‘నయీమ్’పై మౌనమేల చంద్రబాబూ?
చలివేంద్రపాలెం (కంకిపాడు) :‘నయీమ్ మూలాలు టీడీపీ వైపు ఉన్నాయి. పెంచి పోషించింది టీడీపీ నేతలు, మంత్రులే అని వార్తలు వస్తున్నాయి. అయినా ముఖ్యమంత్రి చంద్రబాబు నయీమ్ సంబంధాలపై కనీసం మాట్లాడే ప్రయత్నం కానీ, సమీక్షించే ధైర్యం కానీ చేయటం లేదు’ అని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కొలుసు పార్థసార«థి విమర్శించారు. మండలంలోని చలివేంద్రపాలెం గ్రామంలో సోమవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. రౌడీయిజాన్ని, నేరాలను పెంచి పోషిస్తూ, ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలని బాబు కంకణం కట్టుకున్నారని ఆరోపించారు. బ్యాంకులు నుంచి రుణాలు అందక, ఫీజురీయింబర్స్మెంటు వర్తించక రైతులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పరిపాలనంటే ఇసుక విధానం, సింధుకి ఎన్ని కోట్లు ఇవ్వాలో ఒక్కటే పని కాదని, అమరావతి భ్రమరావతి కాకుండా చూడాలని హితవుపలికారు. పుష్కరాలతోనే ప్రజలు సంతోషంగా ఉండరని, రుణాలు మాఫీ, కాలువ చివరి భూములకు సాగునీరు, తాగునీరు, పేదలకు ఆరోగ్యశ్రీ అందినపుడే సంతోషంగా ఉంటారని సీఎం చంద్రబాబు గుర్తించాలన్నారు.
ప్రత్యేక హోదాకు మొదట్నుంచీ పోరాడుతున్న జగన్
జనసేన అధ్యక్షుడు పవన్ ఆలస్యంగా అయినా స్పందించినా, టీడీపీ ఆయనపై విమర్శలకు దిగడం తగదని పార్థసారథి అన్నారు. హోదా విషయంలో టీడీపీ, బీజేపీలు డ్రామాలు ఆడుతున్నాయని, పవన్ను ఒక పావుగా వాడుకుంటున్నాయని, మొదటి నుంచీ హోదాపై స్పందించి ఉద్యమించింది వైఎస్సార్సీపీ అధినేత జగన్ ఒక్కరేనని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్సీపీ తుది వరకూ పోరాడుతుందని, చిత్తశుద్ధి ఉంటే జగన్కు మద్దతు ఇచ్చి ఉద్యమంలో భాగస్వాములు కావాలని హితవుపలికారు. సమావేశంలో పార్టీ నాయకులు తుమ్మల చంద్రశేఖర్, బండి నాంచారయ్య, మాదు వసంతరావు, మద్దాలి రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.