breaking news
Home loan company
-
హెచ్డీఎఫ్సీ మెగా విలీనం!
సుమారు ఎనిమిదేళ్లుగా ఊహిస్తున్న అతిపెద్ద కార్పొరేట్ విలీనానికి తాజాగా అడుగు పడింది. ఫైనాన్షియల్ రంగ దిగ్గజాలు హెచ్డీఎఫ్సీ ట్విన్స్ ఒక్కటికానున్నాయి. రెరా అమలు తదుపరి ఇటీవల స్పీడందుకున్న గృహ రుణ రంగంలోని అవకాశాలను మరింత సమర్థవంతంగా అందిపుచ్చుకునేందుకు రెండు సంస్థలు విలీనానికి తెరతీశాయి. వెరసి హెచ్డీఎఫ్సీ బ్యాంక్తో హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్(హెచ్డీఎఫ్సీ) విలీనంకానుంది. సంయుక్త సంస్థ ఆస్తుల విలువ దాదాపు రూ. 18 లక్షల కోట్లుకాగా.. డీల్ విలువ 40 బిలియన్ డాలర్లుగా నిపుణులు పేర్కొంటున్నారు. న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగంలో నంబర్ వన్ సంస్థ హెచ్డీఎఫ్సీ బ్యాంకుతో దేశీయంగా అతిపెద్ద గృహ రుణ కంపెనీ హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ విలీనంకానుంది. ఇది దేశ కార్పొరేట్ చరిత్రలోనే అతిపెద్ద విలీనంకాగా.. దీంతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మరింత భారీ రూపాన్ని సంతరించుకోనుంది. 42:25 నిష్పత్తిలో విలీనాన్ని చేపట్టనున్నట్లు రెండు సంస్థలూ వెల్లడించాయి. అంటే హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ వాటాదారుల వద్దగల ప్రతీ 25 షేర్ల స్థానే 42 హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు జారీ కానున్నాయి. రెండు సంస్థలు ఎక్సే్ఛంజీలకు ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ డీల్ పూర్తయితే హెచ్డీఎఫ్సీ బ్యాంకులో పబ్లిక్ వాటాదారుల వాటా 100 శాతానికి చేరనుంది. దీనిలో ప్రస్తుత హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ వాటాదారులకు 41 శాతం వాటా లభించనుంది. విలీనానికి ఆర్బీఐ తదితర నియంత్రణ సంస్థలనుంచి అనుమతులు లభించవలసి ఉంది. అనుబంధ సంస్థలు హెచ్డీఎఫ్సీ హోల్డింగ్స్, హెచ్డీఎఫ్సీ ఇన్వెస్ట్మెంట్స్ సైతం విలీనంలో భాగంకానున్నాయి. విలీనం తదుపరి హెచ్డీఎఫ్సీ విలీనంతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కొత్తగా గృహ రుణ పోర్ట్ఫోలియోను నిర్మించుకోనుంది. కస్టమర్ల సంఖ్యను సైతం భారీగా పెంచుకోనుంది. ప్రస్తుతం హెచ్డీఎఫ్సీ మొత్తం రూ. 6.23 లక్షల కోట్ల ఆస్తులను కలిగి ఉంది. ఇదే సమయంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఆస్తులు రూ. 19.38 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 6.8 కోట్ల కస్టమర్ బేస్ను కలిగి ఉంది. దీర్ఘకాలిక రుణాలకు పెరుగుతున్న డిమాండుకు అనుగుణమైన విభిన్న చౌక వ్యయాలతోకూడిన మూలధన అవకాశాలను కలిగి ఉంది. ఈ విలీనంతో బ్యాంకుకు మరింత విలువ చేకూరనున్నట్లు హెచ్డీఎఫ్సీ పేర్కొంది. భారీ బ్యాలన్స్షీట్, నెట్వర్త్ ద్వారా బ్యాంక్ లబ్ది పొందనున్నట్లు తెలియజేసింది. మౌలిక రంగం తదితర అతిభారీ రుణాల అండర్రైటింగ్కు వీలు చిక్కడం తోపాటు.. దేశ ఆర్థిక వ్యవస్థలోకి అత్యధికంగా రుణాలు