పండ్ల రైతు కంటతడి.. | Corona Effect: Tragedy of Fruit Farmers with Lockdown | Sakshi
Sakshi News home page

పండ్ల రైతు కంటతడి..

Apr 16 2020 3:15 AM | Updated on Apr 16 2020 3:15 AM

Corona Effect: Tragedy of Fruit Farmers with Lockdown - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ పండ్ల రైతుల కంట కన్నీరు తెప్పిస్తోంది. ఎక్కువగా పండ్ల అమ్మకాలు జరిగే వేసవిలో అనూహ్యంగా తెరపైకి వచ్చిన ఈ మహమ్మారి పండ్ల తోటల్లో కనిపించని విషాదాన్ని నింపుతోంది. లాక్‌డౌన్‌తో రవాణా సమస్య ఎదురవుతుండడం తో ఒక రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే పండ్లను ఇత ర రాష్ట్రాలకు తరలించే అవకాశం లేక..నిల్వ చేయలేని పండ్లను కొన్ని ప్రాంతాల్లో రైతులు పారబోస్తుండగా, మరికొన్ని చోట్ల తక్కువ ధరలకు అమ్మేసుకుని వచ్చినదాంతో సరిపెట్టుకుంటున్నారు. దేశంలో 9కోట్ల మంది రైతులు పండ్లతోటలు, ఉత్పత్తులపై ఆధారపడి వ్యవసాయం చేస్తుండగా, ఈ సీజన్‌లో అన్ని రకాల ఉద్యానపంటలు కలిపి 310 మిలియన్‌ టన్నులకు పైగా ఉత్పత్తి అవుతాయని, అందులో 96 మిలియన్‌ టన్నులు పండ్లు ఉంటా యని భారతీయ రైతు అసోసియేషన్ల కన్సార్షియమ్‌ లెక్కలు చెబుతున్నాయి. లాక్‌డౌన్‌ ఇ లాగే కొనసాగితే ఈ ఏడాది పండ్ల రైతులకు వేల కోట్ల నష్టం వాటిల్లనుందని అంచనా.

సీజన్‌లోనే సమస్య 
రవాణా, మార్కెట్‌ సౌకర్యాల్లేక తెలంగాణలో ఎక్కువగా పండే పుచ్చకాయలు రూ.5కే అమ్ముతుండగా, మహారాష్ట్రలో ఆపిల్, ద్రాక్ష పండ్లను రైతులు పారబోస్తున్నారు. అర టి, కర్బూజ, కొబ్బరి బోండాలు వంటి ఇ ఇరుగుపొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే పంటలు కూడా రావడం తగ్గిపోయాయి. ఇక, గత నెలలోనే చాలా రాష్ట్రాల నుంచి పండ్లు హైదరాబాద్‌ శివార్లలోని కోల్డ్‌ స్టోరేజీలకు చేరుకున్నాయి. వీటిని శీతల గిడ్డంగుల్లో నిల్వ ఉంచి దేశంలోని పలు రాష్ట్రాలకు రవాణా చేసుకోవాలన్న ఉద్దేశంతో రైతులు వాటిని తీసుకువచ్చారు. ఇప్పుడు వీటిని తరలించే అవకాశం లేకుండా పోవడంతో ఎక్కడ నష్టపోవాల్సి వస్తుందోనని వాపోతున్నారు. వీటితో పాటు హైదరాబాద్‌ శివార్లలో ఉన్న వందలాది పాలీహౌస్‌లలో ఎగుమతులకు అనుకూలంగా ఉండే వేలాది టన్నుల పండ్లు ఉత్పత్తి అవుతున్నాయి. వీరికీ నష్టాలు తప్పేలా లేవు.  

కూరగాయలు కూడా... 
పండ్లతో పాటు కూరగాయలు కూడా దేశవ్యాప్తంగా రవాణా సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుతానికి సమీప ప్రాంతాల్లో రవాణా చేసుకునేందుకు ఇబ్బందులు లేకపోయినా, అంతర్‌జిల్లా, అంతర్‌ర్రాష్ట్ర రవాణాకు ప్రస్తుత పరిస్థితులు అనుకూలించడం లేదు. దేశ వ్యాప్తంగా ఏడాదికి వంకాయలు 12.98 మిలియన్‌ టన్నులు, టమాటా 20, ఆలుగడ్డ 52. 58, ఉల్లిగడ్డలు 23, బఠానీలు 5 మిలియన్‌ ట న్నులు ఉత్పత్తి అవుతాయని అంచనా. ఇవన్నీ రవాణా సమస్యతో మగ్గిపోతున్నాయి.

గతంలో ఎప్పుడూ చూడలేదు
‘కరోనా వైరస్‌ ప్రభావం పండ్లపై బాగా కనిపిస్తోంది. ఈ వైరస్‌ నియంత్రణకు చేపడుతున్న చర్యల కారణంగా ఇతర రాష్ట్రాల నుంచి మార్కెట్‌లోకి పండ్లు రావడం లేదు. వ్యాపారులు ఇతర రాష్ట్రా లకు వెళ్లి పండ్ల బేరం చేసే అవకాశం లేకపో యింది. లాక్‌డౌన్‌ ఎత్తివేసి మళ్లీ సాధారణ పరిస్థితులు ఏర్పడితే కానీ పండ్ల మార్కెట్‌కు మంచి రోజులు రావు.’
– రెహమాన్‌ఖాన్, పండ్లవ్యాపారి, మిర్యాలగూడ

Advertisement
 
Advertisement
Advertisement