ఓ జీవితకాలపు అనుభూతి!
మానస సరోవరం
‘‘నా జీవితంలో ఎన్నెన్నో దేశాలకు వెళ్ళాను. ప్రదేశాలు చూశాను. కానీ, మొన్న సెప్టెంబర్లో చేసిన కైలాస - మానస సరోవర ప్రయాణం మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను’’ అంటున్నారు నటి - నిర్మాత మంచు లక్ష్మీ ప్రసన్న. గుజరాత్కు చెందిన ప్రసిద్ధ పర్యాటక నిర్వాహకురాలు వైశాలీ షా పటేల్ ఈ పర్యటన ఏర్పాట్లలో ఆరితేరిన వ్యక్తి. పదిహేడేళ్ళుగా ఏటా ఎంతోమందితో ఆమె ఈ యాత్ర చేయిస్తున్నారు. ‘‘ఆమె ఏర్పాట్లతో అరవై మంది బృందంలో భాగంగా నేను, మా ఆయన ఆండీ (ఆనంద్ శ్రీనివాసన్) అక్కడకు వెళ్ళి వచ్చాం’’ అంటూ తన తాజా కైలాస - మానస సరోవర యాత్ర వివరాలను ‘సాక్షి’తో ప్రత్యేకంగా పంచుకుంటున్నారు లక్ష్మీ ప్రసన్న.
ధార్మికంగా చూస్తే, మన హిందువులకే కాదు... జైనులు, బౌద్ధులకు కూడా ఈ కైలాస - మానస సరోవర యాత్ర ముఖ్యమైనది, అతి పవిత్రమైనది. అదే సమయంలో క్లిష్టమైనది కూడా! సముద్ర మట్టానికి చాలా ఎత్తున ఉన్న ప్రదేశాలు కాబట్టి, అక్కడ ప్రయాణంలో ఆక్సిజన్ తగ్గిపోతుంటుంది. ఆరోగ్య ఇబ్బందులన్నీ ఉంటాయి. అయినా సరే నేను, ఆండీ ధైర్యం చేశాం.
పాప పుట్టినందుకు కృతజ్ఞతగా...
చిన్నప్పటి నుంచి కైలాస పర్వతం ఫోటో చూసినప్పుడల్లా నాకెందుకో అక్కడకు వెళ్ళాలనీ, ఆ పర్వత పాదాలను తాకాలనీ అనిపించేది. పెరిగి పెద్దయ్యాక, పెళ్ళి చేసుకున్నాక చాలాకాలం సంతానం కోసం తపించా. చివరకు సరొగసీ విధానంలో నాకూ, ఆండీకీ పాప (విద్యా నిర్వాణ) పుట్టింది. మా ప్రార్థన మన్నించి, మా కోరిక తీర్చిన ఆ పరమేశ్వరుణ్ణి కళ్ళారా చూసి, కృతజ్ఞతగా మొక్కు చెల్లించాలనుకున్నా. అందుకే ఈ యాత్ర చేశా.
ఆండీ కూడా తన కుటుంబ ధార్మిక విశ్వాసాలతో సంబంధం లేకుండా వచ్చేశారు. పాప పుట్టినప్పుడు మేము గుజరాత్లో తరుణా పటేల్, పయస్విన్ పటేల్ దంపతుల రిసార్ట్స్లో ఉన్నాం. తమ సమీప బంధువైన వైశాలీ షా పటేల్ అందరినీ తీసుకొని, ఈ యాత్ర చేయిస్తుంటారని మాటల సందర్భంలో వాళ్ళు చెప్పారు. వైశాలి ఇప్పటికి 60 - 70 సార్లు ఈ యాత్ర చేశారంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆమె ద్వారా వివరాలన్నీ తెలుసుకున్నాం.
