breaking news
Book publishing
-
రెండవ ప్రశ్న
పుస్తకం ప్రచురణ కంటే ఆ పుస్తకాన్ని సాటి రచయితకు చేరవేయడమే ఎక్కువ ఖర్చు అని తెలిసిన రోజు రచయితకు కలిగే ఇబ్బంది, బాధ అన్యులకు తెలియవు. ఎన్నో రాత్రిళ్లు జాగారం చేసి, కొన్ని మార్లు సెలవు పెట్టి, ఇంకొన్నిసార్లు అత్యవసర పనులూ ఆరోగ్య పరీక్షలూ వాయిదా వేసి, ఎలాగోలా పుస్తకం రాసి, అందుకై వేల రూపాయలు వెచ్చించి పుస్తకం ప్రచురించాక రచయితకు ప్రాథమికంగా అనిపించేది సాటి రచయితలు చదివితే బాగుండు, చదివి ఒక మాట చెప్తే బాగుండు అని!ప్రతి కొలతకూ కొన్ని ప్రమాణాలున్నట్టే ప్రతి రచయితకూ కొన్ని ప్రమాణాలు ఉంటాయి. తాను ప్రచురించిన పుస్తకాన్ని ఏ పదిమంది చదివితే రచయితగా గుర్తింపు పొందుతాడో అతనికి అంచనా ఉంటుంది. కాని ఆ పదిమందికి పుస్తకం పంపడం ఎట్లా? వాట్సప్లో మెసేజ్ పెట్టాలి. అడ్రస్ తెప్పించుకోవాలి. కొరియర్ ఆఫీసుకు వెళ్లాలి. కొరియర్ చేయాలి. పుస్తకం వెల నూట యాభై అయితే కొరియర్ వెల కూడా అంతే ఉంటుంది. ఖర్చు మీద ఖర్చు. అయినా సరే పుస్తకం పంపి సంతృప్తి పడతాడు రచయిత. అయితే పుస్తకం అందుకున్నవారు వెంటనే పుస్తకం చదివేస్తారా? కొందరు ఫ్రమ్ అడ్రస్ను చూసి కవర్ను విప్పనే విప్పరు. కొందరు కవర్ విప్పి కృతజ్ఞతల కాలమ్లో తన పేరేమైనా రాశాడా చూస్తారు. కొందరు ముందుమాటలు తిరగేసి– అవి రాసిన వాళ్ల పేరు చేసి – హు... ఇతగాడు ముందుమాట రాసేంతటి వాడయ్యాడా అని ఆ పగను పుస్తకం మీద చూపి పక్కన పెడతారు. కొందరి అశ్రద్ధ వల్ల– పాపము శమించుగాక– పుస్తకం వచ్చీ రాగానే న్యూస్పేపర్లలో కలిసిపోయి మరి కనిపించదు. పుస్తకం అందుకున్న పదిమందిలో ఒక్కరంటే ఒక్కరు కూడా ‘పుస్తకం అందింది. థ్యాంక్యూ. చదివి అభిప్రాయం తెలుపగలను’ అని మెసేజ్ పెట్టరు. రచయితే చూసి చూసి ‘దొరవారూ... పుస్తకం అందినదా’ అని మెసేజ్ చేస్తే అప్పుడు బొటనవేలు చూపుతారు.మనం పంపిన పుస్తకాన్ని అందుకున్నవారు చదవాలి అనే అంధ విశ్వాసం నుంచి బయట పడటం రచయితల ఆరోగ్యానికి మంచిది అనిపిస్తుంటుంది. పుస్తకం అందుకున్నవారు గతంలో మనకు తెలిసినవారు అని నేడు అనుకోకూడదు. గతంలో వారు రచయితలు కావచ్చు. గతంలో పుస్తకాలు చదువుతూ ఉండుండొచ్చు. ఇప్పుడూ సాహితీ సమావేశాల్లో అధ్యక్ష స్థానాల్లో, వక్తల స్థానాల్లో కనిపిస్తూ ఉండొచ్చు. అంతమాత్రం చేత వారు పుస్తకాలు చదువుతున్నట్టుగా భావించరాదు. కొందరు పిల్లల బాగోగుల్లో ఉంటుండొచ్చు. కొందరు ఉద్యోగ ఒత్తిడిలో ఉంటుండొచ్చు. కొందరు కుటుంబ సభ్యులూ... బంధువులూ తెచ్చే తంటాల్లో ఉంటారు. కొందరికి ఆర్థిక వ్యవహారాలు ఉంటాయి. కొందరు