breaking news
Health-prevention
-
అంతులేని అంతరం
ప్రపంచవ్యాప్తంగా స్త్రీ, పురుష అంతరాలకు అద్దంపట్టే ‘గ్లోబల్ ర్యాంకింగ్’లో భారత పరిస్థితి ఏ మాత్రం మారలేదు. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) 149 దేశాలపై వెలువరించిన జెండర్ గ్యాప్ రిపోర్టు, 2018 ప్రకారం భారత్ ర్యాంకు 108. గత సంవత్సరంలోనూ భారత్ ఇదే ర్యాంకుతో సరిపెట్టుకుంది. ఆర్థిక భాగస్వామ్యం– అవకాశాలు, విద్య, ఆరోగ్యం– మనుగడ, రాజకీయ సాధికారత అంశాల (సబ్ ఇండెక్స్) ఆధారంగా డబ్ల్యూఈఎఫ్ఈ ర్యాంకులిచ్చింది. నివేదిక ప్రకారం భారత్ వేతన వ్యత్యాసాలను తగ్గించడంలో కొంత ప్రగతి సాధించింది. విద్యా రంగంలో 114వ స్థానంతో మెరుగైన పనితీరు కొనసాగించింది. స్త్రీలను ఆర్థికవ్యవహారాల్లో భాగస్వామిగా చేయడం, అవకాశాలు కల్పించడంలో వెనకబడింది. ఈ విభాగంలో భారత్ 142వ ర్యాంక్తో సరిపెట్టుకుంది. రాజకీయ సాధికారత విషయంలో గత ఏడాది 15వ ర్యాంక్రాగా, ఈసారి 19కి పడిపోయింది. స్త్రీల ‘ఆరోగ్యం– మనుగడ’ సూచీలో అట్టడుగుకు చేరింది. గత సంవత్సరం 141 స్థానంలో వుండగా ఈ యేడాది 147 స్థానానికి దిగజారింది. ఆర్మీనియా (148), చైనా (149) చివరి రెండు స్థానాల్లో వున్నాయి. ఈ విభాగంలో ఒకటో స్థానానికి చేరిన దేశాల్లో శ్రీలంక కూడా వుండటం విశేషం. ర్యాంకింగ్పరంగా తొలి 8 స్థానాల్లోని దేశాలు తమ దేశాల్లో 80 శాతం వరకు అసమానతలను రూపు మాపాయని నివేదిక తెలిపింది. ఇతర ప్రాంతాలతో పోల్చుకుంటే స్త్రీ పురుష అంతరాలను పూడ్చే దిశగా దక్షిణాసియాలో మెరుగైన కృషి జరిగిందని నివేదిక పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా సగటు తీసుకుంటే రాజకీయ సాధికారత విషయంలో ఎక్కువ అంతరం (77.1శాతం)ఉంది. ఆర్థిక భాగస్వామ్యం– అవకాశాల విషయంలోనూ (41.9శాతం) అంతరం ఎక్కువగా వుంది. విద్య (4.4శాతం),ఆరోగ్యం– మనుగడ (4.6శాతం) అంశాల్లో వ్యత్యాసాలను బాగా తగ్గించగలిగారు. మార్పు ఇలా మందగమనంతో సాగితే స్త్రీ పురుషుల మధ్య అంతరాలను మొత్తంగా రూపు మాపాలంటే మరో 108 ఏళ్లు పడుతుందని నివేదిక పేర్కొంది. 48వ ర్యాంకు సాధించిన బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ దక్షిణాసియా విభాగంలో టాప్ ర్యాంకు (48) సాధించింది. రాజకీయ సాధికారత విషయంలో ముందడుగేసి బంగ్లాదేశ్ మెరుగైన ర్యాంక్ పొందింది. అంతర్జాతీయంగా 8వ ర్యాంకు సాధించిన ఫిలిప్పీన్స్.. ఆసియాలో ర్యాంకింగ్ పరంగా తొలి స్థానంలో వుంది. చైనా 100 నుంచి 103కి దిగజారింది. పాకిస్తాన్ చివరి నుంచి రెండో స్థానంలో వుండగా, యుద్ధంతో సతమతమవుతున్న యెమెన్ చివరి స్థానంలో వుంది. అగ్రస్థానాన ఐస్ల్యాండ్ ఐరోపాలోని ఐస్ల్యాండ్, నార్వే, స్వీడన్ వరసగా మొదటి మూడు ర్యాంకులు సాధించాయి. ఫిన్లాండ్, నికరాగువా, రువాండా, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్ ఆ తర్వాత స్థానాల్లో వున్నాయి. బ్రిటన్ 15, కెనడా 16, అమెరికా 51, ఆస్ట్రేలియా 53వ ర్యాంకులు సొంతం చేసుకున్నాయి. -
పొగాకును నిషేధించాల్సి ఉంది
సాక్షి, బెంగళూరు: రాష్ట్రంలో పొగాకు ఉత్పత్తులను నిషేధించాల్సిన అవసరం ఉందని గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్వాలా అభిప్రాయపడ్డారు. ఈ మేరకు త్వరలో స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి ఆయన సూచించారు. ‘వృద్ధ వయస్సులో వచ్చే ఆరోగ్యసమస్యలు-నివారణ’ విషయమై బెంగళూరులో సోమవారం జరిగిన సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... 90 శాతం క్యాన్సర్ కేసుల్లో వ్యాధి కారకం పొగాకు ఉత్పత్తులేనని గణాంకాలు చెబుతున్నాయన్నారు. అందువల్ల పొగాకును నిషేధించాల్సి ఉంది ప్రాణాంతకమైన పొగాకును రాష్ట్రంలో నిషేధించడం అన్ని విధాల ఉత్తమమని వజుభాయ్ రుడాభాయ్ వాలా అభిప్రాయపడ్డారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవడం బాగుంటుందన్నారు. మారిన జీవన శైలి వల్ల ప్రజలు చిన్న వయసులోనే వివిధ రకాల వ్యాధులకు గురికావాల్సి వస్తోందన్నారు. అయితే శరీరానికి తగినంత శ్రమ ఇవ్వడం వల్ల చాలా రోగాల నుంచి దూరంగా ఉండవచ్చునని ఆయన పేర్కొన్నారు. వృద్ధులకు నాణ్యమైన వైద్యాన్ని అందించడానికి వీలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వినూత్న పథకాలను రూపొందించాలని సూచించారు. వృద్దాప్యంలో తల్లిదండ్రులకు ప్రతి ఒక్కరూ చేదోడువాదోడుగా ఉండాలని కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి దినేష్గుండూరావ్ పేర్కొన్నారు. కాగా, కార్యక్రమంలో భాగంగా వివిధ రాష్ట్రాలకు చెందిన వైద్య రంగ నిపుణులు ‘వృద్ధాప్య వయస్సులో వచ్చే ఆరోగ్యసమస్యలు-నివారణ విషయం పై రీసర్చ్పేపర్లను వెలువరించారు.