అయితే, అపాయకరమైన ఈ యాత్ర విషయం ముందుగా చెబితే వద్దంటారేమోనని డబ్బులు కట్టి, టికెట్లు బుక్ చేసుకొనే వరకు మా అమ్మా నాన్నలకు చెప్పలేదు. చెప్పగానే, మా నాన్న గారు వద్దన్నారు. కానీ, నేను పట్టుబట్టాను. చివరకు ఒప్పుకున్నారు. మా బృందంలో వైశాలితో పాటు తరుణ, ఆమె భర్త - మంచి ఫోటోగ్రాఫరైన ప్రయశ్విన్ కూడా వచ్చారు.
చైనా నిఘా నేత్రాల నడుమ...
భారతీయులకు అత్యంత పవిత్రమైనవీ, అఖండ భారతదేశంలో ఒకప్పుడు అంతర్భాగమైనవీ అయిన కైలాస - మానస సరోవర ప్రాంతాలు ఇప్పుడు టిబెట్లో ఉన్నాయి. టిబెట్ను చైనా ఆక్రమించుకోవడం వల్ల ఈ యాత్రకు వెళ్ళాలంటే, చైనా వీసా తప్పనిసరి. మేము ఈ యాత్రకు నేపాల్ వైపు నుంచి వెళ్ళాం. ముందుగా ఇక్కడ నుంచి విమానంలో నేపాల్లోని ఖాట్మండు చేరుకున్నాం. అక్కడ వైశాలి నేతృత్వంలో మా 60 మంది గ్రూప్ ఒక్కచోట చేరాం. అక్కడ నుంచి నేపాల్ సరిహద్దు పట్టణమైన కొదారి అనే ప్రాంతానికి ప్రయాణించాం. కొదారికి పక్కనే చైనా పరిధిలోకి వచ్చే టిబెట్ గ్రామం న్యాలమ్. ఈ రెండు పట్నాలనూ కలుపుతూ ‘ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్’ అని ఒక వంతెన ఉంది. వంతెనకు ఇటువైపు నేపాల్. అటు వైపు టిబెట్. కొదారి నుంచి న్యాలమ్కు వెళ్ళే దోవలో లెక్కలేనన్ని జలపాతాలు కనువిందు చేస్తాయి. న్యాలమ్ నుంచి ఇక పచ్చదనం పెద్దగా కనిపించదు.
కైలాస యాత్రలో చైనా అధికారులు చాలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తారు. అక్కడ వీసా ఇచ్చిన తరువాత కూడా ఎంత స్ట్రిక్ట్ అంటే, మా బస్సుల్లో ఒక్కోదానిలో ఒక్కో పోలీసాఫీసర్ వచ్చి కూర్చున్నారు. మేము దిగి, మళ్ళీ బస్సు ఎక్కిన ప్రతిసారీ తలలు లెక్కపెట్టేవారు.
సరోవర స్నానం, రుద్రాభిషేకం...
మానస సరోవరం దగ్గర రెండు రోజులున్నాం. మొదటి రోజు అక్కడకు చేరేటప్పటికి సాయంత్రం అయింది. అప్పటికప్పుడే సరోవరంలో స్నానం చేసి, బస్సులోనే సరోవరం చుట్టూ తిరిగి, పరిక్రమ పూర్తి చేశాం. దేవతలందరికీ నిలయంగా మన పురాణాల్లో పేర్కొనే మానస సరోవరం ఒడ్డునే ఆ రాత్రికి బస. ఒకప్పుడు అక్కడ గుడారాల్లో ఉండాల్సి వచ్చేదట. ఋషీకేశ్కు చెందిన ఒక భారతీయ బాబాజీ ఒకాయన అక్కడ చిన్న ఆశ్రమం లాంటిది కట్టారు. చిన్న చిన్న గదులు. వసతులు ఫరవాలేదు. ఒక్కో గదికి అయిదారుగురు వంతున మా టూరిస్ట్ బృందమంతా రాత్రి ఆ ఆశ్రమంలోనే బస.