ఫేస్బుక్కుల్లో, రీల్సుల్లో జీవితాన్ని ఖర్చు చేస్తూ ఉండొచ్చు. ఇవన్నీ లేకపోయినా తోటి రచయితపై చిన్నచూపు గ్యారంటీ. అదీ గాకుంటే వ్యక్తిగత అభిరుచి చాలా ఎదిగి చాలా గొప్ప సాహిత్యపు రుచిలో ‘ఈ యావరేజ్ రచన ఏం చదువుతాములే’ అనుకుంటూ కూడా ఉండొచ్చు. ఇవన్నీ ఉన్నా సరే, ఒక కొత్త పుస్తకం రచయిత పంపితే చూసి నాలుగు పేజీలైనా చదివి, పుస్తకాన్ని అంచనా గట్టి, చిన్నపాటి వ్యాఖ్య చేయగల సమర్థులే వీరు. పుస్తకం పంపిన రచయితను ఆ మాత్రం ఉత్సాహపరచలేరా? పుస్తకాలను రచయితలే చదవనప్పుడు పాఠకులు ఎందుకు చదవాలి అనే ప్రశ్న వినిపిస్తూ ఉంటుంది. నిజమే. ఒక పుస్తకం వస్తే, అది మంచి పుస్తకమైనా సరే, వర్తమానంలోని సాటి రచయితలు ఎవరూ దానిపై పోస్ట్ రాయరు. నేను చదివాను... మీరూ చదవండని రికమండ్ చేయరు. అసలు చూడనట్టే నటిస్తారు. కాని తమ పుస్తకాలు మాత్రం అందరూ చదివి, పోస్టులు రాయాలి... పాఠకులు చదవాలి అని కోరుకుంటారు. కామన్ సెన్ ్స ప్రకారం ఇదెలా సాధ్యం? మనం ఇస్తే కదా తిరిగి వస్తుంది.క్రికెట్ వ్యాపారులు తమ క్రికెట్ను బుర్రల్లో ఎక్కించగలుగుతున్నారు. భక్తి ఆరాధకులు భక్తిని జనుల జీవనంలో అనుక్షణం నింపడానికి ప్రయత్నిస్తున్నారు. సినిమా బేహారులు పాలాభిషేకాలు ఎలా చేయాలో, పోస్టర్ల ముందు పొర్లుదండాలు ఎలా పెట్టాలో నరాల్లో కూరుతున్నారు. మత్తుపదార్థాలు అమ్మేవాళ్లు వాటికై జీవితాలు అంకితం చేసే స్థాయిలో సామాన్యులను బానిసలుగా మార్చగలుగుతున్నారు. వీరంతా సక్సస్ అయినప్పుడు రచయితలందరూ కలిసి ఒకరికై ఒకరు మద్దతుగా నిలిచి ప్రజలను పాఠకులుగా మలచలేరా? క్యూలలో ఎగబడని, తొక్కిసలాటలకు చోటివ్వని, అల్పమైన కారణాలకు, ఆసక్తులకు జీవితాలను బలి ఇవ్వని వివేకవంతమైన జిజ్ఞాసువు సమాజాన్ని నిర్మించలేరా? దేశంలో సగటు మనిషి, విద్యార్థి, గృహిణి, ఉద్యోగి, వర్తకునికి అవసరమైన మేధో ఆహారమనే బుర్ర తిండి పుస్తకంలో దొరుకుతుందని ఒప్పించలేరా?‘ఇటీవల నీవు చదివిన పుస్తకం ఏది?’ అనే ప్రశ్న కేవలం ఉద్యోగార్థిని ఇంటర్వ్యూల్లో అడిగేది మాత్రమే అనుకున్నన్నాళ్లు ఈ సమాజపు మేధోవికాస స్థాయి ఎదగదు. మరేం చేయాలి? మన మర్యాదల ప్రమాణాలు మారాలి. ప్రశ్నల తీరు మారాలి. సంస్కారాన్ని ఎంచేందుకు కొలమానాలు మారాలి. సమాజంలోని ప్రతి లేయర్లో కుశల ప్రశ్నల నమూనాను నిర్దేశించుకోవాలి. సాటి మనిషి ఎదురుపడితే మొదటి ప్రశ్న– ఎలా ఉన్నావు? అయ్యాక రెండవ ప్రశ్న– ఏ పుస్తకం చదువుతున్నావు అనేదిగానే ఉండాలి.సవాలక్ష రుగ్మతలకు మాత్రమే కాదు అగణిత తొక్కిసలాటలకూ ఈ ప్రశ్నే టీకా. -
పుస్తక ప్రచురణపైనా పెత్తనమేనా?
