breaking news
Hudood havoc
-
ఎన్నాళ్లీ..అమావాస్య
మెరుపువేగంతో పనిచేసినా వెన్నాడుతున్న కరెంటు కష్టాలు విశాఖ వన్టౌన్లో మెరుగైన పరిస్థితి గ్రామీణ జిల్లాలో ఘోరం విశాఖపట్నం సిటీ : దీపావళి వేళ కూడా విశాఖ నగరంతోపాటు, జిల్లాలోని పలు ప్రాంతాలు చీకట్లో మగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. బుధవారం రాత్రికి ఇంకా వేలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా లేదు. జిల్లాలో పరిస్థితి మరీ ఘోరం గా వుంది. గిరిజన మైదాన ప్రాంతాల్లోనూ చీకట్లే రాజ్యమేలుతున్నాయి. పది శాతం కూడా విద్యుత్ దీపాలు వెలగడం లేదు. నత్తనడకన పునరుద్ధరణ పనులతో మండల కేంద్రాలు కూడా ఇంకా చీకట్లోనే ఉన్నాయి. హుదూద్ బీభత్సం తర్వాత విద్యుత్ శాఖ మెరుపు వేగంతో పునరుద్ధరణ చేపట్టింది. విశాఖలో 6.78 సర్వీసులకు గత బుధవారం నుంచీ విద్యుత్ సరఫరా బాధ్యతను ఏపీ పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఏపీ ట్రాన్స్కో, ఏపీఈపీడీసీఎల్ సంస్థలు సంయుక్తంగా చేపట్టాయి. ఇప్పటివరకూ 6.19 లక్షల వినియోగదారులకు విద్యుత్ను అందించగలిగారు. వన్టౌన్ ప్రాంతానికి చెందిన విద్యుత్ జోన్-1 డివిజన్లో 2.29 కనెక్షన్లకు వెయ్యింటికి మినహా అన్నింటికీ సరఫరా ఇచ్చారు. ఈ డివిజన్లో వెయ్యి ఇళ్లల్లో కరెంట్ కాంతులు నెలాఖరు వరకూ కనిపించే అవకాశాలు లేవు. ఇదే పరిస్థితి మరికొన్నాళ్లు వుండే అవకాశం వుంది. ఇప్పటికే 12 రోజులుగా విద్యుత్ లేని వీరంతా ఆందోళన చెందుతున్నారు. దీపావళి పండుగ పూటా అంధకారంలో మగ్గాల్సిందేనా అని కలవరపడుతున్నారు. -
అంతటా..దుర్గంధం
ఇంకా ముంపులోనే గ్రామాలు ఎక్కడికక్కడపేరుకుపోయిన చెత్త మురుగునీటిలోనే రాకపోకలు సాంత్వనకోసం జనం ఎదురుచూపులు హుదూద్ బీభత్సం సృష్టించి ఐదు రోజులవుతున్నా జిల్లాలో పరిస్థితులు దుర్భరంగానే ఉన్నాయి. పలు గ్రామాలు, కాలనీలను ముంపు ఇంకా వీడలేదు. వీధుల్లో నిలిచిన వర్షపునీరు అలాగే ఉండిపోయింది. ఎక్కడికక్కడ చెత్తాచెదారం పేరుకుపోయి దుర్గంధం వెలువడుతోంది. నిలిచిన వర్షపునీరు మురిగిపోయి తీవ్రమైన దుర్వాసన వస్తోంది. అందులోనుంచే రాకపోకలతో జనం చర్మవ్యాధులకు గురయి నరకయాతన అనుభవిస్తున్నారు. యలమంచిలి : జిల్లాలో పరిస్థితి అధ్వానంగా ఉంది. యలమంచిలి, అచ్యుతాపురం, రాంబిల్లి, మునగపాక మండలాల్లో పరిస్థితి దయనీయంగా ఉంది. సహాయ పునరావాస కార్యక్రమాలూ కొన్నిప్రాంతాలకే పరిమితమవుతున్నాయి. అనకాపల్లి, నర్సీపట్నం, యలమంచిలి మున్సిపాలిటీల్లోని కొన్ని ప్రాంతాలు ఇప్పటికీ ముంపులోనే ఉన్నాయి. రహదారుల్లో అడ్డంగా కూలిన వక్షాలను తొలగించినా రోడ్డుకిరువైపులా వాటిని అలాగే వదిలేయడంతో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. మురుగునీటి కాలువలు దోమల పెంపకం కేంద్రాలుగా మారిపోతున్నాయి. ఐదు రోజులుగా విద్యుత్ సరఫరా లేకపోవడంతో చాలా ప్రాంతాల్లో ఇళ్ల అవసరాలకు కలుషిత నీటినే జనం వినియోగించాల్సిన దుస్థితి. పారిశుద్ధ్య నిర్వహణ కూడా నామమాత్రంగానే ఉంది. అంటువ్యాధుల భయం ప్రజలను వెంటాడుతోంది. పేదప్రజలు ఉన్నచోటే ఎక్కువ సహాయక చర్యలు ఉంటున్నాయి. మధ్య తరగతివారిని పట్టించుకునేవారే కరువయ్యారు. మన్యంలోని మారుమూల గూడేల్లో పరిస్థితి దుర్భరంగా ఉంది. ఇళ్ల పరిసరాల్లోనే పశువులశాలలు ఉండడంతో పరిస్థితి దుర్భరంగా ఉంది.