తెల్లవారుజామున లేస్తూనే మానస సరోవర జలంతో స్నానం చేసి, సరోవరం ఒడ్డున రుద్రాభిషేకం, ‘హవనం’ చేసి, దేవుణ్ణి ప్రార్థించాం. మానస సరోవరం ఒడ్డు నుంచి చూస్తుంటే సుదూరంగా కైలాస పర్వతం స్పష్టంగా కనిపిస్తూ, ఆకర్షించింది. సాధారణంగా మబ్బులు, వాతావరణ పరిస్థితుల వల్ల కైలాస పర్వతం అంత స్పష్టంగా కనిపించదట! ఈ ఏడాది తాను జరిపిన 7 యాత్రల్లో కైలాసం ఇంత స్పష్టంగా కనిపించడం ఇదేనని యాత్రా నిర్వాహకురాలు వైశాలి చెప్పారు. మేమెంత అదృష్టవంతులమో అనిపించింది. అక్కడ నుంచి కైలాస పరిక్రమకు బయలుదేరాం.
షెర్పాల సాయంతో... కైలాస పరిక్రమ
మానస సరోవర్ దగ్గర నుంచి తార్చెన్కు ప్రయాణించాం. కైలాస పరిక్రమకు బేస్ క్యాంప్ అక్కడే. సముద్రమట్టానికి దాదాపు 15 వేల అడుగుల ఎత్తున ఉన్న అక్కడే ఆ రాత్రికి బస. మరునాడు ఉదయాన్నే అక్కడ నుంచి కైలాస పర్వత పాదాల చెంతకు బస్సులో ప్రయాణం. పర్వత పాదాల దగ్గర షెర్పాలు, గుర్రాలతో మనల్ని కలుస్తారు. చీటీల పద్ధతిలో ఒక్కో ప్రయాణికుడికి ఒక్కొక్క షెర్పాను కేటాయిస్తారు. ఒకవేళ ఏదైనా కారణం వల్ల మనం నడవలేకపోతే, ఈ షెర్పా, గుర్రం మనకు అక్కరకొస్తాయి. రెండు రోజుల్లో అతి కష్టమైన పరిక్రమ పూర్తి చేసుకొని, మళ్ళీ తార్చెన్కు చేరాం. అక్కడ నుంచి వచ్చిన దారినే న్యాలవ్ు మీదుగా ఖాట్మండుకు పయనం.
కష్టతరమైన ఈ యాత్రలో ఒక పక్క ఆక్సిజన్ అందదు, మరోపక్క ఒళ్ళు గట్ట కట్టించేసేంత చలి. ఆ పరిస్థితుల్లోనూ వైశాలి మా బృందం వెంట ఏర్పాటు చేసిన షెర్పాల జట్టు అద్భుతం. వాళ్ళు మా వెంటే ఉండి, అంత చలిలోనూ తెల్లవారుజామున, రాత్రి కూడా వేడి వేడి టీ, భోజనం లాంటివి సమకూర్చడం నిజంగా మరపురాని విషయం. ప్రతి రోజూ ఈ పూట ఏం వండుతున్నారో, భోజనంలోకి ఏం పెడుతున్నారో అని ఆసక్తిగా చూసేవాళ్ళమంటే నమ్మండి! సాక్షాత్తూ మానస సరోవరం దగ్గర కూడా షెర్పాలు సరస్సు మధ్యకు వెళ్ళి, అక్కడ నుంచి స్వచ్ఛమైన నీళ్ళు తెచ్చి, కాచి, ఆ వేడి నీటిని మాకు స్నానానికి ఇచ్చారు. ఆ చలిలో తెల్లవారుజామున అక్కడ మానస సరోవర జలంతో స్నానం చేసి, సరస్సు ఒడ్డున ‘హవనం’ (యజ్ఞం) చేయడం మర్చిపోలేని ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది.
ఆ క్షణం నాకు భయమేసింది!
ఈ యాత్ర సమయంలో ఒకానొక సందర్భంలో నాకు చిన్న భయం కలిగింది. ఒకవేళ ఊహించని కారణాలు, పరిస్థితులు ఎదురై, ఏదైనా జరిగితే ఇంటి దగ్గర అమ్మ దగ్గర వదిలి వచ్చిన నా నెలల పాప సంగతి ఏమిటన్న ఆలోచన నాలో ఆందోళన రేపింది. అంతే! ‘నాకు ఏదైనా జరిగితే, నా కూతురును ఫలానా స్కూల్లో చదివించండి’ అంటూ నా స్నేహితులు ఒకరికి మాత్రం ఎస్.ఎం.ఎస్. పంపాను. ఆ ఒక్క ఆలోచన తప్ప, ఆస్తిపాస్తుల ఆలోచనలే రాలేదంటే నమ్మండి. కానీ, నా మిత్రులు ధైర్యం చెప్పారు. దేవుడి దయ వల్ల యాత్ర సాఫీగా జరిగిపోయింది.