విడుదలయ్యేందుకు దారి ఏర్పడనున్నట్లు అభిప్రాయపడింది. గృహ రుణ విడుదల సులభతరం కానున్నదని, ఇందుకు బ్యాంకుకున్న 6.8 కో ట్ల కస్టమర్ల బేస్ దన్నునివ్వనున్నదని వివరించింది. పలు బ్రాంచీలు మధ్య, అల్పాదాయ వర్గాలకు గృహ రుణాలు మంజూరు చేయడంలో హెచ్డీఎఫ్సీ ఎంతో ముందుంది. అందుబాటు ధరల గృహాలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతలో భాగంగా కంపెనీ పలు రుణాలు విడుదల చేసింది. 6,342 బ్రాంచీల ద్వారా దేశవ్యాప్తంగా 3,000 నగరాలు, పట్టణాలలో కార్యకలాపాలు విస్తరించింది. విలీనం ద్వారా ఈ పంపిణీ వ్యవస్థ హెచ్డీఎఫ్సీ బ్యాంకులో భాగం కానుండటంతో గృహ రుణ మంజూరీ మరింత విస్తరించనుంది. మార్టిగేజ్ పోర్ట్ఫోలియోతోపాటు, పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో పంపిణీ వ్యవస్థ చేజిక్కనుండటంతో బ్యాంక్ భారీగా బలపడనుంది. వెరసి రెండు సంస్థల మధ్య విలీ నం పలు విధాల లబ్ది చేకూర్చనుంది. రూ. 18 లక్షల కోట్లు సంయుక్త సంస్థ బ్యాలన్స్షీట్ రూ. 17.87 లక్షల కోట్లకు చేరనున్నట్లు హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పరేఖ్ పేర్కొన్నారు. నెట్వర్త్ రూ. 3.3 లక్షల కోట్లను తాకనున్నట్లు తెలియజేశారు. బ్యాంకులు, బ్యాంకింగేతర సంస్థ(ఎన్బీఎఫ్సీ)ల మధ్య నిబంధనలు క్రమబద్ధీకరించడంతో నియంత్రణ సంస్థల మధ్యవర్తిత్వ అవసరాన్ని తగ్గించినట్లు వివరించారు. ఇది రెండు సంస్థల విలీన నిర్ణయంలో ఒక కీలకాంశంగా నిలిచినట్లు వెల్లడించారు. గత మూడు వారాలుగా విలీన చర్చలు జరుగుతున్నాయని, నిబంధనలకు అనుగుణంగా మొండిబకాయిల గుర్తింపు తదితర పలు అంశాలను సరైన విలువలో మదింపు చేయవలసి వచ్చిందని తెలియజేశారు. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీగా ప్రాధాన్యతా రంగ రుణ విడుదల తప్పనిసరికాకపోగా.. లయబిలిటీల కోసం చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి(ఎస్ఎల్ఆర్) లేదా నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్ఆర్)ని నిర్వహించవలసిన అవసరంకూడా లేదని పేర్కొన్నారు. దీంతో ఆస్తి, అప్పుల సమన్వయానికి ఆర్బీఐ నుంచి గడువును కోరవలసి వచ్చినట్లు వెల్లడించారు. విలీనానికి నియంత్రణ సంస్థలు అనుమతిస్తాయని విశ్వసిస్తున్నట్లు చెప్పారు. విలీనంతో హెచ్డీఎఫ్సీ ఉద్యోగులపై ఎలాంటి ప్రభావమూ ఉండబోదని స్పష్టం చేశారు. ఆర్బీఐ నోటిఫికేషన్తో.. ఎనిమిదేళ్ల క్రితమే బీజం ఆర్బీఐ జారీ చేసిన నోటిఫికేషన్తో హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మధ్య విలీనానికి దాదాపు ఎనిమిదేళ్ల క్రితమే బీజం పడినట్లు తెలుస్తోంది. మౌలిక సదుపాయాలు, చౌక ధరల గృహాలకు రుణాలు సమకూర్చేందుకు వీలుగా దీర్ఘకాలిక బాండ్ల జారీకి బ్యాంకులను అనుమతిస్తూ రిజర్వ్ బ్యాంక్ 2014 జూలైలో నోటిఫికేషన్ జారీ చేసింది. తద్వారా ఈ మార్గంలో సమీకరించిన నిధులకు బ్యాంకులు ఎస్ఎల్ఆర్ లేదా సీఆర్ఆర్ను నిర్వహించవలసిన అవసరంలేదంటూ పేర్కొంది. అంతేకాకుండా ఈ నిధులను ప్రాధాన్యతా రంగ రు ణ లక్ష్యాలకు తప్పనిసరిగా కేటాయించవలసిన అవస రంలేదని స్పష్టం చేసింది. దీంతో అప్పట్లో హెచ్డీఎఫ్సీ ద్వయం మధ్య విలీన అంశం చర్చకు వచ్చినట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే వీటిని రెండు సంస్థల కీలక అధికారులు తోసిపుచ్చారు! అయితే ఎనిమిదేళ్ల అనంతరం ఇది కార్యరూపం దాల్చడం ప్రస్తావించదగ్గ విషయం! 