breaking news
Downers live
-
అక్కరకు రాని అమ్మ త్యాగం
⇔కుమారుడికి దానం చేసిన కిడ్నీ ఫెయిల్ ⇔రెండోసారి లైవ్డోనర్స్ లేక ఆదుకోని ఆరోగ్యశ్రీ ⇔బిడ్డ కోసం శ్రీకాకుళం నుంచి వలస ⇔దిక్కుతోచని స్థితిలో కుటుంబం చేతికి అందివచ్చిన కుమారుడికి భరించరాని కష్టం వచ్చింది. కిడ్నీలు దెబ్బతిని మంచం పట్టడంతో తల్లి కడుపు తరుక్కుపోయింది. కొడుకు జీవితమే ముఖ్యమని భావించి ఆమె తన కిడ్నీని అర్పించింది. అయినా కాలం కలిసిరాలేదు. ఆ కిడ్నీ కూడా దెబ్బతింది. ఇప్పుడు బిడ్డను బతికించుకోవడానికి రూ.8లక్షలు అవసరం. చేతిలో చిల్లిగవ్వలేక.. కుటుంబ పోషణ కష్టమై పొట్ట చేత పట్టుకుని ఆ కుటుంబం శ్రీకాకుళం జిల్లా నుంచి పట్నానికి వలస వచ్చింది. కుమారుడిని బతికించుకోవడం కోసం దాతల సాయాన్ని అర్ధిస్తోంది. గోపాలపట్నం(విశాఖ పశ్చిమ) : శ్రీకాకుళం జిల్లా జి.శిగడం మండలం నర్సింహపురం గ్రామానికి చెందిన అల్లు లక్ష్మీనారాయణ(25) ఐటీఐ చదివి వెల్డరుగా పనిచేసేవాడు. 2009లో ఉన్నట్టుండి మంచానపడ్డాడు. కిడ్నీలు దెబ్బతిన్నట్టు వైద్యులు స్పష్టం చేశారు. అప్పట్లో ఇతనికి తల్లి సింహాద్రమ్మ తన కిడ్నీ ఇచ్చి ఆదుకుంది. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం అందింది. లక్ష్మీనారాయణ కోలుకుని సాధారణ స్థితికి వచ్చాడనుకుంటే 2016లో తల్లి ఇచ్చిన కిడ్నీ కూడా దెబ్బతింది. దీంతో కొద్ది నెలలుగా డయాలసిస్ చేస్తూ కుమారుడిని బతికించుకుంటున్నారు. బతికించుకోవడానికి వలస లక్ష్మీనారాయణ కుటుంబ నేపథ్యం పేదరికం. తల్లిదండ్రులతో పాటు ఓ తమ్ముడు ఉన్నారు. గతంలో తండ్రి రమణకు ఈయన చేదోడు వాదోడుగా ఉండేవాడు. ఇప్పుడా పరిస్థితి లేదు. భారం అంతా తండ్రిపైనే పడుతోం ది. ఈ రోజు కూలి దొరికితే ఇంకో రోజు దొరుకుతుందో లేదో తెలియని పరిస్థితి. విశాఖకు వస్తే కూలి చేసి కనీసం దగ్గర్లో ఆస్పత్రికి వెళ్లి కుమారుడికి డయాలసిస్ చేయించుకోవచ్చ ని భావించి కుటుంబంతో వలస వచ్చేశారు. ప్రస్తు తం గోపాలపట్నం శివారు కొత్తపాలెంలో నివాసం ఉంటున్నారు. రమణ కూలి చేసి తెస్తున్న సంపాదన తినడానికే సరిపోతోంది. లక్ష్మీనారాయణకు డయాలసిస్ చేయించడానికి అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. మరో వైపు అప్పులూ పుట్టక డయాలసిస్ చేయించడానికి తండ్రి కొట్టుమిట్టాడుతున్నాడు. ‘జీవన్దాన్’ పొందడానికి పేదరికం అడ్డు మరణానంతరం తమ అవయవాలు మరికొందరికి ఉపయోగపడాలని వేల మంది జీవన్దాన్ పథకానికి అవయవదానాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక్కడ లక్ష్మీనారాయణకు ఈ పథకం ద్వారా లబ్ధి పొందడానికి ఆర్థిక పరిస్థితులు అడ్డంకిగా మారాయి. ఈ పథకం కింద లబ్ధిపొందడానికి లక్ష్మీనారాయణ తన పేరును 2017 జనవరి 31న నమోదు చేసుకున్నాడు. అయితే కేజీహెచ్లో ఈ పథకం లేదు. కార్పొరేట్ ఆస్పత్రుల్లోనే ఉంది. మరో వైపు ఆరోగ్యశ్రీ కూడా దీనికి వర్తించదు. ఇంట్లో రక్త సంబంధీకులు నేరుగా అవయదానం చేస్తేనే ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. జీవన్దాన్ ద్వారా కిడ్నీ పొందాలంటే రూ.8 లక్షల ఖర్చు తప్పదని కేర్ ఆస్పత్రి వైద్యులు స్పష్టం చేశారు. దీంతో ఇంత మొత్తం ఎక్కడ్నుంచి తెచ్చేదని లక్ష్మీనారాయణ తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కుమారుడి పరిస్థితి చూసి వారు కంటతడి పెడుతున్నారు. దాతల సాయం కోసం అర్ధిస్తున్నారు. అల్లు లక్ష్మీనారాయణ, డోర్: 20–192/1, అప్పలనరసింహం కాలనీ, కొత్తపాలెం, గోపాలపట్నం, విశాఖ–27 చిరునామాలో గాని, ఫోన్ నంబర్లు 90004 52749/94909 42362లలో సంప్రదించవచ్చు. -
‘పునర్జన్మ’ ప్రాప్తిరస్తు
మూడేళ్లలో 139 మంది అవయవ దానం 636 మందికి పునర్జన్మ ముందుకు వచ్చిన మరో పది వేల మంది దాతలు నేడు అవయవదాన దినోత్సవం మరణం అంటే తిరిగి జన్మించడమే... కాదంటారా... ఇదిగో వందలాది మంది తాము మరణిస్తూ మరోసారి బతికేస్తున్నారు. మరెందరికో బతుకునిస్తున్నారు. మృత్యువుకు చేరువైనవారికి కొత్త ఊపిరిలూదుతున్నారు. వారి హృదయ స్పందనవుతున్నారు. తమ కళ్లతో లోకాన్ని చూపిస్తున్నారు. ‘అవయవ దానం’ మృత్యువును జయిస్తోంది. నేడు అవయవదాన దినోత్సవంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం...! సిటీబ్యూరో: మనం జీవించకపోయిన మన కళ్లు ఈ లోకాన్ని చూస్తూనే ఉంటాయి. మనం శ్వాసించక పోయిన మన గుండె ‘లబ్ డబ్’ మంటూ కొట్టుకుంటూనే ఉంటుంది. మనం ఏ లోకంలో ఉన్నా మన మూత్ర పిండాలు ఇక్కడ రక్తాన్ని శుద్ధి చేస్తూనే ఉంటాయి. మృత్యువును జయించిన వారంతా దేవతలైతే... ఆ జాబితాలో అవయవాలను దానం చేసిన వారు కూడా చేరుతారు. కేవలం బ్రెయిన్డెడ్ బాధితుల నుంచే కాదు, లైవ్ డోనర్స్ కూడా తమ అవయవాలను దానం చేసేందుకు ముందుకు వస్తుండటంతో నగరంలో ఇటీవల అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు ఊపందుకున్నాయి. ఇప్పటి వరకు అరుదైన శస్త్ర చికిత్సలకు, ఫార్మా కంపెనీలకు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు ప్రసిద్ధి పొందిన ఆరోగ్య రాజధాని హైదరాబాద్ తాజాగా అవయవ మార్పిడి శస్త్రచికిత్సలకు కేంద్ర బిందువుగా మారుతోంది. ఎంతోమంది ముందుకు వస్తున్నారు 2002-2012 వరకు మోహన్ ఫౌండేషన్ ద్వారా 155 దాతల నుంచి సుమారు వెయ్యి అవయవాలను సేకరించి, 854 మందికి పునర్జన్మను ప్రసాదిస్తే, 2013 నుంచి 2015 ఆగస్టు 10 వరకు నిమ్స్ జీవన్ధాన్ ద్వారా 139 దాతల నుంచి వెయ్యికిపైగా అవయవాలను సేకరించి 636 మందికి పునర్జన్మను ప్రసాదించారు. తాము చనిపోయిన తర్వాత తమ శరీరంలోని అవయవాలను