breaking news
Health authorities
-
గోలీల్లేవు.. డోలీలే...
అడవి బిడ్డల అరణ్యరోదన ఏజెన్సీ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాల కొరత.. 108 వాహనాలూ రాని వైనం.. డోలీపైనే ఆస్పత్రికి తరలింపు.. మరణిస్తున్న గర్భిణులు, శిశువులు.. ఆరు ఏజెన్సీ ప్రాంతాల్లో 1,722 డోలీలు నిత్యం మోతకోసమే అవి అడవి బిడ్డల ఆవాసాలు. ప్రకృతి రమణీయతకు మారు పేరు. అయితే అక్కడి వారికి రోగమొస్తే ప్రాణాలు గాలిలోనే! కొండలు, కోనల్లో మందులు దొరకవు. వైద్యులు రారు. రవాణా సౌకర్యాలు లేక కనీసం అంబులెన్సు వాహనాలు కూడా వెళ్లలేవు. అత్యవసర పరిస్థితి తలెత్తితే.. నలుగురైదుగురు కలిసి అడవిలో, వాగులూ, వంకలూ దాటుతూ మైళ్ల దూరం రోగులను డోలీ (కట్టెకు గుడ్డ కట్టి ఊయలలా ఉండేవి) లపైనే మోసు కెళ్లాలి. ఈలోపు రోగి పడే బాధ వర్ణనా తీతం. మోసుకెళ్లేవారిది అంతులేని కష్టం. ఆసుపత్రికి తీసుకెళ్లే వరక బతికుంటే అదృష్టమే. మార్గమధ్యంలో ప్రసవ వేదనతో మరణిస్తున్న గర్భిణీలు, గుండెపోటు రోగుల సంఖ్య ఎక్కువే. గర్భస్థ శిశుమరణాలూ ఎక్కువే. వీటికి తోడు ప్రభుత్వం, అధికారుల అలసత్వంతో గిరిజనం పడే అవస్థలు వర్ణనా తీతం. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మొత్తం ఆరు ఏజెన్సీల పరిధిలో సుమారు 456 శివారు ప్రాంతాలు ఇప్పటికీ రవాణా సౌకర్యం లేదు. పాము కాలేసినా, తేలుకుట్టినాకూడా మైళ్లదూరం డోలీలపై వెళ్లాల్సిందే. ఏజెన్సీ శివారు ప్రాంతాలకు ఇప్పటికీ చంద్రన్న సంచార చికిత్స వాహనాలు గానీ, 108 అంబులెన్సులు గానీ వెళ్లలేని దుస్థితి. రవాణా సమస్యతో కనీసం వైద్య సిబ్బంది కూడా అటువైపు కన్నెత్తి చూడటంలేదు. ఎప్పుడైనా ప్యాంటు షర్టు వేసుకుని కొత్త మనిషి కనిపిస్తే చాలు ఎవరైనా ఆరోగ్యశాఖ అధికారులు మందులు తెచ్చారేమోనని ఆశతో ఎదురెళ్లే దయనీయ స్థితి. ఇటీవల పాడేరుకు చెందిన ఓ వ్యక్తి తన ఐదేళ్ల కూతురు నీటిలో మునిగి మృతి చెందితే...మృతదేహాన్ని ఆసుపత్రినుంచి ఇంటికి పధ్నాలుగు కిలోమీటర్లు మోసుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. ఇటువంటివి ఏజెన్సీలో నిత్యకృత్యం. రాష్ట్రంలోని సీతంపేట, పార్వతీపురం, పాడేరు, రంపచోడవరం, కేఆర్ పురం, శ్రీశైలం, ఎటపాక ఏజెన్సీల్లో రోజూ ఇలాంటివి కనిపిస్తూనే ఉన్నాయి. ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో 155 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలుంటే 75 సెంటర్లలో వైద్యులు అందుబాటులో లేరు. ఆరు ఏరియా ఆస్పత్రులుంటే స్పెషలిస్టులు ఒక్కరంటే ఒక్కరూ సమయానికి రావడంలేదు. వారి కోసం రోగులు పనులు మానుకుని ఎదురు చూడాల్సిందే. డోలీలు మోసేవారు లేకపోతే... ఏజెన్సీ ప్రాంతాల్లో జబ్బు చేసిన వారికి, ప్రమాదవశాత్తు గాయపడిన వారికి డోలీలు, వాటిని మోసేవారు లేకపోతే వారికి మృత్యువు సమీపించినట్టే. ఆరు ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటికే 1,722 డోలీలు అందుబాటులో ఉన్నాయి. వీటితోనే రోజూ రోగులను తరలిస్తున్నారు. విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీలో