breaking news
Excavations in the cellar
-
సెల్లార్ల తవ్వకాలపై నిషేధం
సాక్షి, సిటీబ్యూరో : జీహెచ్ఎంసీలో 750 చ.మీ.లు అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో ఇళ్లు, భవనాలు నిర్మించుకోవాలనుకునేవారు దాదాపు నాలుగు నెలల పాటు తమ పనులు వాయిదా వేసుకోవాల్సిందే. దాదాపు వారం రోజుల్లో రుతుపవనాలు రానుండటంతో వర్షాకాల సమస్యలపై ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా జీహెచ్ఎంసీ అధికారులు సెల్లార్ల తవ్వకాలపై నిషేధం ప్రకటించారు. జూన్ 10వ తేదీనుంచి సెల్లార్ల తవ్వకాలపై నిషేధం అమల్లో ఉంటుంది. వర్షాకాలం ముగిసేంత వరకు.. దాదాపు సెప్టెంబర్ వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుంది. కొత్తగా సెల్లార్ల తవ్వకంపై ఈ నిషేధాజ్ఞలు అమల్లోకి రానుండగా, ఇప్పటికే సెల్లార్ల తవ్వకాలు ప్రారంభించిన వారు అవసరమైన అన్ని ముందస్తు జాగ్రత్త చర్యల్ని తప్పనిసరిగా పాటించాల్సి ఉంది. వారు పటిష్ట భద్రతాప్రమాణాలు పాటిస్తున్నదీ లేనిది స్థానిక అసిస్టెంట్ సిటీప్లానర్లు(ఏసీపీ), డిప్యూటీ కమిషనర్లు(డీసీ)లు తనిఖీ చేస్తారు. నిర్మాణంలోని ప్రతి సెల్లార్ తవ్వక ప్రాంతాన్ని కచ్చితంగా తనిఖీ చేయాల్సిందిగా జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్దన్రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సెల్లార్ల తవ్వకాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై త్వరలోనే తవ్వకాలు జరిపే కాంట్రాక్టర్లకు అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. సెల్లార్ల తవ్వకాల సందర్భంగా అవసరమైన అన్ని జాగ్రత్తలు చేపట్టాలని, ఏదైనా ప్రమాదం జరిగితే అందుకు నిర్మాణదారులదే బాధ్యతని, వర్షం కురిసే సమయాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ తవ్వకాలు జరపరాదని హెచ్చరిస్తున్నారు. జీహెచ్ఎంసీలో సెల్లార్ల తవ్వకాలకు ఇప్పటికే అనుమతి పొందిన భవనాలు దాదాపు 200 ఉన్నాయి. నిబంధనల మేరకు 750 చ.మీ.ల స్థలముంటే ఒక సెల్లార్, 1000 చ.మీ.ల స్థలముంటే రెండు సెల్లార్లు తవ్వవచ్చు. అలా.. స్థల విస్తీర్ణం పెరిగే కొద్దీ అదనపు సెల్లార్లు తవ్వవచ్చు. నగరంలో ప్రస్తుతం గరిష్టంగా నాలుగు సెల్లార్ల వరకు అనుమతులిస్తున్నారు. అనుమతుల్లేకుండానే తక్కువ స్థలంలో 200 చ.మీ.ల స్థలంలో కూడా అక్రమంగా సెల్లార్లు తవ్వుతున్న వారు కూడా ఉన్నారు. ఒక్కో సెల్లార్ కోసం దాదాపు దాదాపు మూడు మీటర్ల లోతు తవ్వుతున్నారు. ఈ తవ్వకాల వల్ల తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటుండంతో సెల్లార్ల తవ్వకాలను నివారించాలని కూడా భావిస్తున్నారు. సెల్లార్లు తవ్వకుండా పై అంతస్తుల్లోనే పార్కింగ్ ఏర్పాట్లు చేసే వారికి ఆమేరకు అదనపు అంతస్తులు నిర్మించుకునేందుకు అనుమతులిస్తారు. పాతగోడలు, శిథిల భవనాలపై శ్రద్ధ.. శిథిల భవనాలు, పాతగోడలు, గుట్టలు, కొండలపైనున్న భవనాల ప్రహరీల ప్రాంతాల్లోనూ అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోనున్నారు. ముఖ్యంగా స్కూల్ భవనాలు,ప్రభుత్వ భవనాలకు చెందిన ప్రహరీగోడలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోనున్నట్లు చీఫ్ సిటీ ప్లానర్ ఎస్. దేవేందర్రెడ్డి తెలిపారు. ప్రభుత్వ భవనాల్లో చాలా వరకు పాతవి ఉండటంతో వాటిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. జీహెచ్ఎంసీలో 1100 పై చిలుకు శిథిల భవనాలుండగా,వీటిల్లో దాదాపు సగం భవనాలకు తగిన మరమ్మతులు చేస్తే సరిపోతుందన్నారు. మిగతావాటికిగాను ఇప్పటికే 364 భవనాలను కూల్చివేయగా,త్వరలో మరో 200 వరకు కూల్చివేయనున్నట్లు తెలిపారు. సికింద్రాబాద్, గోషామహల్ నియోజకవర్గాల్లో ఇవి ఎక్కువగా ఉన్నాయన్నారు. జాగ్రత్తలు పాటించాలి .. ఇప్పటికే అనుమతులు పొంది ప్రస్తుతం సెల్లార్లు తవ్వుతున్న వారు ప్రమాదాలకు తావులేకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సీసీపీ దేవేందర్రెడ్డి స్పష్టం చేశారు. సెల్లార్ తవ్వే ప్రాంతాల్లో, ముఖ్యంగా వాలు ప్రాంతాల్లో నేల జారిపోకుండా అవసరమైన పటిష్టత చర్యలు చేపట్టాలి.ఇందుకుగాను ఇసుకబస్తాలు వినియోగించడంతోపాటు నైలింగ్, గ్రౌటింగ్లు చేయాలి. సెల్లార్ల తవ్వకాలకు చుట్టూ 3 మీటర్ల సెట్బ్యాక్ వదలాలి. ఇది పై లెవెల్ సెల్లార్కు కాగా, దిగువ లెవెల్స్కు వెళ్లే కొద్దీ అదనంగా మరో 0.5 మీటర్ల చొప్పున సెట్బ్యాక్ వదలాలి. తాత్కాలికంగా రిటైనింగ్ వాల్ నిర్మించాలి. అధికబరువున్న సామాగ్రిని సెల్లార్ ప్రాంతాల్లో వేయరాదు. సెల్లార్ల సమీపంలోకి భారీ వాహనాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సెల్లార్ తవ్వకప్రాంతాన్ని నిత్యం పరిశీలిస్తూ, ఎక్కడైనా బలహీనంగా ఉన్నా, జారిపోయేలా ఉన్నా వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పగుళ్లు తదితరమైనవాటిని గుర్తించి తగిన పరిష్కార చర్యలు చేపట్టాలి. సెల్లార్ తవ్వక ప్రాంతంలోకానీ, ఇరుగుపొరుగు భవనాల్లో కానీ భూమి కదులుతున్నట్లు గ్రహిస్తే యుద్ధప్రాతిపదికన అవసరమైన చర్యలు చేపట్టాలి. -
‘సెల్లార్’లకు కళ్లెం!
►అడ్డగోలు తవ్వకాలపై నియంత్రణ ►కొండాపూర్ ఘటనతో తేరుకున్న అధికారులు ►జీవో 7పై అవగాహనకు చర్యలు ►సెల్లార్లు లేకుండా నిర్మించే భవనాలకు రాయితీలు ►త్వరలో జరగనున్న వర్క్షాప్లో తుది నిర్ణయం సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో భవన నిర్మాణాలకు సంబంధించిన సెల్లార్ల తవ్వకాలను నియంత్రించేందుకు జీహెచ్ఎంసీ అధికారులు సిద్ధమవుతున్నారు. తరుచూ సెల్లార్లు, వాటి చుట్టూ ఏర్పాటు చేస్తున్న రక్షణ గోడలు కూలుతుండడం..ప్రాణనష్టం సంభవిస్తుండడంతో అధికారులు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలని భావిస్తున్నారు. పార్కింగ్ కోసం భూగర్భంలో సెల్లార్లు తవ్వకుండా స్టిల్ట్, ఆపై అంతస్తుల్లోనే పార్కింగ్ ఏర్పాట్లు చేసే వారికి ఆమేరకు పై అంతస్తులు నిర్మించుకునేందుకు అనుమతులివ్వనున్నారు. పార్కింగ్ కాకుండా వారు ఎన్ని అంతస్తులను వినియోగం కోసం నిర్మించనున్నారో.. పార్కింగ్ పోను అన్ని అంతస్తులకు అనుమతుల్వినున్నారు. దీనికి సంబంధించి గత సంవత్సరం జనవరిలోనే ప్రభుత్వం