breaking news
former chairman of ISRO
-
ఇస్రో మాజీ ఛైర్మన్ డాక్టర్ కస్తూరి రంగన్ కన్నుమూత
బెంగళూరు, సాక్షి: ప్రముఖ శాస్త్రవేత్త, ఇస్రో మాజీ ఛైర్మన్ డాక్టర్ కస్తూరి రంగన్ (84) కన్నుమూశారు. బెంగళూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కస్తూరి రంగన్ గతంలో జేఎన్యూ ఛాన్సలర్గా, కర్ణాటక నాలెడ్జ్ కమిషన్ ఛైర్మన్గా పనిచేశారు. ఈయన పూర్తి పేరు కృష్ణస్వామి కస్తూరిరంగన్(Krishnaswamy Kasturirangan). కేరళ ఎర్నాకులంలో కస్తూరిరంగన్ జన్మించారు. ఈయనది విద్యావంతుల కుటుంబం. ముంబై యూనివర్సిటీలో ఫిజిక్స్లో మాస్టర్స్ చేసిన రంగన్.. అహ్మదాబాద్ ఫిజికల్ రీసెర్చ్ లాబోరేటరీ నుంచి 1971లో డాక్టరేట్ అందుకున్నారు. ఖగోళ శాస్త్రం, స్పేస్ సైన్స్ మీద 240 పేజీల థియరీని సమర్పించారాయన. 1994 నుంచి 2003 దాకా.. తొమ్మిదేళ్లపాటు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO)కి ఆయన చైర్మన్గా పని చేశారు. 2003-09 మధ్య రాజ్యసభ సభ్యుడిగానూ ఉన్నారు. 2004 నుంచి 2009 మధ్య కాలంలో బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్కు డైరెక్టర్గా పనిచేశారు. మోదీ సర్కార్ తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానం ముసాయిదా కమిటీకి కస్తూరి రంగన్ అధ్యక్షుడిగా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వం ఆయన్ని పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్తో సత్కరించింది. మొత్తం 27 యూనివర్సిటీల నుంచి గౌరవ డాక్టరేట్లు అందుకున్నారాయన. ఇస్రో శాస్త్రవేత్త నంబీ నారాయణన్ మీద దేశద్రోహం ఆరోపణలు వచ్చిప్పుడు ఇస్రో చైర్మన్గా ఉంది కస్తూరి రంగనే. 1969లో లక్ష్మిని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. రంగన్ భార్య 1991లో కన్నుమూశారు. -
ఇస్రో ప్రయోగం విఫలం: మాజీ ఛైర్మన్ దిగ్భ్రాంతి
సాక్షి, బెంగళూరు: ఇస్రో ప్రయోగం విఫలం కావడంపై సీనియర్ అంతరిక్ష శాస్త్రవేత్త, ఇస్రో మాజీ ఛైర్మన్ జీ మాధవన్ నాయర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జీఎస్ఎల్వీ-ఎఫ్ 10 రాకెట్ ప్రయోగం విఫలంకావడంపై స్పందించిన ఆయన ఇది మనందరికీ షాక్. కానీ షాక్ నుండి త్వరగా కోలుకుని, మళ్లీ ట్రాక్లో వస్తామని వ్యాఖ్యానించారు. దీనిపై నిరాశ చెందాల్సిన అవసరం లేదు. కానీ అదే సమయంలో, వైఫల్యానికి మూల కారణాన్ని గుర్తించి పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు. ఇస్రో సిబ్బందికి అంతటి సామర్థ్యముందని నాయర్ పేర్కొన్నారు. ఈ రకమైన ఎదురుదెబ్బలు అసాధారణమైనవేమీ కాదని, ధైర్యాన్ని కోల్పోవద్దంటూ ఇస్రోకు సూచించారు. క్రయోజెనిక్ టెక్నాలజీపై ప్రావీణ్యతను సాధించిన ఇస్రో దృఢత్వంపై తనకు విశ్వాసముందన్నారు. ఇది చాలా క్లిష్టమైన మిషన్ అని పేర్కొన్న ఆయన సాధారణంగా, అన్ని ఇతర రాకెట్ ప్రొపల్షన్లతో పోలిస్తే క్రయోజెనిక్ స్టేజ్ చాలా కష్టమైందని వెల్లడించారు. క్రయోజెనిక్ దశలో వైఫల్యం దాదాపు 20 శాతం పరిధిలో