అసలు రవాణా సౌకర్యాలు లేవు. ఈ గ్రామాలకు 108 అంబులెన్సులు గానీ, 104 వాహనాలూ గానీ వెళ్లలేవు. డోలీలే దిక్కు. పైగా మలేరియా, చికెన్ గున్యా, డెంగీ లాంటి దోమకాటు జ్వరాలు తీవ్రంగా ఉండటంతో ఎక్కువ మరణాలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం ఈ ప్రాంతంలో 1272 పల్లకీలు అందుబాటులో ఉన్నాయి. వీటిని పెంచాల్సిన అవసరం కూడా ఉంది. పిట్టల్లా రాలుతున్న గర్భిణీలు ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రధానంగా ప్రసవానికి వచ్చే తల్లులు ఎక్కువగా మృతి చెందుతున్నారు. డోలీలో తీసుకెళుతున్నా సకాలంలో ఆస్పత్రులకు వెళ్లలేని పరిస్థితి. దీంతో ఆస్పత్రులకు వెళ్లకమునుపే మార్గమధ్యంలో తనువు చాలిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. గడిచిన ఆరు మాసాల్లోనే సకాలంలో వైద్యమందక ప్రసవానికి వెళ్లిన 72 మంది తల్లులు మృతి చెందారు. ఇక శిశువుల మరణాలూ లెక్కలేనన్ని. ఆఖరి క్షణంలో ఆసుపత్రులకు చేరి తల్లి, బిడ్డా మరణిస్తున్న సంఘటనలు కోకొల్లలు. ప్రసవ సమయంలో సరైన రవాణా సౌకర్యం లేక, సకాలంలో వైద్యం అందక మరణాలు చోటు చేసుకుంటున్నట్టు యునిసెఫ్, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లు్యహెచ్ఓ) లాంటి అంతర్జాతీయ సంస్థలే నిర్ధారించాయి. డోలీలో రవాణా సమయం ఎక్కువ. గుండెపోటు వస్తే బతికి బట్టకట్టేవారు చాలా అరుదు. డోలీల్లో కదలికలు, కుదుపులు ఎక్కువే. అందువల్ల ఆ సమయంలో రోగులపడే బాధ వర్ణనాతీతం. ఈ నరకం భరించడంకంటే చావే నయమని రోగులు రోధిస్తున్న తీరు డోలీలు మోసేవారికే కన్నీరు తెప్పిస్తున్నాయంటో పరిస్థితి తీవ్రత ఎల ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. పింఛన్ల కోసం... ఇక పింఛన్ల కోసం వయో వృద్ధులు కూడా మైళ్ల దూరం డోలీలపైనే వెళతారు. కేవలం రూ. 1,500 రూపాలయ పింఛన్ కోసం రూ. 500ల దాకా ఖర్చు పెట్టాల్సి వస్తోంది. పాడేరు మండలంలోని వంజంగి పంచాయితీ పోతు రాజుమెట్ట గ్రామంలో గతేడాది నవంబర్ 13న ఐదేళ్ల కొర్రా సంధ్య పువ్యులు కోయడానికి వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడింది. ఆస్పత్రి లేక వైద్యసేవలు అందక మృతి చెందింది. మరుసటిరోజు బాలిక మృతదేహానికి పోస్టుమార్టంకు ఆమె బంధువు 10 కిలోమీటర్లు కాలినడకన, మరో 6 కి.మీ దూరం బైక్పైన మృతదేహాన్ని పాడేరు ఏరియా ఆస్పత్రికి ఇలా తరలించారు. -
‘హద్దు’ దాటి వైద్యం
► ప్రైవేటును తలపిస్తున్న ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యశాలలు ► ప్రజల ప్రాణాలతో చెలగాటం ► ఫిర్యాదులు వస్తున్నాస్పందించని యంత్రాంగం ► ఎక్కడికక్కడ ‘మామూళ్ల’ పర్వం హిందూపురంలోని చౌడేశ్వరీ కాలనీలో ఉన్న ఓ వైద్యశాలను నాలుగు రోజుల క్రితం జిల్లా వైద్యాధికారులు తనిఖీ చేశారు. నిర్వాహకురాలికి వైద్యశిక్షణ పొందినట్లు ధ్రువీకరణ లేదు. అసలు ఆ వైద్యశాలకు ప్రభుత్వ అనుమతే లేదన్న విషయాన్ని గుర్తించారు. దీంతో ఆస్పత్రిని మూసేసి.. మందులను సీజ్ చేశారు.. ఇలాంటి వైద్యశాలలు