అడవిలో అన్నల సభ!
తెలంగాణ సరిహద్దు ఒడిశాలోని రామగుండం అటవీ ప్రాంతంలో మావోయిస్టులు శనివారం భారీ బహిరంగ సభను నిర్వహించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
- భారీగా హాజరైన ఆదివాసీలు, ప్రజలు
- మూడో రోజుకు చేరుకున్న మావోయిస్టుల వారోత్సవాలు
దుమ్ముగూడెం: తెలంగాణ సరిహద్దు ఒడిశాలోని రామగుండం అటవీ ప్రాంతంలో మావోయిస్టులు శనివారం భారీ బహిరంగ సభను నిర్వహించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. మావోయిస్టుల అమరవీరుల సంస్మరణ వారో త్సవాలు మూడో రోజుకు చేరుకున్న నేపథ్యంలో ఈ సభను నిర్వహించగా, ఆది వాసీలు, గిరిజనులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించడంతో పాటు.. పెద్ద ఎత్తున హాజరైన జనాన్ని ఉద్దేశించి మావోయిస్టు అగ్రనేతలు ప్రసంగించినట్లు తెలుస్తోంది. తొలుత ర్యాలీ కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ సభకు మావోయిస్టులు భారీ ఎత్తున జనాన్ని సమీకరించినట్లు తెలుస్తోంది. వారోత్సవాలకు మావోయిస్టు దండకారణ్య స్పెషల్ కమిటీ కార్యదర్శి రామన్న, సావిత్రి, లచ్చన్న, జగన్తో సరిహద్దు రాష్ట్రాల అగ్రనేతలు హాజరు కానున్నట్లు తెలుస్తోంది.
ముందే ప్రచారం..: మావోయిస్టులు ఏటా జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు అమర వీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహిస్తారు. వాటిని విజయవంతం చేయాలని మావోయిస్టులు ఎప్పటిలాగే ఈసారీ ముందు నుంచే ప్రచారం చేశారు. సరిహద్దున ఉన్న దుమ్ముగూడెం, చర్ల మండలాల్లో పోస్టర్లు వేసి పోలీసులకు సవాల్ విసిరారు. వారోత్సవాలను అడ్డుకోవడంతో పాటు వారి నుంచి ఎలాంటి విధ్వంసాలు జరగకుండా పోలీసులు కూంబింగ్ చేస్తున్నారు. ఆది వాసీలు సభకు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ.. సభకు హాజరైన జనం చూస్తే సాధ్యం కాలేదని తెలుస్తోంది.