ఆకలిరాజ్యంతో అగ్రదేశాల ఆట | Narendra Modi Says India Blocked Trade Deal to Serve the Poor | Sakshi
Sakshi News home page

ఆకలిరాజ్యంతో అగ్రదేశాల ఆట

Aug 14 2014 1:09 AM | Updated on Oct 1 2018 2:44 PM

ఆకలిరాజ్యంతో అగ్రదేశాల ఆట - Sakshi

ఆకలిరాజ్యంతో అగ్రదేశాల ఆట

బాలీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని కాపాడుకోవడానికి 60 కోట్ల మంది రైతుల బతుకు తెరువును నాశనం చేయాలని నాటి యూపీఏ ప్రభుత్వం ఎలా నిర్ణయానికి రాగలి గిందో అర్థం కాదు.

బాలీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని కాపాడుకోవడానికి 60 కోట్ల మంది రైతుల బతుకు తెరువును నాశనం చేయాలని నాటి యూపీఏ ప్రభుత్వం ఎలా నిర్ణయానికి రాగలి గిందో అర్థం కాదు. దేశంలోని కోట్లాది పేదల ప్రయోజనాలను ఫణంగా పెట్టడం ద్వారా,  ధనిక దేశాలలో ఉద్యోగాల కల్పనకు సహకరించి భారత్ ఏం సాధించాలని భావిస్తోంది?
 
 ధనిక దేశాలలో ఉద్యోగాల కల్పన కంటే, దేశంలో అరవై కోట్ల మంది రైతుల బతుకు తెరువుకు భద్రత కల్పించడమే ప్రధానం. ఈ విషయంలో ఎన్డీయే వైఖరి పూర్తిగా సరైనది. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) బాలీలో డిసెం బర్, 2013లో నిర్వహించిన మంత్రుల స్థాయి సమావేశంలో చేసుకున్న ఒప్పందం మీద భారత్ సంతకం చేసింది. అక్కడ సంతకం చేయడమంటే, నిస్సందేహంగా భారత్‌లోని 60 కోట్ల మంది రైతుల భవిష్యత్తుకు సంబంధిం చిన ప్రయోజనాలతో రాజీపడడమే. ఇటీవలి జెనీవా సదస్సులో సంతకం చేయకుండా ప్రధాని మోడీ ఆ తప్పును సరిదిద్దే పని చేపట్టారు.
 
 బాలీ సదస్సు సమయంలో వాణిజ్య వ్యవహారాల మంత్రిగా ఉన్న ఆనంద్‌శర్మ మోడీ చేసిన ప్రకటన ‘తప్పు, అసత్యం’ అంటూ వాదించవచ్చు. అయినప్పటికీ ఆయన పేద రైతాంగం ప్రయోజనాలను తాకట్టు పెట్టారన్న మాట సత్య దూరం కాదు.  రైతులకు ఇస్తున్న కనీస మద్దతు ధరకు నాలుగేళ్ల పాటు తాత్కాలిక రక్షణ కల్పించడానికి ఆనంద్ శర్మ ఆమోదించారు. దీని వెనుక పెద్ద కారణమేమీ లేదు. కర్షకుల జీవికను ధ్వంసం చేయడమే ఉద్దేశంగా ఉన్నప్పటికీ, బాలీ డబ్ల్యూటీఓ మంత్రుల స్థాయి సమావేశం విజయం సాధించిందని నమ్మించడమే దీని వెనుక ఉన్న ఉద్దేశం. బాలీ మంత్రుల స్థాయి సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని కాపాడుకోవడానికి 60 కోట్ల మంది రైతుల బతుకు తెరువును నాశనం చేయాలని నాటి యూపీఏ ప్రభుత్వం ఎలా నిర్ణయానికి రాగలిగిందో అర్థం కాదు. దేశంలోని కోట్లాది పేదల ప్రయోజనాలను ఫణంగా పెట్టడం ద్వారా, ధనిక దేశాలలో ఉద్యోగాల కల్పనకు సహకరించి భారత్ ఏం సాధించాలని భావిస్తోంది?
 
