యర్థి. ఆ బాధ్యతలను చక్కగా నిర్వర్తించగలరు కూడా! ఇవికాక మిమ్మల్ని ఆమె పేరు, రంగు ఇబ్బంది పెడుతున్నట్లయితే ప్రాబ్లం ఆమెలో లేదు.. మీ మెదళ్లలో ఉంది’ అని పోస్ట్ చేశారు. మథుర శ్రీధరన్.. ఎమ్ఐటీ (మాసచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్ పోస్ట్గ్రాడ్యూయేట్. తర్వాత న్యూయార్క్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లాలో చేరి జ్యూరిస్ డాక్టర్ (జేడీ) పట్టా పొందారు. చక్కటి వాగ్ధాటి, అద్భుతమైన వాదనా పటిమ ఆమె సొంతం. ఆ ప్రతిభే ఆమెను సొలిసిటర్ జనరల్ పదవి వరించేలా చేసింది. -
దిగ్గజ కంపెనీ తొలి సీఎఫ్వోగా దివ్య రికార్డు
భారత సంతతికి చెందిన మహిళ ప్రపంచ ఆటో దిగ్గజ కంపెనీలో కీలక అధికారిగా ఎంపికయ్యారు. చెన్నైలో జన్మించిన దివ్య సూర్యదేవర (39) అతిపెద్ద వాహన సంస్థ జనరల్ మోటార్స్ కు సీఎఫ్వోగా నియమితులయ్యారు. చక్ స్టీవెన్స్ స్థానంలో దివ్య ఈ పదవికి ఎంపికయ్యారు. సెప్టెంబర్ నుంచి దివ్య సీఎఫ్వోగా పదవీ బాధ్యతలను స్వీకరించనున్నారని జనరల్స్ మోటార్స్ వెల్లడించింది. గత అనేక సంవత్సరాలుగా అనేక కీలక పాత్రల్లో దివ్య అనుభవం, నాయకత్వం కారణంగా ఆర్ధిక కార్యకలాపాల్లో అంతటా దృఢమైన వ్యాపారాన్ని నిర్మించుకున్నామని బార్రా ఒక ప్రకటనలో తెలిపారు. 2014 నుంచి జీఎంకు సీఈవోగా మేరీ బర్రా (59)కు దివ్య రిపోర్ట్ చేయనున్నారు. దీంతో ప్రపంచంలోనే ఆటో పరిశ్రమలో అత్యున్నత పదవులను స్వీకరించిన తొలి మహిళలుగా సీఎఫ్వో దివ్య , సీఈవో మేరీ రికార్డు సృష్టించారు. ఇంతవరకు ఏ ఆటో కంపెనీలో సీఈవో, సీఎఫ్వో పదవులను మహిళలు స్వీకరించలేదు. కాగా మద్రాసు యూనివర్శిటీ నుంచి కామర్స్లో మాస్టర్స్ పట్టా పొందిన దివ్య , అమెరికా హార్వర్డ్ యూనివర్శిటీ ద్వారా ఎంబీఏ సాధించారు. అనంతరం ఛార్టర్డ్ ఫైనాన్షియల్ ఎనలిస్ట్ (సీఎఫ్ఏ) ధృవీకరణ పొందారు. 2005లో జనరల్ మెటార్స్ కంపెనీలో జాయిన్ అయిన దివ్య జూలై , 2017 నుంచి కార్పొరేట్ ఫైనాన్స్కు వైస్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నారు. -
ఐక్యరాజ్య సమితికి ఎన్నారై మహిళ
భారత-అమెరికన్ మహిళ నిక్కీ హేలీకి బంపర్ చాన్స్ తగిలింది. దక్షిణ కరొలినా గవర్నర్గా ఉన్న ఆమె.. ఐక్యరాజ్య సమితికి అమెరికా రాయబారిగా వెళ్లనున్నారు. ఈ మేరకు అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ఆఫర్ను ఆమె అంగీకరించినట్లు వాషింగ్టన్ పోస్ట్ పత్రిక ఓ కథనంలో పేర్కొంది. దీంతో కేబినెట్ స్థాయిలో ట్రంప్ నియమించిన మొట్టమొదటి మహిళగా ఆమె నిలిచారు. అయితే ట్రంప్ బృందం మాత్రం ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. నిక్కీ హేలీ (44) తల్లిదండ్రులు భారత దేశం నుంచి అమెరికాకు వలస వెళ్లారు. ప్రస్తుతం ఆమె రెండోసారి దక్షిణ కరొలినా గవర్నర్గా ఉన్నారు. గవర్నర్గా