ఉందని ఆయన అన్నారు. ఈ విషయంలో యూరోపియన్ దేశాలు, రష్యాతో పోలిస్తే దాని ట్రాక్ రికార్డ్ బావుందని ఈ నేపథ్యంలో ఇస్రో తిరిగి పుంజుకుంటుందనే విశ్వాసాన్ని ప్రకటించారు. కాగాజీఎస్ఎల్వీ మిషన్ విఫలమైందని ఇస్రో ఛైర్మన్ శివన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. శ్రీహరికోట స్పేస్పోర్ట్ నుండి రాకెట్ ప్రయోగం తొలి, రెండో దశలో సాధారణంగానే ఉన్నప్పటికీ మూడో దశలో రాకెట్ గతి తప్పిందని తెలిపిందే. క్రయోజెనిక్ అప్పర్ స్టేజీ వద్ద సాంకేతిక సమస్య తలెత్తిన ఫలితంగా ఉద్దేశించిన మిషన్ పూర్తి కాలేదని స్పేస్ ఏజెన్సీ ట్వీట్ చేసింది. 2003 నుండి ఆరేళ్ల పాటు ఇస్రో ఛైర్మన్గా ఉన్న మాధవన్ 25 మిషన్లను విజయవంతంగా పూర్తి చేశారు. -
అంతరిక్ష పథికుడి కన్నుమూత
అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన యూఆర్ రావు ► దేశ తొలి ఉపగ్రహం ‘ఆర్యభట్ట’ సూత్రధారి ► ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞాన రూపకల్పనలో విశేష కృషి ► చంద్రయాన్, మంగళ్యాన్ తదితర ఇస్రో ప్రాజెక్టుల్లో కీలకపాత్ర సాక్షి, బెంగళూరు: దేశ అంతరిక్ష చరిత్రలో ఒక అద్భుత శకం ముగిసింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మాజీ చైర్మన్, దేశ తొలి ఉపగ్రహం ‘ఆర్యభట్ట’ సూత్రధారి యూఆర్ రావు సోమవారమిక్కడ వృద్ధాప్య సంబంధ అనారోగ్యంతో కన్నుమూశారు. వేకువజామున 3 గంటల ప్రాంతంలో ఆయన నిద్రలోనే మరణించారని ఇస్రో పౌర సంబంధాల డైరెక్టర్ దేవీప్రసాద్ కర్ణిక్ తెలిపారు. 85 ఏళ్ల రావుకు భార్య యశోద, ఒక కుమారుడు మదన్రావు, కుమార్తె మాలా ఉన్నారు. రావు మృతి వార్త తెలిసిన వెంటనే శాస్త్రవేత్తలు, కర్ణాటక గవర్నర్ వీ.ఆర్.వాలా, సీఎం సిద్ధరామయ్య, మాజీ ప్రధాని దేవెగౌడ తదితర ప్రముఖులు ఆయన స్వగృహానికి చేరుకుని నివాళి అర్పించారు. అంత్యక్రియలను సాయంత్రం నిర్వహించారు. రావు మృతిపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ‘దేశ అంతరిక్ష కార్యక్రమాలకు ఆయన అందించిన సేవలు ఎన్నటికీ మరపురానివి’ అని మోదీ ట్వీట్ చేశారు. 1975లో ప్రయోగించిన ‘ఆర్యభట్ట’ మొదలుకుని ఇటీవల చంద్రుడిపైకి పంపిన చంద్రయాన్–1, అంగరకుడిపైకి పంపిన మంగళ్యాన్, ప్రతిపాదిత ఆదిత్య సోలార్ మిషన్ వంటి దాదాపు అన్ని ఇస్రో ప్రాజెక్టుల్లో రావు వివిధ హోదాల్లో కీలక పాత్ర పోషించా రు. వాతావరణం, కమ్యూనికేషన్లకు సంబంధించిన భాస్కర, రోహిణి, ఇన్శాట్–1, ఇన్శాట్–2, ఐఆర్ఎస్–1ఏ, 1బీ, 1సీ, 1డీ ఉపగ్రహాల ప్రయోగానికి దోహదపడిన సాంకేతిక పరిజ్ఞానాన్ని చేకూర్చుకోవడంలో ఆయన ముఖ్య భూమిక పోషించారు. చివరిదశ వరకు అంతరిక్ష రంగంతోనే తన జీవితాన్ని పెనవేసుకున్నారు. అహ్మదాబాద్లోని ఫిజికల్ రీసెర్చ్ లేబొరేటరీ పాలకమండలి చైర్మన్, తిరువనంతపురంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చాన్స్లర్ పదవుల్లో కొనసాగుతూనే తుదిశ్వాస విడిచారు. రెండు తరాల శాస్త్రవేత్తల మధ్య వారధిలా పనిచేసిన ఆయనకు దేశంలోని