 అమెరికా సంస్థల అభ్యంతరం
 మద్దతు ధర పథకాలకీ, ఆహార సహాయ నిధులకీ ముడి పెట్టడాన్ని వ్యతి రేకిస్తూ అమెరికాకు చెందిన అనేక వ్యవసాయ సంస్థలు లేఖలు రాశాయి. అమెరికా వాణిజ్య ప్రతినిధి మైఖేల్ ఫ్రోమన్‌కీ, ఆ దేశ వ్యవసాయ మంత్రి థామస్ విల్సాక్‌కీ ఆ లేఖలు అందిన సంగతి ఆనంద్‌శర్మకీ తెలుసు. చట్టబ ద్ధంగా దేశంలో ఇచ్చే ఆహార సహాయ పథకాల గురించి తప్పు పట్టవలసిన దేమీ లేదని వ్యవసాయోత్పత్తులను ఎగుమతి చేసే 30 అమెరికా సంస్థలు భావించాయి. అయితే మద్దతు ధర పథకాల గురించి మాత్రం ఆందోళన వ్య క్తం చేశాయి. అవి పేదలకు ఆహారం అందించడం కంటే, వ్యవసాయ ఆదా యాన్నీ, ఉత్పత్తినీ పెంచడానికే ఉపకరిస్తాయని ఆ సంస్థల అభిప్రాయం. ఫెడరల్ మద్దతు దండిగా ఉన్న ఈ ఎగుమతి సంస్థలే రైతులకు, తాత్కాలిక ప్రాతిపదికనే అయినా కూడా,  సడలింపు ఇవ్వడం గురించి ఏటా ప్రశ్నిస్తూనే ఉంటాయి. ఇలాంటి మినహాయింపులు, సడలింపులు మరిన్ని రాయితీలు ఇవ్వడానికి దోహదం చేస్తాయి. దీని ఫలితం ఏమిటంటే, అమెరికా వాణిజ్య ప్రయోజనాలు దెబ్బతింటాయి. ఈ నేపథ్యంలోనే భారత రైతాంగానికి మద్ద తు ధర ఇవ్వడం గురించి ఒక శాశ్వత పరిష్కారాన్ని కనుగొనడంలో బాలీ సమావేశం విఫలమైందన్నది సుస్పష్టం. ఆ సమావేశంలో భారత్ ఒక కఠిన విధానాన్ని అనుసరించి ఉంటే ప్రస్తుత సంక్షోభం ఉత్పన్నమయ్యేది కాదు.
 
 శాశ్వత ప్రాతిపదికన ఆహార నిల్వల ఏర్పాటుకు, రైతులకు తగినంత ఆదాయం సమకూర్చేందుకు సంబంధించిన హామీకీ ముడి పెట్టేవరకు వాణిజ్య సౌకర్యాల ఒప్పందం ప్రొటోకాల్‌లో సవరణలకు ఆమోదించరాదని (జూలై 31లోగా) నిర్ణయించుకోవడం ద్వారా భారత్ తన వైఖరిలో పెద్ద మార్పునే ప్రదర్శించింది. డబ్ల్యూటీఓ ఉరుగ్వే సమావేశాల నుంచి ఈ వైఖరిని భారత్ తీసుకున్నది. దేశ ఆహార భద్రత పరిరక్షణకే కాదు, 60 కోట్ల రైతుల జీవనోపాధి రక్షణకు కూడా భారత్ అనుసరిస్తున్న ఇలాంటి వాణిజ్య దౌత్యం ఉపకరిస్తుంది. అమెరికా స్టేట్ సెక్రటరీ జాన్ కెరీ తన భారత పర్యటన చివరి నిమిషంలో కూడా ప్రయత్నాలు చేసినప్పటికీ లెక్క చేయనట్టు కనిపించిన మోడీ వైఖరి ఆశలు నింపుతోంది.
 
  చర్చలలో పాల్గొంటున్న భారతీయ బృందం సభ్యుల తరఫున ప్రధాని చెక్కుచెదరకుండా నిలబడడం ఇదే ప్రథ మం. గత సమావేశాలలో భారతదేశం నుంచి వెళ్లిన వాణిజ్య మంత్రి గళం గట్టిగా వినిపించడం, అంతర్జాతీయ మీడియాలో ప్రముఖంగా కనిపించడం; చివరికి ఒప్పందం మీద ఎక్కడ సంతకం చేయమంటే అక్కడ సంతకం చేసి రావడం మనకు అనుభవమే. గత ఇరవై సంవత్సరాలుగా ఇదే జరుగుతోంది. బాలీ సమావేశంలో ఆనంద్‌శర్మ ‘శాంతి నిబంధన’ మీద సంతకం చేయడానికి నిరాకరించి ఉంటే మన వాణిజ్య ప్రమాణాలలో మెరుగైన మార్పులు రావడానికి వీలు కలిగేది. ఆ నిబంధనే వ్యవసాయ రాయితీల నిబంధనలను ఉల్లంఘించినందుకు వివాదాల ఫ్యానెల్ ముందు భారత్‌ను నిలబెడుతుంది. భారత్‌కు ఒక  శాశ్వత పరిష్కారం అవసరం. అదే దేశంలోని లక్షలాది మంది క్షుద్బాధను తీర్చేందుకు మార్గం సుగమం చేస్తుంది.
 