1994 నుంచీ..: హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1994 నుంచీ విడిగానే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఆదిత్య పురీ నేతృత్వంలో బ్యాంక్ కార్యకలాపాలు 1994లో ప్రారంభమయ్యాయి. దీపక్ పరేఖ్ కోరికమేరకు విదేశీ బ్యాంకింగ్ దిగ్గజం సిటీని వీడిన పురీ హెచ్డీఎఫ్సీ బ్యాంకు పగ్గాలు చేపట్టారు. బ్యాంకులో మాతృ సంస్థ హెచ్డీఎఫ్సీకి 21% వాటా ఉంది. 2020 అక్టోబర్లో శశిధర్ జగదీశన్ బ్యాంక్ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. బ్యాంక్ నంబర్ టూ ఎస్బీఐ తదుపరి హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ మదింపు మార్టిగేజ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీని విలీనం చేసుకోనున్న హెచ్డీఎఫ్సీ బ్యాంక్ దేశీయంగా అతిపెద్ద బ్యాంకుల్లో రెండో ర్యాంకులో నిలవనున్నట్లు ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ తాజాగా పేర్కొంది. తొలి స్థానంలో పీఎస్యూ దిగ్గజం స్టేట్బ్యాంక్(ఎస్బీఐ) కొనసాగనున్నట్లు తెలియజేసింది. అయితే విలీన సంస్థ మరో ప్రయివేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ పరిమాణంకంటే రెట్టింపు స్థాయికి చేరనున్నట్లు వివరించింది. విలీనంతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. 15 శాతం మార్కెట్ వాటాతోపాటు, డైవర్సిఫైడ్ ఆదాయాన్ని సొంతం చేసుకోనున్నట్లు తెలియజేసింది. ప్రస్తుతం బ్యాంక్ మార్కెట్ వాటా 11 శాతంగా నమోదైనట్లు తెలిపింది. పోర్ట్ఫోలియోలో మార్టిగేజ్ రుణాల వాటా ప్రస్తుత 11 శాతం నుంచి మూడోవంతుకు చేరనున్నట్లు వివరించింది. హెచ్డీఎఫ్సీకి భారీ సంఖ్యలోగల కస్టమర్ల ద్వారా లబ్ది పొందనున్నట్లు పేర్కొంది. చౌకలో నిధుల సమీకరణకు వీలు చిక్కుతుందని తెలియజేసింది. కాగా, బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న రెండో రివర్స్ మెర్జర్ ఇది. ఇంతక్రితం ఐసీఐసీఐ లిమిటెడ్ సైతం ఐసీఐసీఐ బ్యాంకులో విలీనమైంది. 2001 అక్టోబర్లో అనుబంధ సంస్థ ఐసీఐసీఐ బ్యాంకులో మాతృ సంస్థ ఐసీఐసీఐ లిమిటెడ్ కలిసింది. దిగ్గజాల మధ్య... ఇది రెండు సమాన దిగ్గజాల మధ్య జరుగుతున్న విలీనం. హౌసింగ్ ఫైనాన్స్ బిజినెస్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతోంది. రెరా అమలు, గృహ రంగానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోదా, చౌక ధరల గృహాలకు ప్రభుత్వ తోడ్పాటు దీనికి దోహదం చేస్తున్నాయి. –దీపక్ పరేఖ్, చైర్మన్, హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ గ్లోబల్ స్థాయికి... తాజా విలీనంతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అంతర్జాతీయ ప్రమాణాలతో చూసినా భారీ సంస్థగా ఆవిర్భవించనుంది. తద్వారా బ్యాంకులో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) పెట్టుబడులకు మరింత వీలు చిక్కనుంది. రెండు సంస్థల మధ్య విలీనం 12–18 నెలల్లో పూర్తికావచ్చు. –కేకి మిస్త్రీ, వైస్చైర్మన్, సీఈవో, హెచ్డీఎఫ్సీ షేర్ల దూకుడు రెండు సంస్థల మధ్య విలీన వార్తల నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ లిమిటెడ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కౌంటర్లకు ఒక్కసారిగా డిమాండ్ ఊపందుకుంది. ఎన్ఎస్ఈలో హెచ్డీఎఫ్సీ షేరు 9% ఎగసి రూ. 2,676 వద్ద నిలిచింది. ఒక దశలో గరిష్టంగా 19% దూసుకెళ్లి రూ. 2,934ను తాకింది. ఇక హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 10% జంప్చేసి రూ. 1,654 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 1,722 వరకూ ఎగసింది. తద్వారా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ విలువ రూ. 9,18,591 లక్షలను కోట్లను తాకగా.. హెచ్డీఎఫ్సీ మార్కెట్ విలువ రూ. 4,85,691 కోట్లను అధిగమించింది. సంయుక్తంగా చూస్తే రూ. 14 లక్షల కోట్లను దాటడం ద్వారా ఆర్ఐఎల్, టీసీఎస్ సరసన చేరింది! -
దివాలా కోడ్కు మరిన్ని సవరణలు
న్యూఢిల్లీ: దివాలా పరిష్కార ప్రక్రియను క్రమబద్ధీకరించే దిశగా దివాలా కోడ్ (ఐబీసీ)లో మరిన్ని సవరణలకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. దీనితో పాటు ఇతరత్రా పలు ప్రతిపాదనలకు కూడా ఆమోదం తెలుపుతూ కేంద్ర క్యాబినెట్ బుధవారం నిర్ణయం తీసుకుంది. ఐబీసీ సవరణలకు సంబంధించి.. దివాలా తీసిన సంస్థలను కొనుగోలు చేసిన బిడ్డర్లకు ఊరట లభించే ప్రతిపాదనలు వీటిలో ఉన్నాయి. వీటి ప్రకారం ఆయా కంపెనీల గత ప్రమోటర్లు చేసిన తప్పిదాలకు కొత్త యాజమాన్యం.. క్రిమినల్ విచారణ ఎదుర్కొనాల్సిన అవసరం ఉండదు. 2016లో అమల్లోకి వచ్చిన ఐబీసీకి ఇప్పటికే మూడు సార్లు సవరణలు చేశారు. తాజాగా కొన్ని సెక్షన్లను సవరించడంతో పాటు కొత్తగా మరో సెక్షన్ను చేర్చారు. ఐబీసీ (రెండో సవరణ) బిల్లును ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టే అవకాశం ఉందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం దివాలా పరిష్కార ప్రక్రియ ముగిసిన తర్వాత కూడా దర్యాప్తు సంస్థలు ఆయా కంపెనీల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవడం కొనసాగిస్తున్నాయి. దీంతో దివాలా సంస్థల కొనుగోలుకు ఇన్వెస్టర్లు వెనుకాడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజా సవరణలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎన్బీఎఫ్సీలకు బాసట.. సంక్షోభంలో ఉన్న నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు(ఎన్బీఎఫ్సీ), గృహ రుణ సంస్థలకు (హెచ్ఎఫ్సీ) ఊరటనిచ్చే స్కీమునకు కేంద్రం ఆమోదం తెలిపింది. దీని ప్రకారం.. ఆర్థికంగా బలంగా ఉన్న ఎన్బీఎఫ్సీలు, హెచ్ఎఫ్సీలకు సంబంధించిన అత్యధిక రేటింగ్ గల ఆస్తులను కొనుగోలు చేసే ప్రభుత్వ రంగ బ్యాంకులకు (పీఎస్బీ) ప్రభుత్వం పాక్షికంగా రుణ హామీ కల్పిస్తుంది. ఆయా అసెట్స్ విలువలో పది శాతం లేదా రూ. 