గోకులకృష్ణా.. గోపాలకృష్ణా | krishna..hare..krishna | Sakshi
Sakshi News home page

గోకులకృష్ణా.. గోపాలకృష్ణా

Aug 24 2016 11:31 PM | Updated on Sep 4 2017 10:43 AM

గోకులకృష్ణా.. గోపాలకృష్ణా

గోకులకృష్ణా.. గోపాలకృష్ణా

మహాభారతంలోని ఒక చిన్న ఘట్టమే అయినా మన దేశ వాసులు భగవద్గీతను పవిత్ర గ్రంథంగా భావిస్తారు. గీతకారుడు శ్రీకృష్ణుడిని దైవంగా పూజిస్తారు. భారత, భాగవతాలు రెండింటిలోనూ కృష్ణుడు ప్రధానపాత్ర వహించాడు. లీలా మానుష వేషధారి అయిన ఆయన నేడు మన సమాజం పాటిస్తున్న సకల ధర్మాలను ఆనాడే తెలిపాడు. ఇన్ని ప్రత్యేకతలు గల శ్రీకృష్ణుని జన్మాష్టమి నేడు. ఈ సందర్భంగా ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం.

కడప కల్చరల్‌ :
భారతంతోపాటు భాగవతంలో కూడా కృష్ణుడిదే ప్రధాన పాత్ర. అందుకే దశావతారాల్లో కృష్ణావతారానికిS ఎంతో విశిష్టత ఉంది. శ్రీరాముడిగా సున్నిత మనుస్కుడై సచ్ఛీలం, ధర్మ పాలనతో లోకానికి ఆదర్శంగా నిలిస్తే, భారత, భాగవతాలలో రాజకీయ దురంధురుడిగా, మంత్రాంగ నిపుణుడిగా, లీలా మానుష వేషధారిగా ఆయన నేటి ధర్మాలను ఆనాడే వివరించారు.
తరించిన జిల్లా..
 తెలుగు సాహిత్యంలో శ్రీకృష్ణుని లీలలను వివరించడంలో మహా భాగవతానికి మించిన గ్రంథం మరొకటి లేదన్నది పురాణ పండితుల అభిప్రాయం. భక్తకవి పోతన మనజిల్లాలోని ఒంటిమిట్ట క్షేత్రంలో భాగవతాన్ని రచించారు. నాటి పలువురు పాలకులు ఎంత ఆశ చూపినా భాగవతాన్ని ఒంటిమిట్ట రామయ్యకే అంకితమిచ్చాడు. మన గడ్డపై వెలిసిన ఈ గ్రంథం తెలుగు సాహిత్యంలో ‘నభూతో నభవిష్యతి’గా నిలిచింది.
– అలాగే ఒంటిమిట్ట వాసి, ఆ క్షేత్రంపై పలు రచనలు చేసిన  విద్వాన్‌ కట్టా నరసింహులు పలు సంవత్సరాలుగా మిత్రులతో కలిసి ఒంటిమిట్టలో పోతన సాహిత్య పీఠాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం వేలాది మంది విద్యార్థులకు భాగవత పద్యార్చన పేరిట పోతన పద్య రచన పోటీ నిర్వహిస్తున్నారు.  
శ్రీకృష్ణుడి సేవలో...
        జిల్లాలో పలువురు కవులు శ్రీకృష్ణుని సేవలో తరించారు. ప్రముఖ ఇంజనీరు పుత్తా పుల్లారెడ్డి ‘భాగవత నామ సర్వస్వం’ పేరిట భాగవతంలోని 4124 పేర్లు, వాటి వివరాలతో 450 పేజల పుస్తకాన్ని వెలువరించారు. పద్మశ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు భాగవత సుధాలహరి, జనమంచి శేషాద్రిశర్మ కృష్ణావతార తత్వం, వావిలికొలను సుబ్బారావు కృష్ణాలీల తరింగిణి, మైనంపాటి సుబ్రమణ్యం శ్రీకృష్ణ తాండవం రచించారు. వేంపల్లె గండిక్షేత్రంలోని భూమానంద ఆశ్రమ పీఠాధిపతి శ్రీ రామకృష్ణానంద భాగవతోపన్యాసాలు రాశారు.  ఆధ్యాత్మిక వేత్త అచ్చోలు పుల్లారెడ్డి భగవద్గీతను బాగా అధ్యయనం చేసి గీతా ప్రచారానికి విశేషంగా కృషి చేశారు.
– శ్రీ కృష్ణ ఆలయాలు..
జిల్లాలో శ్రీకృష్ణుని ఆలయాలు తక్కువేనని చెప్పవచ్చు. కడప నగరం ద్వారకానగర్‌ కాలనీలోనూ, రాయచోటి రోడ్డులోనూ శ్రీకృష్ణాలయాలు ఉన్నాయి. రాయచోటి మోటకట్ల ఆలయం వద్ద శ్రీకృష్ణుని భారీ విగ్రహం, జమ్మలమడుగు వద్ద భారీ రథం ఆకారంలో శ్రీకృష్ణాలయం జిల్లాలో ప్రత్యేక ఆకర్శణలుగా నిలిచాయి. పోతన లాంటి మహాకవికి కార్యక్షేత్రమైన ఒంటిమిట్ట ఆలయం గోడలు, స్తంభాలపై శ్రీకృష్ణునికి సంబంధించిన ఎన్నో శిల్పాలను చూడవచ్చు.

భిన్న కోణాలలో
        శ్రీకృష్ణుని పాత్రను భిన్న కోణాలలో విశ్లేషించవచ్చు. ఆయన లౌకిక, అపార లౌకిక విధానం అటు మోక్షం ఇస్తూ, ఇటు ధర్మ పాలనను సూచిస్తుంది. ఆయన వద్ద ఉండే గోవు జీవనాధారానికి ప్రతీక అయితే, వేణువు ప్రాణశక్తికి ప్రతీక. నెమలి పింఛం అమలిన ప్రేమతత్వానికి నిదర్శనం. భగవద్గీతను నేడు విదేశాలలో  పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌కు టెక్ట్స్‌బుక్‌లా ఉపయోగిస్తున్నారు.
– విద్వాన్‌ కట్టా నరసింహులు, కన్సెల్టెంట్, పోతన భాగవతం ప్రాజెక్టు, టీటీడీ
 
విజయతత్వానికి ప్రతీక
    శ్రీకృష్ణుని పాత్ర విజయతత్వానికి ప్రతీకగా నిలుస్తుంది. పుట్టుక నుంచి ఆ పాత్రకు భారత, భాగవతాలలో ఎదురు లేదన్నట్లుగా కనిపిస్తుంది. బాల్యం నుంచే దుష్టశిక్షణ ప్రారంభించిన ఆయన అటు మానవ ధర్మాచరణ విధిని చూపుతూ, ఇటు మోక్ష మార్గానికి ద్వారంలా నిలుస్తారు. భారత, భాగవతాలలో ప్రతి సంఘటన కృష్ణుడి విజయాలనే చూపుతోంది.
– పుత్తా పుల్లారెడ్డి, ఇంజనీరు (పురాణ పరిశోధకులు), కడప
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement