breaking news
dhangar reservation
-
మరో రిజర్వేషన్ల పోరాటం
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో మరాఠాల తర్వాత మరో సామాజిక వర్గం విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కోరుతూ ఆందోళనలు చేపట్టింది. ధన్గర్ సామాజిక వర్గీయులు(గొర్రెల కాపరులు).. తమను షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ)ల జాబితాలో చేర్చి రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్తో సోమవారం మహారాష్ట్రవ్యాప్తంగా నిరసనల్లో పాల్గొన్నారు. ధన్గర్ సంఘర్ష సమితి మహారాష్ట్ర రాజ్య (డీఎస్ఎస్ఎంఆర్) ఈ నిరసనలకు నేతృత్వం వహించింది. ముంబైతోపాటు విదర్భ, పశ్చిమ, ఉత్తర మహారాష్ట్రల్లో నిరసనలు సాగాయి. కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై వాహనాలకు అడ్డంగా మేకలు, గొర్రెలను తోలి వినూత్నంగా రాస్తారోకో చేపట్టారు. కాంగ్రెస్–ఎన్సీపీ కూటమి మహారాష్ట్రలో అధికారంలో ఉన్నప్పుడే ధన్గర్ ప్రజలు రిజర్వేషన్లు కోరుతూ ఆందోళనకు దిగారు. ప్రస్తుత బీజేపీ సీఎం ఫడ్నవిస్ అప్పట్లో ధన్గర్ సమాజం ఏర్పాటు చేసిన వేదికపై మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే తొలి మంత్రివర్గ సమావేశంలో ఈ సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లయినా తమ గురించి పట్టించుకోవడం లేదని ఆందోళనకారులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పించే అంశంపై నివేదికను రూపొందిస్తున్న టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ఈ నెల 26లోపు తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలనీ, లేకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. -
‘ధన్గార్’ సిద్ధమవుతోంది..
♦ ధన్గార్ రిజర్వేషన్ ప్రతిపాదన సిద్ధమవుతోందన్న సీఎం ఫడ్నవీస్ ♦ మరాఠా రిజర్వేషన్ల ప్రతిపాదన త్వరలోనే కేంద్రానికి పంపుతాం ♦ మొసలి కన్నీరు కారుస్తున్న ప్రతిపక్షాలు 15 ఏళ్లు ఏం చేశాయని సూటి ప్రశ్న ♦ ఎన్నికల హామీ నిలబెట్టుకుంటామని స్పష్టీకరణ ♦ అంగన్వాడీల వేతనాలు పెంచుతూ నిర్ణయం ముంబై : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ధనగార్లను షెడ్యూల్డ్ కూలాల (ఎస్టీ)లోకి చేర్చే ప్రతిపాదన సిద్ధమవుతోందని రాష్ట్రముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వెల్లడించారు. ‘ఇచ్చిన హామీ మేరకు ధన్గార్లను షెడ్యూల్ట్ కులాల జాబితాలోకి చేరుస్తాం. ఈ ప్రక్రియలో గిరిజినుల కోటాలో ఎలాంటి కోతలు ఉండవు. ఈ ప్రతిపాదనను త్వరలో కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచుతాం’ అని స్పష్టంచేశారు. బుధవారం విధానమండలిలో ధనగార్ రిజర్వేషన్ అంశంపై తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ అంశాన్ని పట్టించుకోలేదంటూ ప్రతిపక్షాలు, ప్రభుత్వాలు పరస్పరం విమర్శించుకున్నాయి. ముఖ్యమంత్రి ఎన్నికల హామీ నిలబెట్టుకోలేదంటూ ప్రతిపక్షాలు విమర్శించాయి. దీనిపై ఘాటుగా స్పందించిన ఫడ్నవీస్, విపక్షాలు ధన్గార్ల అంశంపై మసలి కన్నీళ్లు కారుస్తున్నాయని ఎద్దేవా చేశారు. దీంతో ఇరుపక్షాల ఆందోళన తీవ్రతరం చేశాయి. ఎంతసేపటికీ సర్దుమనగడంతో సభను ఐదు నిమిషాలపాటు వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు. ప్రశ్నోత్తరాల సమయంలో భాగంగా కాంగ్రెస్ సభ్యుడు సరద్ రాన్పైసే అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన సీఎం, ‘ధనగార్ ప్రతిపాదన సిద్ధం అవుతోంది. ప్రతిపాదన మరింత ప్రభావవంతగా ఉండేందుకు అడ్వొకేట్ జనరల్ సలహా తీసుకుంటున్నాం. అలాగే ‘ఆదివాసీ సన్శోధన్, ప్రశిక్షణ్ కేంద్రా (గిరిజన పరిశోధన, శిక్షణ సంస్థ)ను ప్రతిపాదన సిద్ధం చేయాల్సిందిగా కోరాం. అది సిద్ధం అయిన వెంటనే కేంద్రానికి పంపిస్తాం’ అని వివరించారు. మరాఠాల రిజర్వేషన్పై స్పందించిన సీఎం, ‘మరాఠాలు సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలని చెప్పేలా గట్టి ప్రతిపాదన సిద్ధం చేస్తున్నాం. ఈ ప్రతిపాదనను సుప్రీం కోర్టు ముందుంచుతాం. ఇందుకోసం తమిళనాడు నమూనాను అధ్యయనం చేస్తున్నాం’ అని చెప్పారు. గత ప్రభుత్వం (కాంగ్రెస్-ఎన్సీపీ) ప్రభుత్వం బలమైన ప్రతిపాదనను పంపలేకపోయిందని, అందుకే కోర్టు దాన్ని తిరస్కరించిందని ఫడ్నవీస్ ఆరోపించారు. అంగన్వాడీల వేతనాలు పెంపు అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకుల వేతనాలు పెంచుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అంగన్వాడీ కార్యకర్తలకు రూ.950, సహాయకులకు రూ.500 పెంచుతున్నట్లు పేర్కొంది. చిన్న అంగన్వాడీ కార్యకర్తల వేతనాలు రూ.550 పెంచినట్లు వివరించింది. ‘రాష్ట్రప్రభుత్వం నుంచి అంగన్వాడీ కార్యకర్తలకు రూ.1,500 అందుతుండగా కేంద్రం నుంచి రూ.3 వేలు వస్తోంది. అలాగే సహాయకులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.500, కేంద్ర నుంచి రూ.1,500 వేత నం అందుతోంది. కాగా, చిన్న అంగన్వాడీ కార్యకర్తలకు కేంద్ర వాటాగా రూ. 2,250 అందుతోంది. మొత్తం రూ.892.4 కోట్లు ఏడాదికి అంగన్వాడీలకు చెల్లిస్తున్నాం’ అని ఆర్థికమంత్రి సుధీర్ తెలిపారు. ఏప్రిల్ నుంచే అమలులోకి.. ‘మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి పంకజ ముండే మాట్లాడుతూ, ఇప్పటికే రూ. 228 కోట్లు పంపిణీ చేసినట్లు చెప్పారు. పెరిగిన వేతనాలు 2015 ఏప్రిల్ నుంచే అందుబాటులోకి వస్తాయని వివరించారు. గత కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వం 2014 ఏప్రిల్లో అంగన్వాడీ వేతనాలు పెంచుతున్నట్లు ప్రకటించిందని, అయితే బడ్జెట్లో మాత్రం ఎలాంటి కేటాయింపులు చేయలేదని విమర్శించారు. గతేడాది పెంచిన వేతనాలను కూడా ఇస్తున్నామని చెప్పారు. దాదాపు 97,475 అంగన్వాడీ కార్యకర్తల ఉద్యోగాలు గుర్తింపు పొందినవి ఉన్నాయని, అందులో 95,341 మంది ప్రస్తుతం సర్వీసులో ఉన్నారని తెలిపారు. అలాగే 97,475 గుర్తింపు పొందిన అంగన్వాడీ సహా యకుల ఉద్యోగాలుండగా, 92,023 మంది స ర్వీసులో ఉన్నారని వివరించారు. 11,175 మినీఅంగన్వాడీ పోస్టులుండగా, 9,898 మం ది ప్రస్తుతం సర్వీసులో ఉన్నట్లు పేర్కొన్నారు. వారి ఆస్తులు జప్తు చేయాల్సిందే.. ఇతర రాష్ట్రాల నుంచి స్ఫూర్తి పొందిన ప్రభుత్వం, అవినీతి అధికారుల ఆస్తులను జప్తు చేసేందుకు వీలుగా చట్ట సవరణ చేసే యోచనలో ఉంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి సీఎం ఫడ్నవీస్ మండలిలో వెల్లడించారు. ప్రశ్నోత్తరాల సమయలో మాట్లాడిన సీఎం, ‘అవినీతి అధికారుల ఆస్తులను జప్తు చేసేందుకు అధికారం వచ్చేలా చట్ట సవరణ చేస్తాం. ఇందుకోసం ముసాయిదా బిల్లును హోం శాఖ కు పంపించాం. దాన్ని శీతాకాల సమావేశాల్లో సభ ముందుంచుతాం’ అని చెప్పారు. గత కొన్ని నెలలుగా అవినీతి ఆరోపణల కేసులో అరెస్టై విచారణ ఎదుర్కొంటున్న ప్రభుత్వ అధికారుల ఆస్తులను జప్తు విషయంపై తీసుకున్న చర్యల గురించి తెలియజేయాలని ఎన్సీపీ ఎమ్మెల్సీ ప్రకాశ్ బిన్సాలే ప్రభుత్వాన్ని కోరారు. ‘కొత్తగా చేసే చట్టం బిహార్లో మాదిరిగానే ఉంటుంది. అవినీతి కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న, విచారణ ఎదుర్కొంటున్న అధికారుల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. ఒకవేళ సదరు అధికారి నిర్దోషిగా తేలితే ఆస్తులు తిరిగి అందజేస్తాం’ అని సీఎం వివరణ ఇచ్చారు.