10,000 కోట్ల దాకా (ఏది తక్కువైతే అది) నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు ఈ పూచీకత్తు ఉపయోగపడుతుంది. 2020 జూన్ దాకా ఆరు నెలల పాటు లేదా రూ. 1,00,000 కోట్ల అసెట్స్ కొనుగోలు పూర్తయ్యేదాకా ఈ స్కీము అమల్లో ఉంటుంది. అవసరమైతే దీన్ని మరో మూడు నెలల పాటు ఆర్థిక మంత్రి పొడిగించవచ్చు. ఎన్హెచ్ఏఐ ‘ఇన్విట్’... ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (ఇన్విట్) ఏర్పాటు చేసేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఏఐకి అనుమతినిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. మ్యూచువల్ ఫండ్స్ తరహాలోనే ఇది కూడా పలువురు ఇన్వెస్టర్ల నుంచి నిధులు సమీకరించి, ఇన్ఫ్రా అసెట్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది. దీర్ఘకాలంలో ఇన్వెస్టర్లకు రాబడులు అందిస్తుంది. దాదాపు రూ. 5,35,000 కోట్ల పెట్టుబడితో దేశవ్యాప్తంగా 24,800 కి.మీ. మేర రహదారులు అభివృద్ధి చేసే దిశగా 2017 అక్టోబర్లో కేంద్రం భారత్మాలా పరియోజన కార్యక్రమాన్ని ఆవిష్కరించింది. ఈ ప్రాజెక్టుల పూర్తికి భారీ స్థాయిలో నిధులు అవసరమవుతాయి. -
10% పెరిగిన హెచ్డీఎఫ్సీ లాభం
ఒక్కో షేర్కు రూ.13 డివిడెండ్ ముంబై : గృహ రుణాల సంస్థ హెచ్డీఎఫ్సీ 2014-15 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ. 2,646 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇది అంతక్రితం ఆర్థిక సంవత్సరం క్యూ4లో లాభం రూ. 2,415 కోట్లతో పోలిస్తే 9.6 శాతం అధికం. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం రూ. 12,266 కోట్ల నుంచి రూ. 14,726 కోట్లకు పెరిగింది. 2014-15కి గాను రూ. 2 ముఖ విలువ గల షేరుపై రూ. 13 చొప్పున తుది డివిడెండు ఇవ్వాలని సంస్థ బోర్డు ప్రతిపాదించింది. దీంతో మధ్యంతర డివిడెండ్ రూ. 2 కూడా కలుపుకుంటే మొత్తం రూ. 15 మేర లభించినట్లవుతుంది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను కంపెనీ నికర లాభం 10.2 శాతం వృద్ధితో రూ. 8,763 కోట్లకు చేరగా, ఆదాయం రూ. 40,753 కోట్ల నుంచి రూ. 48,316 కోట్లకు పెరిగింది. ప్రత్యేక రిజర్వ్లపై కట్టాల్సిన పన్ను కోసం రూ. 384 కోట్లు పక్కన పెట్టినట్లు హెచ్డీఎఫ్సీ వైస్ చైర్మన్ కేకి మిస్త్రీ తెలిపారు. కాగా, బీమా విభాగం హెచ్డీఎఫ్సీ లైఫ్లో భాగస్వామ్యం ఉన్న స్టాండర్డ్ లైఫ్ తన వాటాలను పెంచుకున్నాకే సంస్థను లిస్టింగ్ చేయనున్నట్లు మిస్త్రీ వివరించారు. ప్రస్తుతం ఈ జేవీలో హెచ్డీఎఫ్సీకి 71.42% వాటాలు, బ్రిటన్కు చెందిన స్టాండర్డ్ లైఫ్కి 26% వాటాలు ఉన్నాయి. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో హెచ్డీఎఫ్సీ షేరు 2 శాతం పైగా క్షీణించి రూ. 1,202 వద్ద ముగిసింది.