
సమన్వయంతో ‘భగీరథ’ను పూర్తిచేయాలి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మిషన్ భగీరథ (వాటర్గ్రిడ్) లక్ష్యాన్ని చేరుకునేందుకు ...
కలెక్టర్ టీకే శ్రీదేవి
మహబూబ్నగర్ న్యూటౌన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మిషన్ భగీరథ (వాటర్గ్రిడ్) లక్ష్యాన్ని చేరుకునేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ టీకే శ్రీదేవి ఆదేశించారు. కలెక్టరేట్లో రెవెన్యూ సమావేశ మం దిరంలో మిషన్ భగీరథ పనుల పురోగతిపై ఆమె సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. గ్రామాల్లో అన్ని రకాల అనుమతులు తీసుకోవాలని సూచించారు. పథకం ద్వారా ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇవ్వాలనే ప్రభుత్వ సంకల్పాన్ని సఫలీకృతం చేసేందుకు ప్రతీ అధికారి చిత్తశుద్ధితో పని చేయాలన్నారు. అడ్డంకులు ఎదురైతే న్యాయ పరంగా ఎదుర్కోవాలని సూచించారు. రెవెన్యూ, పంచాయతీ, అటవీ, ఇంజనీరింగ్ శాఖల అధికారులు క్షేత్ర స్థాయిలో సమన్వయం చేసుకుంటూ సాగాలని ఆదేశించారు.
పైపుల నిర్మాణంలో నాణ్యత పాటించాలని అన్నారు. ఇంజనీరింగ్ పనుల్లో సాంకేతిక విద్యార్థుల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ యం.రాంకిషన్, డీఆర్వో భాస్కర్, మిషన్ భగీరథ సీఈ కృపాకర్రెడ్డి, డీపీఓ వెంకటేశ్వర్లు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ప్రసాద్రెడ్డి, ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.