రచయితలు ఏమి రాయాలో, ప్రచురణ కర్తలు ఏం ప్రచురించాలో కూడా ప్రభుత్వాలే ఆదేశించే పరిస్థితులు ఏర్పడుతున్నాయా? ఇదే జరిగితే అర్థవంతమైన ప్రజాస్వామ్యంగా భారత్ తన ఉనికినే కోల్పోతుంది. మణిపూర్ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఆదేశం ప్రమాదకర పరిస్థితులకు దారి తీస్తుంది. రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, సంప్రదాయం, భౌగోళిక అంశాలకు చెందిన ఏవైనా పుస్తకాలను ప్రచురించడానికి ముందు మణిపూర్ విద్యామంత్రి నేతృత్వంలో ప్రభుత్వం నియమించిన కమిటీకి సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇది పుస్తకాలపై సెన్సార్షిప్ విధించటానికి చేసిన ప్రయత్నం మాత్రమే కాదు... రాజ్యాంగం ప్రసాదించిన వాక్ స్వేచ్ఛ, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛల ఉల్లంఘన కూడా! అయితే, నిర్దిష్టమైన పుస్తకాలను నిషేధించడానికి కూడా రాజ్యాంగం ప్రభుత్వానికి అనుమతినిస్తోంది. కానీ అది అచ్చయిన పుస్తకాలకే వర్తిస్తుంది. అంతేగానీ ప్రతి పుస్తకాన్నీ ప్రచురణకు ముందుగానే ప్రభుత్వానికి సమర్పించాలని దానర్థం కాదు. అయినా మన ప్రచురణకర్తలు ఎందుకు మౌనంగా ఉన్నారు అనేది పెద్ద ప్రశ్న. ప్రపంచంలో చాలా భయంకరమైన ఘటనలు జరుగుతుంటాయనీ, ప్రతి ఒక్క ఘటనపై మనం దృష్టి పెట్టలేమనీ నాకు తెలుసు. కానీ కొన్ని సార్లు మనం చూడలేకపోయిన లేక విస్మరించిన విష యాలు రెండూ మనల్ని ఆశ్చర్యచకితులను చేస్తాయి. ఒక్కోసారి స్వీయ ఓటమిలోకి కూడా మనల్ని నెడతాయి. ఈరోజు అలాంటి ఒక ఘట నపై నేను దృష్టి పెట్టాలని అనుకుంటున్నాను. సెప్టెంబర్ 15వ తేదీన మణిపూర్ ప్రభుత్వం ఒక జీవోను విడుదల చేసింది. రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, సంప్రదాయం, భౌగోళిక అంశాలకు చెందిన ఏవైనా పుస్తకాలను ప్రచురించడానికి ముందు వాటిని మణిపూర్ విద్యామంత్రి నేతృ త్వంలో ప్రభుత్వం నియమించిన కమిటీకి సమ ర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. నిజం చెప్పా లంటే, ఇది పుస్తకాలపై సెన్సార్షిప్ విధించటానికి చేసిన ప్రయత్నం మాత్రమే కాదు... రాజ్యాంగం మనకు ప్రసాదించిన వాక్ స్వేచ్ఛ, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛల ఉల్లంఘన కూడా అవుతుందని ఆందోళన కలుగుతోంది. రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, సంప్రదాయం, భౌగో ళిక అంశాలపై ప్రచురించిన కొన్ని పుస్తకాలు వాస్త వాలను వ్యక్తీకరించేలా ఉంటున్నాయి లేదా వివిధ సామాజిక బృందాల్లో శాంతియుత సహజీవనానికి విఘాతం కలిగించేవిగా ఉంటున్నాయని మణిపూర్ ప్రభుత్వం చెబుతోంది. ఇకనుంచి ఈ అంశాలపై రాసిన పుస్తకాలను రాష్ట్రంలోని వైస్చాన్సలర్లు, కాలేజీలు, యూనివర్సిటీల అధ్యాపకులు, మణి పూర్ ప్రభుత్వ ఉన్నత విద్యా శాఖ అధికారులతో కూడిన 15 మంది సభ్యుల కమిటీకి సమర్పించాల్సి ఉంటుంది. ఈ కమిటీ ఆమోదం లేకుండా ఏ పుస్తకాన్నయినా ప్రచురించినట్లయితే సంబంధిత చట్టప్రకారం శిక్షకు గురవుతారని ప్రభుత్వ ఆదేశం తెలిపింది. అయితే ఏ చట్టం కింద ఏ శిక్ష విధిస్తారనే విషయాన్ని అది నిర్దిష్టంగా పేర్కొనలేదు. అలాగే శిక్షకు గురయ్యేది రచయితా, లేక ప్రచురణకర్తా లేదా ఇద్దరూనా అనే విషయాన్ని కూడా స్పష్టంగా పేర్కొనలేదు. ఇప్పుడు రాజ్యాంగం వైపు చూద్దాం. భారత సార్వభౌమాధికారాన్ని, దేశ సమగ్రత ప్రయోజనా లను, శాంతిభద్రతలను దెబ్బతీసే రకం వాక్ స్వేచ్ఛపై హేతుపూర్వకమైన ఆంక్షలను విధించడా నికి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 (2) అనుమతిస్తోంది. ఇది నిర్దిష్టమైన పుస్తకాలను నిషే ధించేందుకు ప్రభుత్వాన్ని అనుమతిస్తోంది. దీనికి ఉదాహరణ ఏమిటంటే మహాత్మాగాంధీ హత్యపై కాల్పనిక చిత్రణకు సంబంధించి స్టేన్లీ వూల్పర్ట్ రాసిన ‘‘నైన్ అవర్స్ టు రామా’’ అనే పుస్తకాన్ని గతంలోనే నిషేధించారు. అంతమాత్రాన ప్రభు త్వంపైన పేర్కొన్న నాలుగు అంశాలపై రాసే ప్రతి పుస్తకాన్నీ ప్రచురణకు ముందుగానే ప్రభుత్వ కమి టీకి సమర్పించడాన్ని కూడా ఆర్టికల్ 19 (2) అనుమతిస్తుందా? దీనికి సమాధానం నిస్సందేహంగా లేదు అనే చెప్పాలి. దీనికి సమాధానం అవును అయితే అర్థ వంతమైన ప్రజాస్వామ్యంగా భారత్ తన ఉనికిని కోల్పోతుంది. కాబట్టే మణిపూర్ ప్రభుత్వ ఆదేశం అసంబద్ధమైనదే కాదు... ఆమోదించతగినది కూడా కాదు. అందుకనే ఈ అంశాన్ని చేపట్టడంలో, తీవ్రంగా నిరసన తెలపడంలో మన వైఫల్యం నన్ను ఆశ్చర్యపరుస్తోంది. అంతకు మించి భయ పెడుతోంది కూడా! అయితే పూర్తిగా వాస్తవ విరుద్ధంగా రూపొంది, సమాజాన్ని చిక్కుల్లో పడేసి, విచ్ఛిన్న పరిచే పుస్తకాలకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యా తీసుకోకూడదని దీనర్థం కాదు. ప్రభుత్వం ఇలాంటి పుస్తకాలను సవరించుకోవాలని డిమాండ్ చేయవచ్చు. నిషేధించకూడదు, కానీ ప్రభుత్వం తలుచుకుంటే దానిమీద నిషే«ధం కూడా విధించ వచ్చు. అయితే ఇవన్నీ కూడా ఏ పుస్తకానికి ఆ పుస్తకానికి మాత్రమే విడిగా వర్తించే అంశాలు. అదికూడా వాటిల్లో తప్పుందని తేలినప్పుడు! అంతేగానీ ప్రచురణకు ముందుగానే వ్యక్తులు రాసిన పుస్తకాలను కైవసం చేసుకుని, శోధించి, తర్వాత ఏది ప్రచురించవచ్చు, దేన్ని తిరస్కరించ వచ్చు అని నిర్ణయించే పనిని ప్రభుత్వం చేయ కూడదు. కానీ మణిపూర్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశం సరిగ్గా దీన్నే ప్రతిపాదిస్తోంది. కానీ ఒక్క సానుభూతి చూపడం మినహా, మన ప్రచురణకర్తలు ఎందుకు దీనిపట్ల మౌనంగా ఉన్నారు? వారు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతారనీ, ప్రభుత్వ ఆదేశాలపై లీగల్ చర్యకు సిద్ధమవుతారనీ భావించాను. అయితే నిజాయతీగా చెప్పాలంటే మణిపూర్లో కొద్దిమంది ప్రచురణ కర్తలు మినహా యిస్తే బడా ప్రచురణ సంస్థల్లో ఏ ఒక్కటీ మణి పూర్ ప్రభుత్వ ఆదేశాన్ని సవాలు చేసిన పాపాన పోలేదు. బహుశా చిన్న స్థాయి ప్రచురణకర్తలకు ఇది చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం కావొచ్చు. దీని కయ్యే ఖర్చులను వారి పుస్తకాల ద్వారా రాబట్ట లేకపోవచ్చు. అయితే ప్రచురణ కర్తలు సామూహి కంగానే ఈ ఉక్కుపాదం మీద పోరాడవచ్చు. ఎందుకంటే వీరి హక్కులు, ప్రయోజనాలు మొత్తంగా ప్రమాదంలో పడుతున్నాయి మరి. ఆక్షేపణే లేకుండా వారు ప్రభుత్వ ఆదేశాన్ని ఆమోదించినట్లయితే (ప్రస్తుతానికి వారు ఆమో దిస్తున్నట్లే కనబడుతోంది) వారూ, వారి