ఉన్న పాలనాకాలంలో వాణిజ్య, కార్మిక సమస్యల మీద ప్రధానంగా దృష్టి సారించారు. ఆమెకు దౌత్యపరమైన అనుభవం మాత్రం పెద్దగా లేదు. కానీ, అమెరికా సైన్యం, జాతీయ భద్రత లాంటి అంశాల్లో ఆమె విధానాలు ప్రధానస్రవంతిలోని ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలతో సరిపోతాయని వాషింగ్టన్ పోస్ట్ వ్యాఖ్యానించింది. ప్రధానమైన పదవుల్లో ఎవరెవరిని నియమించాలనే అంశంపై చర్చలలో భాగంగా గత వారం న్యూయార్క్లోని ట్రంప్ టవర్లో నిక్కీ హేలీని డోనాల్డ్ ట్రంప్ కలిసి చర్చించారు. దాంతో.. మిట్ రోమ్నీతో పాటు ఆమెను కూడా విదేశాంగ మంత్రిని చేయబోతున్నారనే కథనాలు వెలువడ్డాయి. అయితే ఇప్పుడు మాత్రం హేలీని ఐక్యరాజ్య సమితికి పంపడం దాదాపు ఖాయమైనట్లే చెబుతున్నారు. -
విదేశీ వర్శిటీలో మన మురళీరవం
ఇండియాలో చదివిన ఒక భారతీయ అమెరికన్ మహిళ... అందులోనూహైదరాబాద్లో ఐటీ విద్యను అభ్యసించిన అతివ... విజి మురళీ, అగ్రరాజ్యంగా పేరు పొందిన అమెరికాలోనే ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయమైన యూనివర్శిటీ ఆఫ్ క్యాలిఫోర్నియాడెవిస్లో ముఖ్య సమాచార అధికారిణిగా, సాంకేతిక విద్యా విభాగానికి ఉపాధికారిగా నియమితులయ్యారు. మన చదువుల ఘనకేతనాన్ని అమెరికాలో రెపరెపలాడించారు. సాటి తెలుగు వారిగా మన కీర్తిని ఇనుమడింపజేశారు. హైదరాబాద్లోని ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో 1975లో జీవ, రసాయన శాస్త్రాలలో బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన మురళీ విజి, మరో రెండు సంవత్సరాల్లోనే ఉస్మానియా కాలేజ్ ఆఫ్ సైన్స్లో ఆర్గానిక్ కెమిస్ట్రీలో పీజీ పట్టా పుచ్చుకున్నారు. అప్పటినుంచి 1981 వరకు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అనుబంధ సంస్థ అయిన రీజియనల్ రిసెర్చ్ లేబరేటరీలో ఆర్గానిక్ కెమిస్ట్రీలో డాక్టోరల్ డిగ్రీ చేశారు. పీహెచ్డీ పూర్తి అవుతుండగానే ఆమెకు అమెరికాలోని నోట్రడామ్లోనూ, లోవా స్టేట్ యూనివర్శిటీలోనూ పోస్ట్ డాక్టోరల్ రిసెర్చి చేస్తున్న శుబ్రా మురళీధరన్తో పెళ్లయింది. వెంటనే ఆమె భర్తతో కలిసి అమెరికాలో అడుగుపెట్టారు. అక్కడికి వెళ్లాక ఆమె తన డాక్టోరల్ డిగ్రీని కొనసాగించాలా లేక కొత్త రంగంలోకి ప్రవేశించి, తనను తాను నిరూపించుకోవాలా? అని ఆలోచించారు. అదే విషయమై ఇండియాలో రాకెట్ సైంటిస్ట్ అయిన తండ్రిని సలహా అడిగారు. ఆయన మురళీతో... ‘నువ్విప్పుడు కొత్త కొలువులకు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు పురిటి గడ్డ అయిన అమెరికాలో ఉన్నావు. రానున్న ఇరవై సంవత్సరాల్లో అన్నింటా కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీనే అగ్రస్థానం సాధించనున్నదనే విషయం మర్చిపోకు’ అని చెప్పారు. తండ్రి చెప్పిన మాటలలో ఆమెకు ఏం ధ్వనించిందో ఏమో కానీ, తన డాక్టోరల్ పరిశోధనలను పూర్తిగా పక్కన పెట్టేసి, భర్త పనిచేసే లోవా స్టేట్లో కంప్యూటర్ సైన్స్లో రెండేళ్ల అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సు చేశారు. ఆ తర్వాత భర్తకు ఆరిజోనా యూనివర్శిటీకి బదిలీ కావడంతో 1987 కల్లా అదే యూనివర్శిటీ నుంచి మాస్టర్స్ ప్రోగ్రామ్ పూర్తి చేశారు. ఆ సమయంలో తను ఇండియాలో చదివిన కెమిస్ట్రీ, సైన్స్ డిగ్రీలు ఎంతగానో ఉపయోగపడ్డాయనే విషయాన్ని గుర్తు చేసుకున్నారు మురళీ. తాను మాస్టర్స్ డిగ్రీ చదివిన ఆరిజోనా విశ్వవిద్యాలయంలోనే మొదట సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్గా చేరారు. ఆ తర్వాత సెంటర్ ఫర్ కంప్యూటింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ప్రోగ్రామ్ ఆఫీసర్గా తన ప్రతిభ నిరూపించుకున్నారు మురళీ. ‘‘నాకు అప్పగించిన బాధ్యతలలో నేను కనబరచిన నైపుణ్యానికి మెచ్చిన అధికారులు నన్ను ప్రిన్సిపాల్గా, ప్రాజెక్ట్ లీడర్గా, కంప్యూటింగ్ మేనేజర్గా, సిస్టమ్స్ మేనేజ్మెంట్ డెరైక్టర్గా వరసగా పదోన్నతులిచ్చి, నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. అలా అక్కడ పదకొండు సంవత్సరాలపాటు వివిధ బాధ్యతలు నిర్వర్తించాను. తర్వాత 1999లో బదిలీపై వెస్ట్రన్ మిచిగన్ యూనివర్శిటీకి వెళ్లాను. అక్కడ ఐటీ విభాగానికి వైస్ ప్రెసిడెంట్గా, ముఖ్య సమాచార అధికారిగా సేవలు అందించాను. ఆ తర్వాత వాషింగ్టన్ స్టేట్ యూనివర్శిటీ నుంచి పిలుపు రావడంతో అక్కడి అధికారులు నాకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చడంతో నా పేరు అమెరికా అంతటా పాకిపోయింది’’ అంటూ వివరించారు మురళి. ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాలి... సాధారణంగా మనం ఇక్కడి చదువు నాణ్యమైనది కాదన్న భ్రమతో విదేశీ విద్యకోసం అర్రులు చాస్తుంటార.. అయితే మన దేశంలోనే విద్యను అభ్యసించిన మురళీ... కష్టపడి చదివే తత్వం, పట్టుదలతో పని చేస్తూ ప్రతిభకు మెరుగు పెట్టుకునే మనస్తత్వం ఉంటే - మన వాళ్లు కూడా విదేశాలలో విజయకేతనం ఎగురవేయవచ్చు అనడానికి నిదర్శనంగా నిలిచారు. ‘మురళీ విజి వంటి ప్రతిభావంతురాలైన, అనుభవజ్ఞురాలైన వ్యక్తిని ఈ పదవిలో నియమించడం ద్వారా యూనివర్శిటీ ఆఫ్ క్యాలిఫోర్నియా డెవిస్ ఎంతో అదృష్టం చేసుకుంది’ - యూనివర్శిటీ ఛాన్స్లర్ లిండా పి.బి. కటే హి ఆమెను ఆ పదవిలో నియమించే సమయంలో అన్నారంటేనే అర్థం అవుతోంది విజీ మురళీ అక్కడివారి అభిమానాన్ని ఎంతగా చూరగొన్నారన్నదీ! మురళీ ఈ నెల 18న తన విధులలో చేరనున్నారు. అక్కడి ఐటీరంగంలో ఆమె అందించనున్న సేవలు, చేయనున్న మార్పులు, అక్కడి విద్యార్థులకు మన దేశం పట్ల, ముఖ్యంగా స్త్రీల పట్ల గౌరవాభిమానాలను పెంచుతూ మన సమాచార సాంకేతిక సౌరభాలను మరింత బలంగా వ్యాపింపచేస్తాయని ఆశిద్దాం. - డి.వి.ఆర్.