ఎన్నో శాస్త్ర, సాంకేతిక సంస్థలతో సన్నిహిత అనుబంధం ఉంది. శ్రీహరికోటతో అనుబంధం శ్రీహరికోట (సూళ్లూరుపేట): రావుకు శ్రీహరికోటలోని రాకెట్ ప్రయోగ కేంద్రం(షార్)తో విడదీయరాని అనుబంధం ఉంది. దివంగత ప్రధానులు పీవీ నరసింహారావు, రాజీవ్ గాంధీలతో సన్నిహిత సంబంధాలు నెరిపిన రావు.. వారు షార్ సందర్శనకు వచ్చినప్పుడు ఇస్రో కార్యక్రమాలను క్షుణ్ణంగా వివరించేవారు. ఇస్రో చైర్మన్గా రిటైరైన తర్వాత కూడా ఆయన షార్లో జరిగిన అన్ని ప్రయోగాలకు హాజరై సలహాలు, సూచనలు ఇచ్చారు. సాంకేతిక రథసారథి అంతరిక్ష రంగంలో దేశాన్ని పరుగులు పెట్టించిన ఉడిపి రామచంద్ర రావు 1932 మార్చి 10న కర్ణాటక ఉడిపి జిల్లాలోని కుగ్రామం అడమూరులో పేద రైతు కుటుంబంలో జన్మించారు. పాఠశాల విద్యను ఉడిపిలో, జూనియర్ కాలేజీ విద్యను బళ్లారిలో, బీఎస్సీని అనంతపురంలోని ప్రభుత్వ కాలేజీలో, ఎమ్మెస్సీని బెనారస్ హిందూ యూనివర్సిటీలో పూర్తి చేశారు. తర్వాత అహ్మదాబాద్లోని ఫిజికల్ రీసెర్చ్ లేబొరేటరీలో భారత అంతరిక్ష పితామహుడు విక్రమ్ సారాభాయ్ మార్గదర్శకత్వంలో పీహెచ్డీ చేశారు. కాస్మిక్ రే (విశ్వ కిరణ) శాస్త్రవేత్తగా కెరీర్ను ప్రారంభించిన రావు కొన్నాళ్లు అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, టెక్సాస్ వర్సిటీల్లో అధ్యాపకుడిగా చేశారు. ఆ సమయంలో ఉపగ్రహాలు, సౌరశక్తి వినియోగంపై ఎన్నో పరిశోధనలు నిర్వహించారు. 1966లో సారాభాయ్తోపాటు భారత్కు తిరిగివచ్చి ఫిజికల్ రీసెర్చ్ లేబొరేటరీలో ప్రొఫెసర్గా చేరారు. 1972లో ఇండియన్ సైంటిఫిక్ శాటిలైట్ ప్రాజెక్టులో డైరెక్టర్గా చేరి.. దేశానికి ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకునే గురుతర బాధ్యత తీసుకున్నారు. 1984లో భారత అంతరిక్ష కమిషన్ చైర్మన్గా, అంతరిక్ష విభాగ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి రాకెట్ సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధిని వేగవంతం చేశారు. జీఎస్ఎల్వీ రాకెట్, క్రయోజనిక్ టెక్నాలజీ అభివృద్ధికీ శ్రీకారం చుట్టారు. ఫలితంగా 2 టన్నుల బరువైన ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లగల పీఎస్ఎల్వీతోపాటు ఇతర శక్తిమంతమైన రాకెట్లు భారత్ సొంతమయ్యాయి. రావు ఇస్రో అధిపతిగా ఉన్న సమయంలో ప్రయోగించిన ఇన్శాట్ రాకెట్లతో దేశ కమ్యూనికేషన్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులొచ్చాయి. కాస్మిక్ రేస్, ఖగోళ భౌతికశాస్త్రం, ఉపగ్రహాలు తదితర అంశాలపై ఆయన 350 పరిశోధన పత్రాలతోపాటు పలు పుస్తకాలు రాశారు. 25 వర్సిటీల నుంచి గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు. ప్రభుత్వం ఆయనను 1976లో పద్మభూషణ్, ఈ ఏడాదిలో పద్మవిభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. వాషింగ్టన్లోని ప్రఖ్యాత ‘శాటిలైట్ హాల్ ఆఫ్ ఫేమ్’ తోపాటు మెక్సికోలోని ఐఏఎఫ్ హాల్ ఆఫ్ ఫేమ్లో సభ్యత్వం పొందిన తొలి భారత అంతరిక్ష శాస్త్రవేత్తగా రికార్డు సృష్టించారు.