రచయి తలు కూడా నష్టపోతారు. వారితోపాటు మనం కూడా నష్టపోతాం. పాఠకులుగా మనం చదవాలనుకునే, నేర్చుకోవాల నుకునే పుస్తకాలను ప్రభుత్వాలు నిరాకరిస్తాయి. మణిపూర్ ప్రభుత్వ ఆదేశం అందరిలాగే మనల్ని కూడా దెబ్బతీస్తుంది. కాబట్టి మన మీడియా ఎందుకు మౌనంగా ఉంటోంది అనేది ప్రశ్న. టీవీల్లో దీనికి వ్యతిరేకంగా ఆగ్రహపూరితమైన చర్చలు ఎందుకు జరగడం లేదు? మన వార్తా పత్రికలు మండిపడుతూ సంపాదకీయాలు ఎందుకు రాయడం లేదు? వాళ్లకు పరిస్థితి అర్థం కాలేదా? లేక ఏం జరుగుతోందో వారికి నిజంగానే తెలియడం లేదా? వీటికి సమాధానాలు నాకు తెలీవు కానీ ఈ ప్రశ్నలన్నీ ప్రాసంగికత కలిగి నట్టివే! అందుకే నేటి పరిస్థితి చాలా నిస్పృహను కలిగిస్తోంది. చివరకు అది నా మిత్రుడు లేవనెత్తిన ప్రశ్న దగ్గర వచ్చి ఆగింది. చివరకు మనం ఇక్కడికి చేరామా అని ప్రశ్నించాడతను. నిజం చెప్పాలంటే, సమాధానం అవును అనే! వ్యాసకర్త: కరణ్ థాపర్, సీనియర్ పాత్రికేయులు -
ఆ రహస్యాలు చెప్పడం కోసం సింగర్కి రూ.112 కోట్లు
ప్రముఖ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్తో ఓ పుస్తక ప్రచురణ సంస్థ భారీ డీల్ కుదుర్చుకుంది. ఆమె జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలకు పుస్తక రూపంలో వెలుగులోకి తీసుకురావడం కోసం ఆమెకు 15 మిలియన్ డాలర్లు(ఇండియన్ కరెన్సీలో దాదాపు 112 కోట్ల రూపాయలు) అప్పజెప్పేందుకు అమెరికాలోని ఓ టాప్ పబ్లిషింగ్ హౌజ్ ముందుకు వచ్చింది. అంత పెద్ద మొత్తంలో ఆమెకు ఇవ్వడానికి కారణం ఏంటంటే... తన జీవితంలో చోటు చేసుకున్న కన్సర్వేటర్షిప్ గురించి అంతా బయట పెట్టేందుకు బ్రిట్నీ అంగీకరించడమే. ఈ పబ్లిషింగ్ హౌస్ విడుదల చేయబోయే బుక్లో బ్రిట్నీ తండ్రి జేమీ స్పియర్స్ సంరక్షణలో తాను అనుభవించిన 13 ఏళ్ల నరకప్రాయమైన జీవితం గురించి అనేక రహస్యాలుంటాయట. 2008లో బ్రిట్నీ స్పియర్స్ సంరక్షణ బాధ్యతను ఆమె తండ్రి జేమిని స్పియర్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్రిట్నీ తన తండ్రి జేమీ స్పియర్స్ తన జీవితాన్ని నాశనం చేశాడని, అతని చెర నుంచి విముక్తి కల్పించాలని గతంలో న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన లాస్ ఎంజిల్స్ కోర్టు.. గత ఏడాది నవంబర్లో తండ్రి చెర నుంచి ఆమెకు విముక్తి కల్పిస్తూ తీర్పునిచ్చింది. బ్రిట్నీ జీవితంపై, ఆస్తిపాస్తుల ఆమె తండ్రికి ఎలాంటి నియంత్రణ ఉండబోదని కోర్టు వెల్లడించింది. ఫలితంగా ఆమె మానసిక స్థితి సరిగ్గా లేదంటూ ఏళ్ల కిందట న్యాయస్థానం విధించిన కన్సర్వేటర్షిప్ ఎట్టకేలకు రద్దైపోయింది. ప్రస్తుతం బ్రిట్నీ స్వతంత్రంగా జీవితాన్ని సాగిస్తోంది. అయితే ఆమె కన్సర్వేటర్షిప్లో ఉన్న సమయంలో పడిన ఇబ్బందులను, తండ్రికి సంబంధించిన కొన్ని రహస్యాలను పుస్తక రూపంలో ప్రచురించేందుకు పలు ప్రచురణ సంస్థలు పోటీ పడినప్పటికీ యూస్లోని ఓ పబ్లిషింగ్ కంపెనీ రికార్డు స్ఘాయిలో రూ. 112 కోట్లు అప్పజెప్పి పుస్తకం హక్కులు కొనుగోలు చేసింది. ఇంత భారీ మొత్తంలో డీల్ కుదుర్చుకున్న బ్రిట్నీ.. ఎలాంటి రహస్యాలను బయటపెడుతుందో చూడాలి మరి. -
పిల్లలకు... ఒక పుస్తకంతో... రెండు భాషలొస్తాయ్!