 వాణిజ్యపరమైన చర్చలను భగ్నం చేసినందుకు అమెరికా ఏనాడూ చింతించలేదు. ఎప్పుడూ తన ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తూ 30 సందర్భాలలో ఎలాంటి నిర్ణయాలు చేయకుండా స్తంభింపచేసిన ఉదాహరణలు ఉన్నాయి. పత్తికి రాయితీ ఇవ్వడం గురించి ఇటీవల కాలమంతా అమెరికా వ్యతిరేకిస్తూనే రావడం ఇందుకు ఒక ఉదాహరణ. షరతులకు లోబడి ఉండడమే మంచిదంటూ దేశంలో వినిపిస్తున్న గొణుగుడు, కఠిన విధానం అనుసరిస్తే భారత్ ఏకాకిగా మిగిలిపోతుందన్న భయాలను ఇంకాస్త పెంచుతున్నాయి. భారత్ ఈ విషయంలో గోరంతలను కొండంతలను చేస్తోందని కొందరు ఆర్థికవేత్తలు వ్యాఖ్యానించారు. 60 కోట్ల రైతుల పొట్ట కొట్టడం వారికి గోరంతలా కనిపిస్తోంది. ఆ ఆర్థికవేత్తలలో చాలామంది ఇంకో అడుగు ముందుకు వేసి భారత రైతాంగానికి ప్రపంచంలోనే ఎక్కువ చెల్లిస్తున్నారని తప్పుడు లెక్కలు ఇచ్చే వరకు వెళ్లారు. అమెరికాలో మాదిరిగా కాకుండా, భారత్‌లో సేద్యం ఆర్థికంగా లాభసాటి కాదు. గడచిన 15 సంవత్సరాలలో మొత్తం మూడు లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడమే ఇందుకు నిదర్శనం.
 
 కనీస మద్దతు ధరకు బద్ధవ్యతిరేకం
 డబ్ల్యూటీఓ కోరుకుంటున్నదేమిటంటే, రైతులకు ఇస్తున్న కనీస మద్దతు ధర వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేయాలి. లేదా ఆ మద్దతు ధరను వ్యవసా యోత్పత్తి మొత్తంలో పది శాతం దగ్గర నిలిపివేయాలి. 1986-88 నాటి డబ్ల్యూటీఓ ధర  విధానం అంచనా ప్రకారం ఇప్పుడు ధాన్యం సేకరణ ధరగా చెల్లిస్తున్న మొత్తం క్వింటాల్ ఒక్కింటికి రూ. 1,360. దీనినే క్వింటాల్‌కు రూ. 600కు తగ్గించవలసిన అవసరం ఉందని డబ్ల్యూటీఓ భావిస్తోంది. కానీ దీని మీద భారత్ వైఖరి పూర్తిగా భిన్నంగా ఉంది. కాలం చెల్లిన ధరల నిర్ణయ విధానం కాకుండా, 2010-12 సంవత్సరాల ఆధారంగా, వాస్తవికంగా దాని మీద పునరాలోచన చేయాలని భారత్ ఆకాం క్షిస్తున్నది.
 
అయితే అమెరికాకు, ఈయూ, ఆస్ట్రేలియా, జపాన్‌లకు ఇది అంగీకారయోగ్యంగా లేదు. డబ్ల్యూ టీఓ నిబంధనలకు అనుగుణంగా కనీస మద్దతు ధరను దాదాపు యాభై శాతం తగ్గించినా, లేదా ధాన్యం సేకరణ ధర విధానాన్ని పూర్తిగా ఎత్తేయ డానికి అంగీకరించినా అది రైతులను వీధుల పాలు చేయడమే అవుతుంది.

నిజానికి  డబ్ల్యూటీఓ నిబంధనల విషయంలో భారత్ తలుపులు మూసేసు కున్నా, తదుపరి చర్చల కోసం ఓ కిటికీ మాత్రం తెరిచే ఉంచింది. సెప్టెం బర్‌లో మళ్లీ డబ్ల్యూటీఓ సమావేశమైనప్పుడు భారత్ వాణిజ్య దౌత్యానికి అసలు పరీక్ష మొదలవుతుంది. పేద ప్రజల ఆకలి తీర్చడంలో దేశానికి ఉన్న సార్వభౌమాధికారం దగ్గర దేశం రాజీ పడకూడదు. ఆహారం విషయంలో స్వావలంబనను కొనసాగించడానికి ఏర్పరుచుకున్న విధానం లొసుగులతో ఉంచడం భారత్ అభిమతం కాకూడదు.
 (వ్యాసకర్త వ్యవసాయ రంగ విశ్లేషకులు)
 దేవీందర్ శర్మ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement