
దళిత కవిత్వ వీరబాహుడు
ఇక ఇప్పుడు చెప్పులు కుట్టిన చేతులు
‘ఇక ఇప్పుడు చెప్పులు కుట్టిన చేతులు/ చట్టాన్ని కుడుతున్నాయి/ పేడెత్తిన చేతులు/ పాలనకి సమాయత్తమవుతున్నాయి/ ఈ దేశం మా ప్రణాళిక/ ఈ జనం మా వాహిక/ మనిషి మా గమ్యం/ నేల–ఎండ–గాలి–నీరు–నిప్పు మా నినాదాలు/ ప్రశ్న మా మేనిఫెస్టో/ ప్రతిఘటన మా ఆచరణ/ కులాలు లేని దేశం కోసం, వర్గాలు లేని రాజ్యం కోసం/ ధిక్కారం మా ఆయుధం’
ఆధునిక తెలుగు కవిత్వంలో మద్దూరి నగేష్బాబు ఒక కలకలం సృష్టించి వెళ్లాడు. కవిత్వం మీద అప్పటి దాకా ఉన్న వేర్వేరు అభిప్రాయాలను మట్టికాళ్లతో తొక్కుకుంటూ నడిచాడు. వెలివాడల దు:ఖాన్ని వాటేసుకుంటూ, ఫ్యూడల్ అహంకారం మీద తిరుగుబాటు చేస్తూ అతడు రాసే అక్షరాల్లోకి కొత్త మెలకువని వాగ్దానం చేస్తూ సాగిపోయాడు. కాస్త ప్రజాస్వామికంగా ఆలోచించేవాళ్ల కోసం ‘కాస్త సిగ్గుపడండి’ అంటూ సున్నితంగా చురకలేసి పోయాడు. సామాజిక అంతరాల మధ్య కుమిలిపోయే లోకం ఒకటి పూడాలనీ, వూరూ, వాడా కలిసి నడిచే అద్భుత సమాజం ఒకటి సాక్షాత్కరించబడాలనీ కోరుతూ ‘విడి ఆకాశం’ కోసం కలవరించాడు.
నిస్తబ్దతలో కూరుకుపోయిన దళిత కవిత్వంలోకి అతగాడు వీరబాహుడై కొత్త కల్లుతో రంగప్రవేశం చేసాడు. మొహమాటం లేని కవిత్వంతో పదాల కోసం దేవులాడుకోకుండా దళిత జీవితం చుట్టూ దాగిన అనేక కోణాలను ఆవిష్కరించాడు. వెలివాడ (1995), నిశాని (1995– తెరేష్బాబు, ఖాజా, వరదయ్యలతో కలిసి), రచ్చబండ (1996), లోయ(1997), మీరేవుట్లూ(1998), నరలోక ప్రార్థన(2002), గోదావరి(2005) వెలువరించాడు. మద్దూరి మరణం తర్వాత గోదావరి లాంగ్ పొయెమ్ను మానవత ప్రచురణలు పేరుతో ఆత్మకురి చెన్నయ్య సహకారంతో ఖాజా వెలుగులోకి తెచ్చారు.
దళిత ఉద్యమం ఏమి కోల్పోయిందో, దాని బలాలు, బలహీనతలు స్పష్టంగా తెలిసిన కవి మద్దూరి. అది ఏ రకమైన మార్పుని బాధ్యతగా స్వీకరించాలో, ఎవరిపై పోరాడి ఏం సాధించాలో అనే అంశాలపై సమగ్ర అవగాహన ఉన్న కవి. రాజకీయంగా, సాంస్కృతికంగా కవి ఎటువైపు ఉండాలనేదాని మీద ఆయనకు నిక్కచ్చితనం ఉంటుంది. ‘వెలివాడల తల్లుల్లారా! ఇక కత్తుల్నే కనండే’ అని దిశానిర్దేశం చేశాడు.
(జనవరి 9న సాయంత్రం 5 గంటలకు గుంటూరు ఎ.సి.కాలేజీ ఆవరణలో మద్దూరి నగేష్బాబు వర్ధంతి సభ.)
డాక్టర్ నూకతోటి రవికుమార్
9848187416