మీ పిల్లలకు పుస్తకాలు కొనివ్వాలనుకుంటున్నారా? చిన్నప్పుడు మీరు చదివిన ‘చందమామ’ పుస్తకాలు, రంగురంగుల సోవియట్ బొమ్మల పుస్తకాలు అందుబాటులో లేవే అని విచారిస్తున్నారా? ఈ ఇంగ్లీషు మీడియమ్ ఆధునిక చదువుల ప్రపంచంలో తెలుగు పుస్తకాన్ని మీ పిల్లలకు చేరువ చేయడమెలాగా అని లోలోపలే సందిగ్ధావస్థలో ఉన్నారా? అయితే, వీటన్నిటికీ పరిష్కారం ఇప్పుడు లభించినట్లే! ఒక తెలుగు ప్రచురణ సంస్థ (ఎమెస్కో బుక్స్), దేశ భాషల విశిష్టత, వికాసం, పరిరక్షణల మీద దృష్టిపెట్టే ప్రతిష్ఠాత్మక ప్రభుత్వ సంస్థ (సి.ఐ.ఐ.ఎల్ - మైసూరు) కలసి ఆ కొరతను తీర్చేస్తున్నాయి. ఒక పేజీలో పెద్ద బొమ్మ, ఎదురుగా పేజీలోనే సులభమైన ఇంగ్లీషులో, కిందే తెలుగులో (ఇతర భారతీయ భాషల్లో కూడా) ఉన్న బొమ్మల పుస్తకాలు ఇప్పుడు వచ్చాయి. ఏకంగా 22 భాషల్లో 1008 పుస్తకాలను తెచ్చాయి. ఇప్పటికి అర్ధ పుష్కరకాలం పైచిలుకుగా, కోటిన్నర పైగా ఖర్చుతో సాగుతున్న ఈ బాల సాహిత్య ‘సాంస్కృతిక ఏకీకరణ ప్రయత్నం’పై ‘ఎమెస్కో’ మేనేజింగ్ డెరైక్టర్ డి. విజయకుమార్తో జరిపిన సంభాషణలోని ముఖ్యాంశాలు... ఇప్పటికి 30 ఏళ్ళుగా పుస్తక ప్రచురణ, విక్రయ రంగంలో ఉన్నాను. ‘ఎమెస్కో’ తరఫున దాదాపుగా 5 వేల పుస్తకాలు ప్రచురించా. అయితే, ప్రచురణకర్తగా ఇన్నేళ్ళ నా జీవితంలో చేసిన అతి పెద్ద ప్రాజెక్ట్ మాత్రం ఈ ‘పిల్లల బుక్ బ్యాంక్’. దీని మీద పెట్టినంత శ్రమ, పెట్టుబడి మరి దేని మీదా పెట్టలేదు. ఆవేదనతో వచ్చిన ఆలోచన... నిజానికి, ఈ పిల్లల పుస్తకాల ఆలోచనకు బీజం ఏడెనిమిదేళ్ళ క్రితం పడింది. ఒకసారి ‘వరల్డ్ బుక్ ఫెయిర్’ చూసినప్పుడు భారతీయ భాషల్లో బాలసాహిత్యం చాలా తక్కువని అర్థమైంది. మరీ ముఖ్యంగా మన తెలుగులో చిన్న పిల్లలకు ఉత్తమ బాలసాహిత్యం అందుబాటులో లేదు. చిన్నప్పుడు మా తరం చదువుకున్న ‘చందమామ’ లాంటి ఉత్తమ బాలసాహిత్య పత్రికలూ లేవు. ఈ క్రమంలో ఏమైనా చేయాలనే ఆవేదన పడుతున్నప్పుడు బొమ్మలతో కథల పుస్తకాలు ప్రచురిస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. భారీ పెట్టుబడితో కూడిన ప్రాజెక్ట్ కాబట్టి, ఏకకాలంలో ఎక్కువ భాషల్లో తేవడం సరైన వ్యూహమని భావించా. కేంద్ర మానవవనరుల అబివృద్ధి శాఖ పరిధిలోకి వచ్చే సి.ఐ.ఐ.