నిజానికి, ఈ యాత్రకు మాకు ఖర్చయింది కూడా మిగతావాళ్ళతో పోలిస్తే తక్కువే. ఖాట్మండు దగ్గర మొదలుపెట్టి మళ్ళీ ఖాట్మండు దగ్గరకు తెచ్చి వదిలిపెట్టే దాకా ఒక్కో మనిషికి లక్షా పాతిక వేల రూపాయలతో ప్రయాణం, తిండీ తిప్పా, బస ఏర్పాట్లూ అన్నీ చేశారు. అంత ఎత్తై ప్రాంతంలో ఆక్సిజన్ అందక, పెదాలు నీలంగా మారిపోతూ, ‘ఎడీమా’కు గురైనప్పుడు వారిని గబగబా కిందకు పరిగెత్తుకుంటూ మోసుకురావాల్సి ఉంటుంది. లేదంటే, క్షణాల్లో ప్రాణాలకు ముప్పు వాటిల్లవచ్చు. ప్రతి చోటా రోజుకు రెండు నుంచి మూడు గంటల పాటు నడిపించి, ఆ వాతావరణానికీ, శ్రమకూ సిద్ధపడేలా చేశారు వైశాలి. మా యాత్రలో 71 ఏళ్ళ ఒక మహిళను చూస్తే మాకెంతో స్ఫూర్తి కలిగింది. వయసు, ఆరోగ్యం సహకరించకున్నా, ఆమె అలాగే నడిచారు. పరిక్రమ చేశారు. అది చూస్తే, ఈ యాత్రకు మానసిక వైఖరి ముఖ్యమని అర్థమైంది.
ఇలాంటి యాత్రల వల్ల మేలేమిటంటే, కులం, మతం, ప్రాంతం లాంటి సంకుచిత భావాలన్నీ పక్కకు పోయి, మానవత్వం బయటకు వస్తుంది. మన పక్కనున్నది ఎవరు, ఏమిటన్నది చూడకుండా ఒకరికొకరు సాయపడడం అలవాటవుతుంది. దాన్ని బయటకు తెచ్చుకొని, మానవత్వాన్ని పరిమళింపజేయగలిగితే అప్పుడు ఈ ప్రపంచమే ఆనందమయ ప్రాంతంగా మారిపోతుంది. యాత్ర చేసి వచ్చి పది రోజులవుతున్నా, ఇప్పటికీ కళ్ళు మూసుకుంటే నాకు ఆ దృశ్యాలు కళ్ళ ముందు కదలాడుతున్నాయి. గంభీరంగా, అంత ఎత్తున ఆ కైలాస పర్వతం, ప్రశాంతమైన మానస సరోవర ప్రాంతాలను మర్చిపోలేకపోతున్నాను. అందుకే, ఈ పర్యటన నాకూ, ఆండీకీ ఒక జీవితకాలపు అనుభవం, అనుభూతి!
