breaking news
GSM Association
-
సంస్కరణలకు గుర్తింపు
న్యూఢిల్లీ: జీఎస్ఎం అసోసియేషన్ (జీఎస్ఎంఏ) భారత్కు ‘గవర్నమెంట్ లీడర్షిప్ అవార్డ్ 2023’ ఇవ్వడం అన్నది దేశం చేపట్టిన టెలికం సంస్కరణలు, విధానాలకు గుర్తింపు అని టెలికం మంత్రి అశ్వని వైష్ణవ్ అన్నారు. అంతర్జాతీయంగా 750 మొబైల్ ఆపరేటర్లు, 400 కంపెనీలతో కూడినదే జీఎస్ఎంఏ. ఏటా ఒక దేశానికి ఈ అసోసియేషన్ అవార్డ్ ప్రకటిస్తుంటుంది. 2023 సంవత్సరానికి గాను జీఎస్ఎంఏ గవర్నమెంట్ లీడర్షిప్ అవార్డ్ను భారత్ గెలుచుకుంది. ఫిబ్రవరి 27న బార్సెలోనాలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్లో భారత్ను విజేతగా జీఎస్ఎంఏ ప్రకటించింది. ఈ సందర్భంగా మంత్రి వైష్ణవ్ మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ సర్కారు చేపట్టిన సంస్కరణలకు అంతర్జాతీయ గుర్తింపుగా పేర్కొన్నారు. సంస్కరణల ఫలితాలను మనం చూస్తున్నట్టు చెప్పారు. భారత టెలికం ఉదయిస్తున్న రంగమని, ప్రపంచం ఈ వృద్ధిని గమనించినట్టు తెలిపారు. ‘‘రైట్ ఆఫ్ వే అనుమతికి గతంలో 230 రోజులు పట్టేది. ఇప్పుడు కేవలం ఎనిమిది రోజుల్లోనే వచ్చేస్తోంది. 85 శాతానికి పైగా టవర్ అనుమతులు తక్షణమే లభిస్తున్నాయి’’అని మంత్రి వివరించారు. 387 జిల్లాల్లో లక్ష సైట్లతో, 5జీ విస్తరణ వేగవంతంగా ఉన్నట్టు మంత్రి తెలిపారు. తయారీ, ఆవిష్కరణలు, ఉద్యోగ కల్పనపై భారత్ ప్రగతిని వివరించారు. 200 పట్టణాలకు మార్చి నాటికి 5జీ సేవలను అందుబాటులోకి తెస్తామని ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ.. లక్ష్యానికంటే ముందే దాన్ని చేరుకున్నట్టు ప్రకటించారు. -
సగం 4జీ కనెక్షన్లు ఆసియాలోనే: జీఎస్ఎంఏ
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా 4జీ (ఎల్టీఈ-లాంగ్ టెర్మ్ ఇవల్యూషన్) నెట్వర్క్ల జోరు పెరుగుతోంది. భారత్, చైనాల్లో 4జీ సర్వీసులు విస్తృతంగా విస్తరిస్తున్నాయి. దీంతో 2017 కల్లా మొత్తం 4జీ కనెక్షన్లలో 47 శాతం భారత్, చైనాలవే ఉంటాయని అంతర్జాతీయ టెలికాం సంస్థ, జీఎస్ఎం అసోసియేషన్(జీఎస్ఎంఏ) మంగళవారం తెలిపింది. ఈ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. 4జీ కి అవసరమైన స్పెక్ట్రమ్ను సకాలంలో మొబైల్ ఆపరేటర్లకు కేటాయించడం, 4జీ డివైస్లు చౌకధరల్లో లభ్యమవుతుండడం, అధిక స్పీడ్ ఉన్న డేటా సర్వీసుల వినియోగానికి వినూత్నమైన టారిఫ్లు అందుబాటులోకి రావడం వంటి కారణాల వల్ల 4జీ నెట్వర్క్లు వేగంగా విస్తరిస్తున్నాయి. ప్రస్తుతం భారత్లో 4జీ కనెక్షన్లను ఒక్క భారతీ ఎయిర్టెల్ మాత్రమే అఫర్ చేస్తోంది. త్వరలో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ కూడా ఈ సర్వీసులను అందిస్తుందని అంచనా. ప్రస్తుతం 20 శాతం జనాభాకే అందుబాటులో ఉన్న 4జీ కవరేజ్ 2017 కల్లా సగం జనాభాకు విస్తరిస్తుంది. 4జీ సర్వీసుల కారణంగా ఒక్కో వినియోగదారుడి నుంచి వచ్చే సగటు రాబడి(ఏఆర్పీయూ-యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్) చెప్పుకోదగ్గ స్థాయిలో పెరుగుతుంది.