breaking news
Criminal Tracking Network System
-
చిటికెలో నేరస్తుల చిట్టా
సాక్షి, హైదరాబాద్: దేశంలోని వివిధ ప్రాంతాల్లో నేరాలకు పాల్పడుతూ తప్పించుకొని తిరిగే అంతర్రాష్ట్ర నేరస్తులను పోలీసులు ఇకపై గుర్తించడం, వారి వివరాలు సేకరించడం సులభం కానుంది. కేంద్ర హోంశాఖ అమలు చేస్తున్న క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ (సీసీటీఎన్ఎస్) ప్రాజెక్టు దేశవ్యాప్తంగా అన్ని పోలీస్స్టేషన్లలోనూ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడంతో క్రిమినల్స్ వివరాలన్నీ డేటా బేస్లోకి వచ్చేశాయి. దీంతో నేరస్తుల వివరాలను అన్ని రాష్ట్రాల పోలీసులు సులువుగా తెలుసుకోనున్నారు. తొమ్మిదేళ్ల సమయం... కేంద్ర హోంశాఖ 2009లో ప్రారంభించిన సీసీటీఎన్ఎస్ ప్రాజెక్టును ఇప్పటివరకు దశలవారీగా అమలు చేస్తూ వచ్చారు. ప్రతి పోలీస్స్టేషన్కు ఇంటర్నెట్ సౌకర్యం, కంప్యూటర్లు, ఎఫ్ఐఆర్ల అప్లోడ్, నేరస్తుల వివరాలు...ఇలా తొమ్మిది రకాల వివరాలను సీసీటీఎన్ఎస్లో అప్డేట్ చేస్తూ వచ్చారు. తొమ్మిదేళ్ల తర్వాత ప్రతి రాష్ట్రంలోని నేరస్తుల డేటా, వారికిపడ్డ శిక్షలు, పెండింగ్లో ఉన్న కేసులు, నిందితులు, పరారీలో ఉన్న నేరస్తుల వివరాలు, ప్రస్తుతం ఆ కేసుల స్టేటస్ వంటివన్నీ సీసీటీఎన్ఎస్ వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. మార్చి మొదటి వారం నుంచి... దేశంలోని అన్ని రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతాల్లోని అన్ని పోలీసుస్టేషన్లకు మార్చి మొదటి వారం నుంచి సీసీటీఎన్ఎస్ డేటా బేస్ అందుబాటులోకి రానుంది. రూ. 2 వేల కోట్లతో అభివృద్ది చేసిన ఈ ప్రాజెక్టులో 20 వేల పోలీస్స్టేషన్ల నుంచి డేటా అప్లోడ్ అయింది. 5 వేల మంది అధికారులు డేటాను చూసేలా అవకాశం కల్పించారు. ఎఫ్ఐఆర్, ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్, చార్జిషీట్, ఇంటర్లింక్ పోలీస్స్టేషన్, రాష్ట్ర, దేశ డేటాబేస్ సెంటర్ లింకులు, వాహనాల డేటా, వాటికి అనుసంధానమైన ఆధార్ వివరాలు, పాస్పోర్టు డేటా, మొదలైన 44 రకాల వివరాలను ఈ ప్రాజెక్టు ద్వారా పొందేలా సమకూర్చారు. ఈ డేటా బేస్ను 10 లక్షల మంది పోలీసులు నిత్యం ఉపయోగించుకునే అవకాశం ఉందని కేంద్ర హోంశాఖ భావిస్తోంది. 20 లక్షల మంది నేరస్తులు... దేశవ్యాప్తంగా సీసీటీఎన్ఎస్ ప్రాజెక్టులో అప్లోడ్ అయిన వివరాలు పోలీసులను నివ్వెరపరిచాయి. దేశవ్యాప్తంగా ఏకంగా 20 లక్షల మంది ఆర్గనైజ్డ్ అఫెండర్స్ (వ్యవస్థీకృత నేరస్తులు) ఉన్నట్లు కేంద్ర హోంశాఖ వర్గాల ద్వారా తెలిసింది. తెలంగాణలో 1.8 లక్షల మంది, ఆంధ్రప్రదేశ్లో 2.2 లక్షల మందికిపైగా వ్యవస్థీకృత నేరాలకు పాల్పడే నిందితులున్నట్లు సమాచారం. ఉత్తరప్రదేశ్లో అత్యధిక నేరస్తులుండగా మధ్యప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర ఆ తర్వాతి స్థానాల్లో నిలిచినట్లు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. -
త్వరలో జాతీయ సెక్స్ నేరగాళ్ల జాబితా!
న్యూఢిల్లీ: జాతీయ లైంగిక నేరగాళ్ల జాబితాను సిద్ధం చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మహిళలపై వివిధ రకాల లైంగిక నేరాలకు పాల్పడి చార్జ్ షీట్ ఎదుర్కొంటున్న నిందితుల వివరాలు బయటపెడతామని కేంద్ర హోంమంత్రిత్వశాఖ సుప్రీంకోర్టుకు నివేదించింది. ' క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టం (సీసీటీఎన్ఎస్)లో భాగంగా లైంగిక నేరగాళ్ల రిజిస్ట్రీ ప్రతిపాదించనున్నాం. మహిళలకు వ్యతిరేకంగా జరిగే నేరాలు ఉదాహరణకు సెక్షన్ 375 (అత్యాచారం), 376ఏ (విడిపోయిన తర్వాత భార్యతో భర్త లైంగిక చర్యకు పాల్పడటం), 376 బీ (ఉన్నతస్థాయి అధికారి దిగువ స్థాయి ఉద్యోగినిపై లైంగిక చర్యలకు పాల్పడటం) వంటి కేసుల్లో చార్జ్ షీట్ ఎదుర్కొంటున్న నేరగాళ్ల వివరాలు ఇందులో పొందుపరుస్తాం' అని కేంద్ర హోంశాఖ సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో పేర్కొంది. ఓ మహిళపై జరిగిన లైంగిక దాడి ఘటనకు సంబంధించిన ఎమ్మెమ్మెస్ ఆన్ లైన్ లో తీవ్రంగా వ్యాప్తి చెందిన నేపథ్యంలో ఈ ఘటనను సుమోటోగా తీసుకొని సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్నది. మహిళలపై సైబర్ నేరాలకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో సవివరంగా తెలియజేయాలని అదనపు సొలిసిటర్ జనరల్ మణిందర్ సింగ్ ను న్యాయస్థానం ఆదేశించింది. ఈ నేపథ్యంలో సైబర్ నేరాల అదుపునకు తీసుకున్న చర్యలు వివరిస్తూ కేంద్ర హోంశాఖ ఈ అఫిడవిట్ ను దాఖలు చేసింది.