అతిపెద్ద త్రివర్ణ పతాకం ఆవిష్కరణ | 72 feet national flag hoisted by KCR | Sakshi
Sakshi News home page

అతిపెద్ద త్రివర్ణ పతాకం ఆవిష్కరణ

Jun 3 2016 12:42 AM | Updated on Sep 4 2018 5:21 PM

అతిపెద్ద త్రివర్ణ పతాకం ఆవిష్కరణ - Sakshi

అతిపెద్ద త్రివర్ణ పతాకం ఆవిష్కరణ

దేశంలోనే అతిపెద్దదైన త్రివర్ణ పతాకావిష్కరణ గురువారం సంజీవయ్య పార్కులో ఘనంగా జరిగింది.

సంజీవయ్య పార్కులో ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో భాగంగా హైదరాబాద్ సంజీవయ్య పార్కులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన దేశంలోనే అతిపెద్ద జాతీయ పతాకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 291 అడుగుల ఎత్తయిన జెండా స్తంభంపై 72 అడుగుల పొడవు, 108 అడుగుల వెడల్పుతో తయారు చేసిన జాతీయ పతాకాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గురువారం ఆవిష్కరించారు. జెండా స్తంభం సమీపంలో ఏర్పాటు చేసిన వేదిక నుంచి మీట నొక్కి జెండాను ఆవిష్కరించారు. స్తంభంపైకి చేరడానికి జెండాకు దాదాపు 10 నిమిషాలు పట్టింది.

కార్యక్రమంలో స్పీకర్ మధుసూదనాచారి, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శ ర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ జెండా చుట్టుపక్కల దాదాపు 20 కిలోమీటర్ల వరకు స్పష్టంగా కనిపిస్తుందని అధికారులు పేర్కొన్నారు. సీఎం సహా ప్రముఖులు వెళ్లాక జెండాను చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చి సెల్ఫీలు దిగారు. జార్ఖండ్ రాజధాని రాంచీలో 293 అడుగుల పొడవైన జెండా స్తంభంపై 66 అడుగుల పొడవు, 99 అడుగుల వెడల్పుగల జాతీయ పతాకాన్ని రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ ఇటీవల ఆవిష్కరించారు.
 
అతిపెద్ద జెండా వివరాలు...
త్రివర్ణ పతాకం కొలతలు: 72 అడుగుల పొడవు, 108 అడుగుల వెడల్పు
జెండా స్తంభం ఎత్తు: 291 అడుగులు, స్తంభం బరువు: 40 టన్నులు
పతాకం బరువు: 65 కేజీలు, ఉపయోగించిన క్రేన్ సామర్థ్యం: 500 టన్నులు
తయారు చేయడానికి పట్టిన సమయం: 25 రోజులు
ప్రాజెక్టు వ్యయం: రూ. 3 కోట్లు
స్తంభాన్ని తయారు చేసినవారు: స్కిప్పర్ లిమిటెడ్, కోల్‌కతా
జెండా సరఫరా చేసినవారు: ఫ్లాగ్ షాప్, ముంబై, ఫిల్వెక్స్ హాబీ సొసైటీ, ఖమ్మం
ప్రాజెక్టును పర్యవేక్షించినవారు: రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement