breaking news
G Venkatakrishna
-
మనిషిలోని చీకటి కోణాల ఆవిష్కర్త!
కాశీభట్ల వేణుగోపాల్ అనే పేరు తెలుగు సాహిత్యంలో సుపరిచతమే. ఆ పేరుతో పాటు అతను ‘ఏవో మనో చీకటి కోణాల్ని గురించి రాస్తాడట’ అని కూడా పరిచయమే. కాశీభట్లను ఏమీ చదవనివాళ్లు కూడా ఈ మాత్రపు ప్రాథ మిక అవగాహనతో అతడి పట్ల ఒక కొండ గుర్తును ఏర్పరుచుకుంటారు. ఒక ప్రశస్త కుదింపునకు గురైన రచయితలలో కాశీభట్ల ముందుంటాడు.కాశీభట్ల మొదటి నవల ‘నేనూ–చీకటి’ వచ్చినప్పుడు దానిలోని చైతన్య స్రవంతి శైలి వల్ల అతడిని హత్తుకున్నవాళ్లు కొందరైతే, బండ కేసి బాదిన వాళ్లు కొల్లలు. ఎక్కువ మంది భాషాపాటవానికి అచ్చె రువొందారు. కాశీభట్లకు కవితాత్మకంగా వచనం రాయడం ఇష్టం. అది శేషేంద్ర ప్రభావం. కథా కథ నాన్ని సంక్లిష్టమైన చైతన్య స్రవంతిలో రాయడం ఇష్టం. ఇదేమో జేమ్స్ జాయిస్ ప్రభావం. రెండవ నవల ‘తపన’కు చాలా గుర్తింపు వచ్చింది కానీ మూడో నవల ‘దిగంత తాత్వికంగా ఉన్న నవల. సార్త్రే అస్తిత్వవాద ధోరణి ఈ నవలంతా పరుచుకొని ఉంది.నవలల్లో నైనా, కథల్లోనైనా కాశీభట్ల ఒకే దృష్టికోణంతో కథాకథనం చేస్తాడు. అది ప్రధాన పాత్ర మానసిక కోణం నుంచి జరుగుతుంది. కాబట్టి రచయిత ఆలోచనల్ని పాత్ర ఆలోచనలకు రంగరించడం సులభమయ్యింది. ఈ సందర్భంగానే చెప్పు కోవాల్సిన విష య మేమంటే... కాశీభట్ల సాహిత్యంలో స్త్రీ పాత్ర గొంతుకతో కథాకథనం జరగలేదు. స్త్రీలుంటారు గానీ స్త్రీల మానసిక కోణం ఉండదు. ఆయా పాత్రల ఒంటరి ఆలోచనలు (వాటినే రచ యిత చీకటి ఆలోచనలు అంటాడు) కథకు ఉత్ప్రేరకాలు. సర్వ సాధారణంగా బాహ్య ప్రపంచానికి అభ్యంతరకరంగా ఉండే ప్రవ ర్తనల్ని సృష్టించుకొని వాటి పర్యవసానాల ఆధారంగా కథను నడపడం కాశీభట్ల శైలి. పాత్ర ఆలోచనలో ఒకానొక మైక్రో సెకెనులో తలెత్తే ఆలోచనా శకలం, సభ్య సమాజ ఆలోచనకు అభ్యంతరకరంగా ఉంటుందనీ, అలా అభ్యంతరంగా ఉన్నప్పటికీ నెగెటివ్ ఆలోచనా శకలాలు పుట్టడమే సహజమనీ, వాటిని చూపించి మానవుడిని నగ్నంగా ఎత్తి చూపడమే తన సాహిత్య లక్ష్య మనీ గట్టిగా నమ్మాడు కాశీభట్ల. తన మొదటి నవల నుంచి చివరి నవల ‘అసంగతం’ దాకా దీన్ని చెప్పడానికే రాశానంటాడు.ఒకే ఒక్క సత్యం ‘మానవుడి మొదటి ఆలోచన దిగంబరమైనది’ అంటాడు. అదే కాశీభట్ల ఉద్దేశ్యంలో ‘చీకటి’. తన నవలలూ, కథలూ నిండా చీకటిని ఎన్ని రూపాల్లో చెప్పాడో ఎవరైనా పరిశోధన చేయెచ్చు. చీకటి ఒక ప్రలోభం. చీకటి ఒక కోరిక. చీకటి ఒక క్రియ. చీకటి ఒక ప్రయాణం. ఒక్కోసారి కాశీభట్ల సాహిత్యంలో చీకటే వెలుగు. చీకటిని గౌరవంగా తమోనమః అంటాడు. ఇక నేను అనే వాడు అన్ని సంద ర్భాల్లోనూ తన ప్రధాన పాత్ర. ఈ పాత్ర మనసు లోపలి దుర్మార్గ ఆలోచనల్ని, అభ్యంతరకరమైన యోచనల్నీ, అవి చర్యలుగా మారి, పాత్ర చుట్టూ ఉన్న సమాజంలోని చెడు, ప్రలోభం, దుర్మార్గం లాంటి చీకటులకు దోహదపడటాన్ని చిత్రిస్తాడు.విపరీతంగా ప్రపంచ సాహిత్యాన్ని చదివాడు. తెలుగు, ఇంగ్లీషు, సంస్కృతం, కన్నడ భాషల్లో పట్టు ఉండటం వల్ల... కథన భాష మణిప్రవాళం కావడం, తను రాసే వస్తువు పట్లా, అంశం మీదా గట్టి విషయ సేకరణా, తర్ఫీదు ఉండటంతో తను అనుకున్న వస్తువుతో ఆటలాడినంత సులభంగా రాస్తాడు. తన కేంద్రంగా రాస్తాడు. పాఠక కేంద్రాన్ని ఎట్టి పరిస్థి తుల్లోనూ అంగీకరించడు. కథాకథనంలో వాడే ప్రతీక లనో, అన్వయాలనో ఎవరైనా ప్రశ్నిస్తే, ‘మీరు సోమరి పాఠకులు. నన్ను చదవకున్నా ఫర్వాలేదు’ అంటాడు. అయితే ఈ కఠిన శైలి ‘కాలం కథల’లోనూ ఇటీవల రాసిన ‘చీకటీ గలు’, ‘అసత్యానికి ఆవల’, ‘అసంగతం’ నవలల్లో కొంత సరళమవడం చూడొచ్చు.కాశీభట్లను తాత్వికంగా చూసినప్పుడు నిరీశ్వర వాది. సొంత జీవితంలో తన బ్రాహ్మణత్వాన్ని తెంచి అవతలకి విసిరి వేసి డీ కాస్ట్ అయినవాడు. తొలి రోజుల్లో నక్సలైట్ భావాల పట్ల కూడా ఆసక్తి చూపినవాడు. ఇదంతా తన పాత్రల రూపంలో రికార్డు అయ్యే వుంది. ఒక ఇంటర్వ్యూలో కాశీభట్ల నిహిలిస్టును అన్నాడు. ప్రతి దాన్నీ అనుమానిస్తానన్నాడు. రేషనాలిటీ ఏదో మేరకు తన ఆలోచనల్లో భాగమైన రచయిత. తెలుగులో సీరియస్ సాహిత్యంతో మనసా కర్మణా నిజాయితీగా నిలబడ్డాడని చెప్పగలం. తనదైన సాహిత్య శైలి అపూర్వం అని అనవచ్చుగానీ అదే సమ యంలో త్రిపురనీ, వడ్డెర చండీదాస్నూ అతని ముందువారని గుర్తించకుండానూ ఉండలేం.– జి. వెంకటకృష్ణ, వ్యాసకర్త కవి, విమర్శకులు -
పడావు పడిన నేల పడే తన్లాట
పుస్తక సమీక్ష ఈ పద్నాలుగు కథలు అనేక సారూప్యతలనూ, పరస్పర విభిన్నతలనూ వొదిగించుకొని ఏడేడు పద్నాలుగు లోకాలను చూపిన అనుభవాన్నిస్తాయి. ఈ సంకలనంలోని చాలా కథలకూ నేపథ్యం సుదీర్ఘ చరిత్ర. ‘దుఃఖాగ్ని’, ’ సంపుడుపంజెం’, ’పూర్తికాని కథ’, ‘అమ్మ’ గత చరిత్ర రగిల్చిన దుఃఖాలు. వర్తమానంలో ప్రతిఫలిస్తున్న నిఘ్ఠర గాయాలు. ‘తమ్ముడి మరణం’, ‘థర్డ డిగ్రీ’, ‘అలికిన చేతులు’ ఆ గాయాలకు పూసిన రక్తపుష్పాలు. వెరసి ఈ కథలన్నీ తెలంగాణ రక్తమాంసాలు. కవితాత్మకమైన వుద్వేగంతో ప్రారంభమై ప్రతీకాత్మక పాత్రల్ని తలదన్నే పాత్రల్ని రూపొందించుకొని నడిచిన ‘దుఃఖాగ్ని’ తెలంగాణ వుద్యమాన్నీ , వుద్యమానికి మూలమైన దైన్యాన్నీ చిత్రించడంతోనే ఆగకుండా ఒక కార్యాచరణ వైపుకు ముగింపు నిచ్చింది. ‘సంపుడుపంజెం’ దళిత వరస మరణాల దగ్గర ప్రారంభమై, తరతరాలుగా సంస్కృతిని నిలబెడుతున్న వాళ్లని రికార్డు చేయలేక పోవడంలోని వైయక్తిక అసహాయతను చిత్రించింది. ‘అమ్మ’ చరిత్ర మలుపులో ఒక అనివార్యతలో కనుమరుగైపోయిన