జీఓ నెంబర్ 7ను జారీ చేసినప్పటికీ, పెద్దగా అవగాహన లేక చాలామంది బిల్డర్లు పట్టించుకోవడం లేదు. సదరు జీవో మేరకు æ నిర్మాణాలు జరిపే వారికి సెట్బ్యాక్స్లో మినహాయింపులిస్తారు. భవనం మొత్తం పార్కింగ్ కోసమే నిర్మిస్తే సెట్బ్యాక్స్తో పాటు డెవలప్మెంట్ చార్జీలు వసూలు చేయరు. అలాగే ఆస్తిపన్ను చెల్లింపుల్లోనూ రాయితీలున్నాయి. తరచూ సెల్లార్ల ప్రమాదాలు జరుగుతూ అమాయకుల ప్రాణాలో గాల్లో కలుస్తుండటం.. తాజాగా కొండాపూర్ ఘటనతో తేరుకున్న అధికారులు వీటిపై బిల్డర్లకు అవగాహన కల్పించి, సెల్లార్లు తవ్వకుండా వీలైనంతమేరకు నిరోధించే యోచనలో ఉన్నారు. సెల్లార్లకు అనుమతులిచ్చినా.. ఎంత లోతు వరకు తవ్వేందుకు అనుమతులివ్వాలి.. ఎన్ని సెల్లార్లకు అనుమతులివ్వాలనే అంశంలో త్వరలోనే తగిన నిర్ణయం తీసుకోనున్నారు. హైదరాబాద్ నేలను బట్టి ఎంత లోతు వరకు సెల్లార్ల కోసం తవ్వవచ్చు అనే అంశంపై కూడా నిపుణుల సూచనలు తీసుకొని అందుకనుగుణంగా అనుమతులివ్వాలని భావిస్తున్నారు. దాంతోపాటు సేఫ్టీ మెజర్స్, నేల కండీషన్ను బట్టి తగు నిర్ణయం తీసుకోనున్నారు. పదిమీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో నిర్మించే భవనాలన్నింటికీ ఇకపై సాయిల్ టెస్ట్, స్టెబిలిటీ టెస్ట్ తప్పనిసరి చేయనున్నారు. నగరంలో ప్రస్తుతం నాలుగు సెల్లార్ల వరకు అనుమతులిస్తున్నారు. ఒక్కో సెల్లార్ కోసం దాదాపు మూడు మీటర్ల లోతు తవ్వుతున్నారు. ఈ తవ్వకాల వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతుండడంతో వీటిని నివారించాలని భావిస్తున్నారు. భవనం మొత్తం పార్కింగ్ కోసమే కడితే ఫ్రంట్ సెట్బ్యాక్ మినహా మూడు వైపులా సెట్బ్యాక్స్లో 50 శాతం మినహాయింపులుంటాయి. అంతేకాకుండా ఇలాంటి భవనాలకు ఐదేళ్ల వరకు ఆస్తిపన్ను చెల్లించకుండా మారటోరియం ఉంది. ఆ తర్వాత సైతం నివాస భవనాల కేటగిరీలో అతి తక్కువ పన్ను ఎంత ఉంటే అంతమాత్రమే వసూలు చేస్తారు. అగ్నిమాపకశాఖ, ఎయిర్పోర్ట్ అథారిటీల నుంచి ఎన్ఓసీలు మాత్రం తప్పనిసరి. ప్రమాణాలు పాటించాలి.. సెల్లార్ల తవ్వకాల్లో నిర్ణీత ప్రమాణాలు పాటించాలని జీహెచ్ఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ దేవేందర్రెడ్డి స్పష్టం చేశారు. ఇసుక బస్తాలు వినియోగించడంతోపాటు నైలింగ్, గ్రౌటింగ్లు చేయాలన్నారు. రెండువేల చ.మీ.లకు మించిన విస్తీర్ణంలో నిర్మించే భవనాలకే సెల్లార్లకు అనుమతులిస్తారు. సెల్లార్ల తవ్వకాలకు చుట్టూ 3 మీటర్ల సెట్బ్యాక్ వదలాలి. ఇది పై లెవెల్ సెల్లార్కు కాగా, దిగువ లెవెల్స్కు వెళ్లే కొద్దీ మరో 0.5 మీటర్ల చొప్పున సెట్బ్యాక్ వదలాలి. త్వరలో వర్క్షాప్.. నగర భౌగోళిక పరిస్థితులను బట్టి అసలు సెల్లార్ల తవ్వకాలకు అనుమతులివ్వవచ్చా.. ఇస్తే ఎంత లోతు వరకు ఇవ్వాలి తదితరమైనవి నిర్ణయించేందుకు ఈనెల 17లేదా 18 తేదీల్లో జియాలజిస్టులతోపాటు స్ట్రక్చరల్ ఇంజినీర్లు, ప్రొఫెసర్లు నిపుణులతో వర్క్షాప్ నిర్వహించి, తగు నిర్ణయాలు తీసుకోనున్నట్లు సీసీపీ దేవేందర్రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.