జిల్లా వ్యాప్తంగా వందల సంఖ్యలో ఉన్నాయి. వాటి నిర్వాహకులు అధికారుల చేయి తడిపి యథేచ్ఛగా నిర్వహిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. అనంతపురం మెడికల్ : వైద్య,ఆరోగ్యశాఖ అధికారుల పర్యవేక్షణ లోపంతో కనీన వైద్య పరిజ్ఞానం లేని కొందరు రిజిష్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ (ఆర్ఎంపీ), ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్ (పీఎంపీ)లుగా కొనసాగుతున్నారు. తెలిసీ తెలియని వైద్యంతో రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ప్రాథమిక చికిత్స మాత్రమే కాకుండా..అన్ని రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు, సొంతంగా మందులు రాసివ్వడం, వారే విక్రయించడం వంటివి చేస్తున్నారు. ఇలాంటి వైద్యశాలలు అనంతపురం నగరంలోనే పదుల సంఖ్యలో ఉండటం గమనార్హం. ఆయుష్షు ఉంటే బతికేస్తున్నారు! జిల్లావ్యాప్తంగా ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యశాలలు రెండు వేలకు పైగానే ఉన్నాయి. ఇక్కడ ప్రథమ చికిత్స మాత్రమే చేయాలి. అయితే.. ఏకంగా పడకల ఆస్పత్రులే నడుపుతున్నారు. సూది మందు, సెలైన్లు ఎక్కించడం నిషిద్ధం. దీన్ని బేఖాతరు చేస్తూ శస్త్ర చికిత్స వరకు అన్నీ చేసేస్తున్నారు. మందుల విక్రయ దుకాణం నడపాలంటే లెసైన్స్ తప్పనిసరి. దుకాణదారుడికు బీ ఫార్మసీ విద్యార్హత ఉండాలి. ఇవేవీ పట్టించుకోకుండా మందులు విక్రయిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఓ ప్రైవేట్ ఆస్పత్రి స్థాయిలో హద్దుదాటి వైద్యం చేస్తున్నారు. ఈ క్రమంలో రోగికి ఆయుష్షు ఉంటే బతికేస్తున్నాడు. లేకుంటే ప్రాణాలు పోవాల్సిందే. అనంతపురం, హిందూపురం, ధర్మవరం, కదిరి, గుంతకల్లు, తాడిపత్రి, రాయదుర్గం, కళ్యాణదుర్గం తదితర పట్టణాల్లో ఆర్ఎంపీ, పీఎంపీల హవా కొనసాగుతోంది. కంటితుడుపుగా దాడులు ఇటీవల కలెక్టరేట్లో మాతృమరణాలపై కలెక్టర్ కోన శశిధర్ సమీక్షించారు. ఈ సందర్భంగా హిందూపురంలోని ఓ వైద్యశాల బాగోతం వెలుగులోకి వచ్చింది. అక్కడి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తన భార్య ప్రాణం పోయిందని బాధితుడు ఫిర్యాదు చేసిన విషయాన్ని తెలుసుకున్న కలెక్టర్.. తక్షణం చర్యలకు ఆదేశించారు. దీంతో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు కేవలం ఒకరోజు కంటితుడుపుగా తనిఖీలు చేసి చేతులుదులుపుకున్నారు. జిల్లావ్యాప్తంగా వందల సంఖ్యలో అనధికారిక క్లినిక్లు ఉన్నా పట్టించుకోవడం లేదు. వాటి నిర్వాహకులు ముడుపులు చెల్లిస్తుండటంతో పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. ఇతర ప్రాంతాల సంగతి పక్కన పెడితే అనంతపురం శివారు కాలనీలతో పాటు సాయినగర్, కమలానగర్, పాతూరు, రాజీవ్కాలనీ, ఆర్టీసీ బస్టాండ్ తదితర ప్రాంతాల్లో అధిక సంఖ్యలో నకిలీ వైద్యులు ఉన్నారు. అలాగే మందుల దుకాణాల నిర్వాహకులు ఆర్ఎంపీలకు ఒక గదిని కేటాయించి ప్రజలకు ఉచిత ఓపీ పేరుతో మందుల కొనుగోళ్లను ప్రోత్సహిస్తున్నా వైద్యాధికారులకు కనపడకపోవడం గమనార్హం.