రజనీకాంత్‌ అసలు రాజకీయం ఇదీ!

Chidambaram, political leaders counter attack on Rajinikanth on CAA support - Sakshi

రజనీకాంత్‌పై మండిపడుతున్న తమిళనాడు ప్రతిపక్ష నేతలు

బీజీపీ చేతిలో కీలుబొమ్మంటూ తీవ్ర విమర్శలు

కాంగ్రెస్‌ నేత, మాజీ ఆర్థికమంత్రి చిదంబరం ట్వీట్‌

కౌంటరిచ్చిన కార్తీ చిదంబరం 

సాక్షి, చెన్నై: పౌరసత్వం (సవరణ) చట్టానికి మద్దతుగా నటుడు రజనీకాంత్ చేసిన ప్రకటనకు వరుస కౌంటర్లు పేలుతున్నాయి. సీఏఏ, ఎన్‌పీఆర్‌ గురించి ప్రతిపక్ష పార్టీలు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయ‍న్న రజనీకాంత్‌ వ్యాఖ్యలను  తమిళనాడు ప్రతిపక్ష నాయకులు తీవ్రంగా ఖండించారు. అలాగే  కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఆర్థికమంత్రి చిదంబరం రజనీకాంత్‌పై   విమర్శలు గుప్పించారు.

అధికార  బీజేపీ చేతిలో ఆయన కీలు బొమ్మగా మారిపోయాడని  తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అళగిరి   మండిపడ్డారు. సీఏఏ అమల్లోకి వస్తే 17 కోట్ల మంది ముస్లింలు, మూడు కోట్ల మంది క్రైస్తవులతోపాటు 83 కోట్ల మంది హిందువులు కూడా ప్రభావితమవుతారు. అస్సాంలో 19 లక్షల మంది పౌరులను విదేశీయులుగా ప్రకటించారు. ఈ జాబితాలో ముస్లింలు,  హిందువులు ఉన్నారనే సంగతి రజనీకాంత్‌కు తెలుసా అని అళగిరి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసోంలో మాదిరిగా దేశవ్యాప్తంగా నిర్బంధ కేంద్రాలు ఏర్పాటు చేయాలను కుంటున్నారా? అని  ప్రశ్నించారు.  రజనీకాంత్ తమిళనాడులో మతపరమైన ఎజెండాను  భుజానకెత్తుకున్నారని స్పష్టమైందనీ,  రజనీ అసలు రాజకీయాలు ఇప్పుడు బహిర్గతమ య్యాయని విమర్శించారు.

మతం ప్రాతిపదికన పౌరులపై వివక్ష చూపలేమని రాజ్యాంగం చాలా స్పష్టంగా పేర్కొందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి కె బాలకృష్ణన్‌ వ్యాఖ్యానించారు. బీజేపీకి రజనీకాంత్‌ మద్దతు ఇవ్వాలనుకుంటే ఇచ్చుకోవచ్చు.. కానీ వాస్తవాలను మరుగుపరచకూడదన్నారు. జనాభా గణన, ఎన్‌పీఆర్‌ వేర్వేరు అనే విషయాన్ని ఆయన మొదట అర్థం చేసుకోవాలని హితవు పలికారు.

అలాగే కాంగ్రెస్‌ సీనియర్‌నేత, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పీ చిదంబరం రజనీకాంత్‌ వ్యాఖ్యలపై నిరాశ వ్యక్తం చేశారు. సీఏఏ ఎందుకు వివక్షాపూరితమైందో, రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ఉల్లంఘన ఎలా అవుతుందో రజనీకాంత్‌ వివరించేవాడినని ఆయన ట్వీట్ చేశారు. అటు కాంగ్రెస్‌ నేత, ఎంపీ కార్తీచిదంబరం కూడా రజనీకాంత్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నట్లు రజనీ నటించాల్సిన అవసరం లేదని కార్తీ ఎద్దేవా చేశారు. ఆయన బీజేపీలో చేరవచ్చని  పేర్కొన్నారు. కాగా పౌరసత్వ సవరణ చట్టానికి సూపర్‌స్టార్ రజనీకాంత్‌ మద్దతును ప్రకటించిన విషయం తెలిసిందే. సీఏఏపై బుధవారం స్పందించిన రజనీ సీఏఏ వలన ముస్లింలకు ఎలాంటి ముప్పు లేదని, ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగితే వారి తరపున పోరాడే మొదటి వ్యక్తిని తానే అవుతానని రజనీ ప్రకటించారు.

చదవండి :సీఏఏ, ఎన్‌పీఆర్‌పై రజనీకాంత్‌ కీలక వ్యాఖ్యలు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top