ఎల్. (సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్) వాళ్ళను అనుకోకుండా కలిశా. నా ఆలోచన వాళ్ళకూ నచ్చింది. వాళ్ళు కథ, భాష గురించి చూస్తే, నేను బొమ్మలు, పుస్తకాల ముద్రణ గురించి చూసేలా, ఉమ్మడి కాపీరైట్ ఉండేలా, ఆదాయం కూడా కలసి పంచుకొనేలా ఒప్పందానికి వచ్చాం. ఆరేళ్ళుగా ఎంతో శ్రమించి, ఇప్పటికి జనం ముందుకు కొంత తేగలిగాం. ఒక పేజీలో బొమ్మ... ఎదురుగా రెండు భాషల్లో కథ... ఒక్క ముక్కలో చెప్పాలంటే, కొత్తగా అక్షరాస్యులైనవారికీ, చిన్న తరగతులు చదివే పిల్లలకూ ఉపకరించే సాహిత్య సామగ్రి బ్యాంక్ ఇది. ఈ ప్రాజెక్ట్ కింద వచ్చే పుస్తకాలన్నిటికీ ఒక ప్రత్యేకత ఉంది. అన్నీ 16 నుంచి 24 పేజీల లోపు పుస్తకాలే. వెల అందుబాటులో (రూ. 35) ఉంటుంది. పుస్తకంలో ఒక పేజీలో పెద్ద బొమ్మ, దానికి ఎదురు పేజీలో ఇంగ్లీషులోనూ, దాని కిందే ఎంపిక చేసిన భారతీయ భాషలోనూ కథ ఉంటాయి. దీనివల్ల పిల్లలందరికీ ఒకే పుస్తకంతో ఇటు తమ మాతృభాష, అటు ఇంగ్లీషు - రెండూ నేర్చుకొనే వీలు కలుగుతుంది. పెపైచ్చు, ప్రతి పుస్తకం చివర ఆ భాషలో, ఇంగ్లీషులో కూడా చిన్న చిన్న అభ్యాసాలు ఉంటాయి. పుస్తకం చదివిన పిల్లలకు ఇటు వినోదం, వికాసంతో పాటు ఈ లాంగ్వేజ్ టూల్స్ ద్వారా రెండు భాషల మీద పట్టు వస్తుంది. సాంస్కృతిక ఏకీకరణకు మార్గం ప్రస్తుతానికి ‘పంచతంత్ర కథలు’, ‘జాతక కథలు’ లాంటి దేశవ్యాప్తంగా జనానికి తెలిసిన కథలను ఈ పుస్తకాల ద్వారా అందిస్తున్నాం. అలాగే, రామాయణ, భారతాల లాంటి దేశమంతటికీ తెలిసిన పురాణ కథలను కూడా ఇలా తేవడానికి బొమ్మలు వేస్తున్నాం. ఇక, తరువాతి దశలో ఆ యా ప్రాంతాలకు చెందిన సంస్కృతీ సంప్రదాయాలనూ, జానపద కథలనూ, అక్కడి సాహిత్య, సాంస్కృతిక ప్రముఖుల జీవితగాథలనూ ఇలాగే అన్ని భాషల్లో పిల్లల పుస్తకాలుగా తెస్తాం. దీనివల్ల ఒక ప్రాంతపు కట్టూబొట్టూ, సంస్కృతి మరొక ప్రాంతానికి తెలుస్తాయి. ఇవాళ్టికీ దేశంలో పరాయివారుగా మిగిలిపోతున్న ఈశాన్య రాష్ట్రాల వారిని అందరితో మమేకం చేయడానికి ఇది కచ్చితంగా తోడ్పడుతుంది. ఆరేళ్ళ శ్రమ... ఒకటిన్నర కోట్ల పెట్టుబడి... అది గ్రహించడం వల్లే ఈ పుస్తకాలను ఆవిష్కరించిన కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతీ ఇరానీ సైతం ఈ విశిష్ట ప్రయత్నాన్ని ఎంతో మెచ్చుకున్నారు. సింధీతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లోని భాషల్లో సైతం వీటిని తీసుకురావాల్సిందిగా కోరారు. వాటన్నిటిలో ఈ పుస్తకాలను తేవడానికి మరో రెండు, మూడేళ్ళు పడుతుంది. పిల్లల పుస్తకాల ప్రచురణ నిజానికి ఒక బృహత్తర ఉద్యమం. కేవలం లాభనష్టాల ప్రాతిపదికన ఈ పని చేయలేం. సాధారణ పుస్తకాలు ప్రచురించడం వేరు. పిల్లల పుస్తకాలేయడం వేరు. పిల్లలకు తగ్గట్లు తేలికగా అర్థమయ్యే భాష వాడుతూ, వారికి ఆసక్తికరంగా ఉండేలా మంచి బొమ్మలు వేయించి పుస్తకాలు తేవడానికి బోలెడంత శ్రమ పడాలి. సహనం