breaking news
Hindu-Muslim couple
-
చట్టాన్ని పక్కనపెట్టి చిన్నారికి బర్త్ సర్టిఫికెట్
దుబాయ్: హిందూ, ముస్లిం దంపతులకు జన్మించిన ఓ 9నెలల చిన్నారికి జనన ధ్రువీకరణ పత్రం జారీ చేయడం ద్వారా యూఏఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) ప్రభుత్వం ఔదార్యతను చాటుకుంది. నిబంధనలను పక్కన పెట్టి మరీ భారత్కు చెందిన హిందూ తండ్రి, ముస్లిం తల్లికి జన్మించిన పాపకు బర్త్ సర్టిఫికెట్ జారీ చేసినట్లు మీడియా తెలిపింది. యూఏఈలోని వివాహ చట్టం ప్రకారం ఓ ముస్లిం వ్యక్తి వేరే మతానికి చెందిన మహిళను వివాహమాడొచ్చు. కానీ ఓ ముస్లిం మహిళ మాత్రం ముస్లిమేతర వ్యక్తిని వివాహం చేసుకోరాదు. హిందువైన కిరణ్ బాబు, ముస్లిం యువతి సనమ్ సాబూ సిద్ధికీ 2016లో కేరళలో వివాహం చేసుకున్నారు. షార్జాలో నివాసముంటున్నారు. వీరికి జూలై 2018లో పాప జన్మించింది. కిరణ్ హిందువు కావడంతో అతని కూతురికి జనన ధ్రువీకరణ పత్రం ఇచ్చేందుకు ఆసుపత్రి వైద్యులు నిరాకరించారు. ఆ తర్వాత కోర్టుకు వెళ్లినా నిరాశే ఎదురైంది. దీంతో యూఏఈ ప్రభుత్వం క్షమాభిక్షౖకు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో నిబంధనలు మార్చి అధికారులు జనన ధ్రువీకరణ పత్రం జారీ చేశారు. దేశంలో ఇదే మొదటిసారి అని కిరణ్ పేర్కొన్నారు. ఈ విషయంలో తనకు సహకరించిన ఇండియన్ ఎంబసీ కౌన్సిలర్ ఎమ్.రాజమురుగన్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఔదార్యతను ప్రదర్శించే దేశంగా ముందుండటానికి యూఏఈ 2019 సంవత్సరాన్ని ఇయర్ ఆఫ్ టాలరెన్స్గా ప్రకటించింది. రెండు భిన్న సంస్కృతులను కలిపేలా, ఇతర మతంలోని వారిని అనమతించే దిశగా ఈ చర్యలు చేపట్టింది. -
‘మా పెళ్లి ఎందుకు రిజిస్టర్ చేయరు?’
రాంచి: ప్రేమే నేరమౌనా, పెళ్లే భారమౌనా! అని బాధ పడుతోంది ఉత్తరప్రదేశ్కు చెందిన ఆ యువజంట. గత ఆరు నెలలుగా జిల్లా అధికారుల చుట్టూ కాళ్లు కందిపోయేలా తిరుగుతున్నా వారి పెళ్లిని అధికారులు రిజిస్టర్ చేయడం లేదు. ఆ భార్యాభర్తలు ఇరుమతాలకు చెందిన వారవడం వల్ల వారి పెళ్లిని రిజిస్టర్ చేస్తే రాష్ట్రంలో, ముఖ్యంగా దాద్రిలో మత ఘర్షణలు చెలరేగుతాయని అధికారులు చెబుతున్నారు. ఓ ముస్లిం కుటుంబం ఫ్రిజ్లో ఆవు మాంసాన్ని దాచుకున్నారనే అనుమానంతో ఆ కుటుంబానికి చెందిన ముస్లిం పెద్దను హిందూ మూకలు హత్య చేయడం, పర్యవసానంగా మత కలహాలు చెలరేగడం తెల్సిందే. 24 ఏళ్ల మనోజ్ భాటి హిందువు. 20 ఏళ్ల సల్మా ముస్లిం మతస్థురాలు. వీరిద్దరు దాద్రి పట్టణానికి సమీపంలోని చిటెహ్రా గ్రామానికి చెందినవారు. చిన్నప్పటి నుంచి ఇద్దరు పరిచయస్థులు. ఏడాదిపాటు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. దానికోసం గతేడాది అక్టోబర్ 19వ తేదీన అలహాబాద్ నగరానికి పారిపోయారు. సల్మాకు తల్లిదండ్రులు పెళ్లి చేయాలనుకున్నారు. వారు మనోజ్ భాటిపై కిడ్నాప్ కేసు పెట్టారు. మనోజ్తోపాటు అలహాబాద్ వెళ్లిన సల్మా అక్కడ హిందూ మతాన్ని స్వీకరించారు. తన పేరును స్వప్నా ఆర్యగా మార్చుకున్నారు. అనంతరం ఆ జంట ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఆర్య సమాజ్ ఇచ్చిన పెళ్లి సర్టిఫికెట్తో దాద్రికి తిరిగొచ్చారు. తాను మైనర్ను కాదని, మేజర్నని స్టడీ సర్టిఫికెట్, వైద్య పరీక్షల ద్వారా నిరూపించుకున్నారు. ఫలితంగా మనోజ్పై దాఖలైన కిడ్నాప్ కేసును పోలీసులు ఎత్తివేశారు. తమ పెళ్లిని రిజిస్టర్ చేయించుకోవడం కోసం ఆ యువజంట దాద్రి రిజిస్టర్ ఆఫీసుకు వెళ్లింది. అయితే వారి పెళ్లిని రిజిస్టర్ చేయడానికి అక్కడి ఉన్నతాధికారి నిరాకరించారు. దాద్రిలో గొడవలు జరుగుతాయన్న నెపంతోనే పెళ్లి రిజిస్ట్రేషన్ను నిరాకరించారని ఆ యువజంట చెబుతోంది. పెళ్లి రిజిస్టర్ చేయాలంటే అక్కడి ఉన్నతాధికారి తమను 20 వేల రూపాయల లంచం అడిగారని మనోజ్ మీడియా ముందు ఆరోపించారు. అప్పటి నుంచి నేటి వరకు ఆ జంట జిల్లా అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉంది. ఈ విషయంలో తాము జిల్లా మేజిస్ట్రేట్, జిల్లా అదనపు మేజిస్ట్రేట్, సీనియర్ మేజిస్ట్రేట్, ఇలా అందరిని కలుసుకున్నామని, ఇంతవరకు ఎవరు కూడా తమకు న్యాయం చేయలేక పోయారని మనోజ్ ఆరోపించారు. చివరకు రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్కు కూడా లేఖ రాశామని, ఇంతవరకు ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదని ఆయన వాపోయారు. షారూక్ ఖాన్, ఆమిర్ ఖాన్ లాంటి సెలబ్రిటీలు హిందూ మహిళలను వివాహమాడినా సమాజంలో మతాతీత పెళ్లిళ్లను ఎందుకు అనుమతించడం లేదో తనకు అర్థం కావడం లేదని మనోజ్ వ్యాఖ్యానించారు. ఏ అధికారి అయినా దాద్రి సంఘటనను సాకుగా చూపిస్తున్నారని, వాస్తవానికి ఆ సంఘటన తర్వాత ఎన్ని వదంతులు ప్రచారమైనా దాద్రిలో మతసామరస్యం దెబ్బతినలేదని మనోజ్ తెలిపారు. పైగా తమ పెళ్లి ఇరు మతాల ఐక్యతకు సంకేతంగా నిలుస్తుందని అంటున్నారు.