breaking news
genco officials
-
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్కు... రుణాల నిలుపుదలపై కోర్టుకు!
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి రుణం ఇస్తామని అంగీకరించి మధ్యలో నిధులివ్వకుండా ఆపేయడంపై గ్రామీణ విద్యుదీకరణ సంస్థపై (ఆర్ఈసీ) రాష్ట్ర విద్యుదుత్పాదన సంస్థ (టీఎస్ జెన్కో) ఆగ్రహంగా ఉంది. ఒప్పందాన్ని ఉల్లంఘించి ఏకపక్షంగా నిధులు ఆపేయడంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. గత నాలుగు నెలలుగా దాదాపు రూ. 500 కోట్ల రుణంవిడుదల చేయకుండా ఆపేయడంతో ప్రాజెక్టు నిర్మాణ వ్యయం విపరీతంగా పెరగడమే కాకుండా సకాలంలో ప్రాజెక్టు అందుబాటులోకి రాని పరిస్థితి తలెత్తిందని జెన్కో పేర్కొంటోంది. కేంద్రం, రాష్ట్రం మధ్య అగాధం నేపథ్యంలో దాదాపు రూ. 30 వేల కోట్ల వ్యయంతో 4,000 మెగావాట్ల యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే మిగులు విద్యుత్ రాష్ట్రంగా మారుతుందని, విద్యుత్ సమస్య లేకుండా సాఫీగా సరఫరాకు వీలవుతుందని జెన్కో వర్గాలు చెబుతున్నాయి. ఆర్ఈసీ నుంచి రూ. 17,200 కోట్లు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ) నుంచి రూ. 3,800 కోట్ల రుణాన్ని తీసుకోవడానికి జెన్కో ఒప్పందం చేసుకుంది. తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించే సామర్థ్యం, సంస్థ పనితీరు, రుణాలు ఎగేసిన ఉదంతాలున్నాయా వంటి అంశాలన్నీ పరిశీలించాకే రుణం ఇవ్వడానికి ఆ సంస్థలు అంగీకరించాయి. ఇందులో పీఎఫ్సీ నుంచి ఒప్పందం మేరకు జెన్కో దాదాపు మొత్తం రుణాన్ని తీసుకున్నట్లు సమాచారం. ప్రధాన రుణదాత అయిన ఆర్ఈసీ మాత్రం తాను అంగీకరించిన దాంట్లో కేవలం 50 శాతం నిధులనే విడుదల చేసింది. ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పెరిగిన అగాధం నేపథ్యంలో ఇవ్వాల్సిన రుణ విడుదలను ఆపేసింది. దీనిపై జెన్కో అధికారులు పలుమార్లు ఆర్ఈసీని సంప్రదించినా స్పందించకపోవడంతో ప్రాజెక్టు నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలోనే న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు జెన్కో సిద్ధమైనట్లు సమాచారం. ఈ డిసెంబర్కు విద్యుత్ ప్రాజెక్టును సిద్ధం చేయాలని భావించినా నిధుల సమస్యతో వచ్చే ఏడాది డిసెంబర్ వరకు పొడిగించాల్సిన పరిస్థితి ఏర్పడిందని జెన్కో వర్గాలు తెలిపాయి. రుణాల కోసం ప్రయత్నిస్తుంటే వాణిజ్య బ్యాంకుల నుంచి కూడా నిధులు రాకుండా కేంద్రంలోని పెద్దలు అడ్డుపడుతున్నారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. రంగంలోకి బీహెచ్ఈఎల్... యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను జెన్కో కేంద్ర నవరత్న కంపెనీల్లో ఒకటైన భారత భారీ విద్యుత్ పరికరాల సంస్థ (బీహెచ్ఈఎల్)కు అప్ప గించింది. ఇప్పుడు జెన్కోకు రుణ ఇబ్బందుల నేపథ్యంలో బీహెచ్ఈఎల్కు కూడా నిధుల సమస్య తలెత్తుతోందని ఓ అధికారి వివరించారు. ఈ నేపథ్యంలో ఆర్ఈసీ నుంచి రుణాల విడుదలకు కేంద్ర భారీ పరిశ్ర మల మంత్రిత్వ శాఖ కూడా ఒత్తిడి పెంచుతున్నట్లు సమాచారం. అయితే డిస్కంలతో కొనుగోలు ఒప్పందం, విద్యుత్, పర్యా వరణ మంత్రిత్వ శాఖల అనుమతితోపాటు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఆమోదం ఉన్న ఈ ప్రాజెక్టుకు రుణాలు నిలుపుదలను జెన్కో కక్షసాధింపుగానే భావిస్తోంది. ప్రాజెక్టు నిర్మాణం మధ్యలో నిలిచిపోవడంతో సాగునీటి ప్రాజెక్టులకు, పరిశ్రమలకు అవసరమైన విద్యుత్ ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఆర్థికంగా కొంత ఇబ్బందులున్నా జెన్కో ఎప్పటికప్పుడు చెల్లింపులు చేపడుతోందన్న విషయాన్ని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు విద్యుత్ వినియోగానికి సంబంధించి రూ. 1,500 కోట్ల మేర ప్రభుత్వం నుంచి జెన్కోకు రావాల్సి ఉందని సమాచారం. -
జూరాల ప్రాజెక్టు 4 క్రస్టుట్ల ఎత్తివేత
జూరాల : రెండురోజులుగా కురుస్తున్న వర్షాలతో జూరాల ప్రాజెక్టు రిజర్వాయర్కు వరద ప్రవాహం పెరిగింది. శుక్రవారం సాయంత్రానికి 65వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వరద వస్తుండటంతో జెన్కో అధికారులు ఆరు టర్బైన్లలో విద్యుదుత్పత్తి చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 9.65 టీఎంసీలు కాగా ప్రస్తుతం పై నుంచి వస్తున్న వరదతో పూర్తిస్థాయికి చేరింది. దీంతో ఎత్తిపోతల పథకాలు, ప్రధాన కాల్వలకు నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే విద్యుదుత్పత్తి ద్వారా 48వేల క్యూసెక్కులు, నాలుగు క్రస్టుగేట్ల ద్వారా 21,780క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని శ్రీశైలం రిజర్వాయర్కు విడుదల చేస్తున్నారు. జూరాల రిజర్వాయర్ నుంచి కుడి, ఎడమ ప్రధాన కాల్వలకు 450క్యూసెక్కులు, సమాంతర కాల్వ ద్వారా 850క్యూసెక్కులు, నెట్టెంపాడు ఎత్తిపోతలకు 750క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేస్తున్నారు. భీమా ప్రాజెక్టు లిఫ్ట్–1కు 1,300 క్యూసెక్కులు, లిఫ్ట్–2కు 750క్యూసెక్కులు, కోయిల్సాగర్ ఎత్తిపోతల పథకం (కేఎస్పీ) కి 630క్యూసెక్కులు ఇలా మొత్తం 73,760క్యూసెక్కులను వినియోగిస్తున్నారు. ఇక కర్ణాటక, మహారాష్ట్రలో వర్షాలు కురియకపోవడంతో కర్ణాటక రాష్ట్రంలోని ఆల్మట్టి ప్రాజెక్టుకు ఇన్ఫ్లో లేదు. అక్కడి విద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా 10,320క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి పూర్తిస్థాయి నీటినిల్వ 129.72టీఎంసీలు కాగా ప్రస్తుతం 125.11టీఎంసీలు ఉంది. నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 37.64 టీఎంసీలు కాగా ప్రస్తుతం 28.64టీఎంసీల నీటినిల్వ ఉంది. ఈ ప్రాజెక్టు ప్రధాన కాల్వల ద్వారా 4,448క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. -
సీలేరు నుంచి అదనపు జలాలు
సీలేరు : ఉభయ గోదావరి జిల్లాల్లో రెండో పంట కోసం విశాఖ జిల్లా సీలేరు విద్యుత్ కాంప్లెక్స్ డొంకరాయి జలాశయం మీదుగా శుక్రవారం మధ్యాహ్నం నుంచి అదనంగా మరో వెయ్యి క్యూసెక్కుల నీటిని జెన్కో అధికారులు విడుదల చేయనున్నారు. విద్యుత్ ఉత్పాదన నిమిత్తం సీలేరు కాంప్లెక్స్ నుంచి గురువారం వరకు వెయ్యి క్యూసెక్కుల నీటిని ఇచ్చేలా నీటి పారుదల శాఖ అధికారులు విద్యుత్శాఖ అధికారులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే పొలాలకు మరింత నీరు అవసరం కావడంతో తూర్పుగోదావరి జిల్లా డొంకరాయి మెయిన్ డ్యాం నుంచి ఇప్పటివరకు ఇస్తున్న నీటితోపాటు మరో వెయ్యి క్యూసెక్కుల నీటిని వారం రోజులపాటు విడుదల చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు. -
విద్యుత్ అధికారులతో కేసీఆర్ భేటీ
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సిన విద్యుత్వాటా రాకుండా అడ్డుకుంటున్న ఏపీ సీఎం చంద్రబాబు తీరును తెలంగాణ అసెంబ్లీలో ఎండగట్టేందుకు సీఎం కేసీఆర్ సిద్ధమవుతున్నారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు, విద్యుత్ సమస్యలపై సోమవారం శాసనసభ రెండో సెషన్లో చర్చ జరగనుంది. దీంతో విద్యుత్ వివరాల కోసం శనివారం కేసీఆర్ తెలంగాణ ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.కె.జోషీ, తెలంగాణ జెన్కో, ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్రావులతో భేటీ అయ్యారు. తెలంగాణ హక్కులు, ఏపీ ఉల్లంఘనలపై పలు డాక్యుమెంట్లను ఈ భేటీలో అధికారులు సీఎంకు అందించారని తెలిసింది.