కావాలి. ఉదాహరణకు ఒక పుస్తకం గమ్మత్తై మూడు కాళ్ళ గుర్రం గురించి కథ. అయితే, ఆర్టిస్టు గుర్రమనగానే పొరబడి, నాలుగు కాళ్ళ గుర్రం వేశారు. తీరా ప్రింటయ్యాక చూసుకొని, 3 వేల కాపీలూ పక్కన పడేశాం. ఇలాంటి ఇబ్బందుల్ని భరించి, ఉన్నత ప్రమాణాల్లో పుస్తకాలు తేవడం సులభం కాదు. ఈ పుస్తకాల కోసం లోపలి పేజీలకు కూడా ముఖచిత్రాలకు వాడే ‘హైబల్క్ ఆర్ట్ కార్డ్’ పేపర్ ఉపయోగించాం. దీనివల్ల పుస్తకం కొన్నేళ్ళపాటు మన్నుతుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా ఉండడానికి హ్యాండ్ పెయింటింగ్లే వాడాం. ఏటా 150కి పైగా టైటిల్స్ ప్రచురిస్తున్న మేము ఆరేడేళ్ళుగా మా ఆదాయంలో 60 శాతం పైగా ఈ ప్రాజెక్ట్ మీద పెట్టుబడిగా పెట్టాం. ఇప్పటికి రూ. 1.5 కోట్ల దాకా వెచ్చించాం. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కింద బయటకు వచ్చినవి 130 కథలే. మరో 700 కథలకు బొమ్మలు సిద్ధంగా ఉన్నాయి. (బీరువా తెరిచి చూపిస్తూ) ఇవన్నీ కథలకు వేయించిన వేలాదిబొమ్మలే! ఇలాంటి ప్రయత్నం మన భాషలు వేటిలోనూ ఇంత పెద్ద ఎత్తున ఎన్నడూ జరగలేదు. గతంలో ‘అమర్ చిత్రకథ’ లాంటివి ఉన్నా, అవన్నీ ప్రధానంగా ఎదిగిన బాలబాలికల కోసం ఉద్దేశించిన కామిక్స్ తరహావి. పిల్లల మనోలోకంలోకి ఎదిగి, చేస్తున్న ఈ ప్రయత్నం వేరు. వీటి ద్వారా ఈ తరం పిల్లలకు మా చిన్నప్పటి ‘చందమామ’ పుస్తక పఠనం లాంటి అనుభూతి కలిగించాలని నా ఆశ. ఆ ప్రయత్నంలో ఏ కొంత సఫలమైనా ప్రచురణకర్తగా కన్నా, ప్రయోజనాత్మక సాహిత్యాన్ని ప్రేమించే వ్యక్తిగా నాకెంతో సంతృప్తి, సంతోషం! ఫొటో: జి. రాజేశ్ ‘ఎమెస్కో బుక్స్’, ప్రతిష్ఠాత్మక ప్రభుత్వ సంస్థ అయిన మా సి.ఐ.ఐ.ఎల్ - మైసూరు సంయుక్తంగా ఈ ‘పిల్లల బుక్ బ్యాంక్’ ప్రాజెక్ట్ చేపట్టాం. ఈ పిల్లల పుస్తకాల్లోని కథ, కథనం, భాష మేము చూసుకుంటే, ఆ పుస్తకాల డిజైనింగ్, లోపల వేసే బొమ్మలు, ముద్రణ వ్యవహారాలు ‘ఎమెస్కో’ చూస్తుంది. అలా ఒక రకంగా ఇది ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో సాగుతున్న బృహత్తర ప్రయత్నం. రాజ్యాంగంలోని షెడ్యూల్డు భాషలన్నిటిలో, దేశంలోని అనేక గిరిజన భాషల్లో ఈ పుస్తకాలను అందించాలని మా ప్రయత్నం. ఈ నెల 21న ‘మాతృభాషా దినం’ సందర్భంగా 22 భాషల్లో (తెలుగు, కన్నడ, హిందీ తదితర 15 భారతీయ భాషలు, కుయి, ఆవో లాంటి 7 గిరిజన భాషలు) మొత్తం 1008 పుస్తకాలను కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ విడుదల చేశారు. డాక్టర్ అవదేశ్ కుమార్ మిశ్రా, డెరైక్టర్, సి.ఐ.ఐ.ఎల్ - మైసూరు రెంటాల జయదేవ