- సంభాషణ: రెంటాల జయదేవ
‘‘ఈ యాత్రను నా జీవితంలో మర్చిపోలేను. స్వతహాగా మాది వైష్ణవ కుటుంబమైనా, మా అమ్మానాన్నలను ఒప్పించి ఈ కైలాస - మానస సరోవర యాత్ర చేశాను. ఏ విధమైన ముందస్తు అభిప్రాయాలూ లేకుండా నిర్మలమైన మనస్సుతో వెళ్ళాను. అక్కడకు వెళ్ళిన తరువాత నాకు కలిగిన అనుభూతి మాటల్లో చెప్పలేను. వెనక్కి తిరిగి వచ్చినా, ఇప్పటికీ మానసికంగా ఆ అనుభూతిలోనే ఉన్నా. అక్కడ కస్తూరి మృగం చూశా. అలాగే, జంటగా మాత్రమే బతికే పక్షులను చూశాం. గమ్మత్తేమిటంటే, ఆ జంటలో ఏ ఒక్కటి మరణించినా, రెండో పక్షి మరునాడే చనిపోతుంది. ఈ యాత్ర పుణ్యమా అని శ్వాసక్రియ మీద ఉండాల్సిన అదుపు గురించి తెలుసుకున్నా. ఆధ్యాత్మిక భావాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ చేయాల్సిన యాత్ర ఇది!’’
- ఆనంద్ శ్రీనివాసన్ (ఆండీ), మంచు లక్ష్మి భర్త
వెళుతున్నారా? ఇది... మీ కోసమే!
ఈ యాత్రకు వెళ్ళబోయేవారికి కొన్ని సలహాలు ఇవ్వదలిచాను. యాత్రికులు నాలుగు లేయర్లుగా (థర్మల్స్, టెక్నికల్స్, ఫ్లీస్ లేయర్, రెగ్యులర్ ప్యాంట్ - షర్ట్లు) దుస్తులు, వాటి పైన గాలి, వాన, చలి నుంచి కాపాడే ‘విండ్ బ్రేకర్’ వేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నూలు దుస్తులు ధరించకూడదు. ఎందుకంటే, కాటన్ దుస్తులకు చెమటను పీల్చుకొనే గుణం ఉంటుంది. ఇన్ని రోజుల పాటు కాటన్వి వేసుకుంటే, ఒంటి మీద తేమ చేరి, ఇన్ఫెక్షన్ వస్తుంది. అలాగే, కాళ్ళకు సాక్సులు, చేతులకు గ్లౌజులు, చెవులకు చలి గాలి తగలకుండా కప్పుకోని ఉంచుకోవడం లాంటి జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. కొన్నిచోట్ల టాయిలెట్ల సౌకర్యం కూడా ఉండదు. కాబట్టి, అక్కడి పరిస్థితులకు తగ్గట్లు సర్దుకుపోవాలి. ఆక్సిజన్ కోసం రోజూ కనీసం 5 లీటర్ల మంచినీళ్ళు తాగాలి. ‘ప్రపంచానికి పై కప్పు’ అంటూ ప్రస్తావించే టిబెట్లో ఒక్క సెకన్లో వాతావరణం మారిపోతుంటుంది. చటుక్కున జోరున వాన కురుస్తుంది. కాబట్టి, చలి, వాన లాంటి వాటి నుంచి రక్షణగా ఎప్పుడూ ‘పాంచో’ (తల నుంచి కింద దాకా కప్పుకొనే కోటు) వేసుకొనే ఉండాలి. దాదాపు 15 రోజులు సరైన స్నానం, రుచికరమైన భోజనం, సుఖనిద్రలను మర్చిపోవాల్సి ఉంటుంది. అలాగే, మేట్రిక్స్ అనే కంపెనీ వాళ్ళకు సంబంధించిన మొబైల్ ఫోన్ సిమ్ తీసుకుంటే, ఈ యాత్రలో ఉపకరిస్తుంది. దానికి ఇన్కమింగ్ కాల్ ఉచితమే కాకుండా, 3జి కూడా చాలా చోట్ల పనిచేస్తుంది. ఇంట్లోవాళ్ళకు మన యోగక్షేమాలను ఎస్.ఎం.ఎస్.ల రూపంలోనైనా పంపుకొనే వీలుంటుంది. దానివల్లే మా అమ్మకు రోజుకు ఒకసారైనా ‘మేము క్షేమం’ అంటూ మెసేజ్ పెట్టేందుకు వీలైంది.
- మంచు లక్ష్మి
విహారి, సాక్షి ఫ్యామిలీ
మీరు పంపవలసిన చిరునామా: విహారి, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారా హిల్స్, హైదరాబాద్ -34. e-mail:sakshivihari@gmail.com