కొడుకును ఎదురు చూసే తెలంగాణను గుర్తుచేస్తుంది. ఉద్యమమది ఏదైనా, అదెంత ప్రజాస్వామికమైనదైనా, దానిలోని ‘అతి’ కొందరు కార్యకర్తల్లో వ్యక్తీకరింపబడుతుంది. ప్రతి వుద్యమంలోని కార్యకర్తయినా ‘పూర్తికాని కథ’లోని పాత్రలాగే వుండొచ్చు. ఇక, ఐడెంటిటీ క్రైసిస్తో, వ్యకిగత సంక్షోభంతో సతమతమయ్యే వ్యక్తులు వర్తమాన చరిత్రలో కొల్లలు. ఈ సంక్లిష్ట స్థితికి ఉప ఫలితాలుగా వచ్చినవే ‘తమ్ముడి మరణం’ లోని ‘థర్డ డిగ్రీ’లోని, ‘అలికిన చేతులు’లోని మృత్యు దుఃఖాలు. ఈ సంకలనంలోని దుఃఖ దృశ్యాలు అక్కడితోనే ఆగలేదు. ఆధునిక అభివృద్ధి ప్రతిఫలనాలైన రహదారుల మీద మృత్యు కోరలు చాస్తున్న టోల్ గేట్లను చిత్రిస్తూ, ప్రజలకు ఆరోగ్య ప్రదాయినిగా వుండాల్సిన ఆరోగ్యశ్రీ కార్యక్రమాల్లో తెల్లకోట్లు జరిపే విశృంఖల ఆపరేషన్లు స్త్రీలను పెడుతున్న హింసలను వివరిస్తూ, స్త్రీని ఆస్తిగా చూసే ‘ఇండియాస్ సన్ ’లోని రేపిస్టు మగ యిగో స్వగత దుఃఖాల మీదుగా, ‘2047’లోని ఆత్మలు చెప్పే అసమ అభివృద్ధి ఆత్మకథలుగా కొనసాగినాయి. ఇన్ని కథలూ మృత్యు చిత్రాలుగా వుండి పాఠకుడి అంతరంగాన్ని కలవరపరుస్తాయి. తెలంగాణ కథలంటే పొక్కిలి నేల మీద పారాడే అమాయక కోడిపిల్లలనిపిస్తాయి. వీటికి భిన్నంగా ‘చౌరస్తా’ ‘ఇల్లు’ ఇంకో విరుద్ధ కోణాన్ని పట్టి చూపుతున్నాయి. ఆశ్చర్యకరంగా చౌరస్తాలోని ప్రొటాగనిస్ట్ ‘బతుకుడంటే లోకమ్మీద పడి అందినకాడికి దొబ్బుకు తినుడే’ అనే తత్త్వాన్ని కథ ఆద్యంతమూ నిరూపించి నిలబెడతాడు. ‘ఇల్లు’లో త్యాగానికి ప్రతీకగా వుండాల్సిన తెలంగాణ తాత, కొడుకుల మీది కోపంతో మనవడి భవిష్యత్తును కాంక్షించని వికారాన్ని ప్రదర్శిస్తాడు. మృత్యువుతో పొక్కిలైన నేల ఈ కొత్త వికారాల్ని ఎలా పొందిందని ఆలోచిస్తే, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్సలో భాగంగా పొందిందా, దీనికి వేర్లు ‘పూర్తికాని కథ’లో చెప్పిన మేధావుల వైయక్తిక విధ్వంసంలోంచి బయలుదేరాయా అన్నది పరిశోధించాల్సిన అంశం. అయితే ఇవి ఇంగిలీసు విద్యామాయలో పడ్డ తెలంగాణ గ్రామీణుల్లోనూ వ్యాపించాయని ‘చుక్కలురాని ఆకాశం’లోనూ కథనం చేయబడింది. 25 సంవత్సరాలుగా వెలువడుతున్న వార్షిక కథా సంకలనాల కంటే భిన్నమైన కథా సంకలనాల పరంపరను వెలువరించే బాధ్యతను నెత్తికెత్తుకున్న సంపాదకులు ఒక ట్రెండు కథల ఎంపికలోనూ, చాలా కథ ల్లో దొర్లిన అచ్చుతప్పుల మీదనూ మరింత శ్రద్ధ పెట్టివుంటే బావుండేది. తన్లాట-తెలంగాణ కథ 2014 సంపాదకులు: సంగిశెట్టి శ్రీనివాస్, స్కైబాబ, వెల్దండి శ్రీధర్; పేజీలు: 160; వెల: 60 ప్రతులకు: ప్రముఖ పుస్తక దుకాణాలు; సంగిశెట్టి ఫోన్: 9849220321 జి.వెంకటకృష్ణ, 8985034894