దానం చేయడానికి అంగీకరిస్తూ తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పదివేల మందికిపైగా దాతలు ముందుకు రావడం విశేషం. వ్యక్తి నుంచి సేకరించిన అవయవాలతో కనీసం 20 మందికి పునర్జన్మ ప్రసాదించవచ్చు. కాలేయాన్ని 10 నుంచి 12 గంటల లోపు, మూత్రపిండాలను 24 గంటల లోపు, గుండెను 4గంటల్లోపు, కళ్లను ఆరు నుంచి ఎనిమిది గంటల్లోపు అమర్చాల్సి ఉంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్సలు షురూ.. అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు ఎంతో ఖర్చుతో కూడుకున్నవి. ఒక్కో శస్త్రచికిత్సకు సుమారు రూ.15-25 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఇప్పటి వరకు కేవలం ధనవంతులు, విదేశీయులు మాత్రమే ఈ తరహా చికిత్సలు పొందేవారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఉస్మానియా, గాంధీ, నిమ్స్ వంటి ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ఈ ఖరీదైన శస్త్రచికిత్సలను ఉచితంగా అందించాలని భావించింది. ఈ మేరకు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రత్యేక ప్యాకేజీ కేటాయించింది. ఉస్మానియా, నిమ్స్ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగం వైద్యులు ఇటీవల ఇద్దరు నిరుపేద రోగులకు ఉచితంగా కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేశారు. ఆపన్నులకు అండగా జీవన్దాన్ 2012లో ప్రభుత్వం నిమ్స్ కేంద్రంగా జీవన్దాన్ నోడల్ కేంద్రాన్ని ప్రారంభించింది. 2013 నుంచి ఆర్గాన్స్ సేకరిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 28 ఆస్పత్రులు జీవన్దాన్ ఆన్లైన్ నెట్వర్క్లో పేరు నమోదు చేసుకున్నాయి. దరఖాస్తు చేసుకున్న బాధితులకు వయసు, ఆరోగ్య పరిస్థితి వగైరా అంశాలను దృష్టిలో ఉంచుకుని అవయవాలు సమకూరుస్తున్నాం. ఇప్పటి వరకు 139 దాతల నుంచి వెయ్యికిపైగా అవయవాలను సేకరించి 636 మందికి పునర్జన్మను ప్రసాదించగలిగాం. - డాక్టర్ స్వర్ణలత, ఇన్చార్జీ, జీవన్దాన్ తొలుత బాధపడ్డా నా భర్త ఫ్రాన్సిస్ అవయవాలను దానం చేసి తప్పు చేశానేమోనని చాలా రోజులు బాధపడ్డాను. కానీ ఆ తర్వాత అవయవదానం గొప్పతన ం తెలుసుకున్నాను. నా భర్త అవయవాలను ఇతరులకు దానం చేసినందుకు ఎంతో గర్వపడుతున్నా. - విజయ, దాత ఎస్పీ ఫ్రాన్సిస్ సతీమణి నలుగురికి పునర్జన్మ అక్టోబర్ 24న ఇంట్లో ప్రమాదవశాత్తూ రాధాకృష్ణ కిందపడి బ్రెయిన్డెడ్ స్థితికి చేరుకున్నాడు. అవయవ దానానికి తాను అంగీకరించడంతో సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తరలించి గుండె, గుండె రక్తనాళాలు, కాలేయం, కిడ్నీలు సేకరించారు. కన్నుమూస్తూ కూడా ఆయన మరో నలుగురికి పునర్జన్మను ప్రసాదించారు. - శిరీష, దాత రాధాకృష్ణ సతీమణి