రాయలసీమలో కరువు తీతువు | desert area rayalaseema | Sakshi
Sakshi News home page

రాయలసీమలో కరువు తీతువు

Aug 25 2016 12:11 AM | Updated on Oct 1 2018 2:44 PM

ఎండిపోతున్న వేరుశనగ పంట - Sakshi

ఎండిపోతున్న వేరుశనగ పంట

తరాలు మారినా వేరుశనగ రైతుల తలరాత మారలేదు. పాలకులు మారినా అన్నదాతల కష్టాల తీరు చెదరలేదు. రాయలేలిన సీమలో రతనాలు రాసిగాపోసి అమ్మారన్న గతం ఎంత గొప్పగా ఉన్నా రైతులు మాత్రం అప్పటి నుంచి ఇప్పటి వరకు కరువు రక్కసితో పోరాడుతూనే ఉన్నారు.

సాక్షి, చిత్తూరు:
తరాలు మారినా వేరుశనగ రైతుల తలరాత మారలేదు. పాలకులు మారినా అన్నదాతల కష్టాల తీరు చెదరలేదు. రాయలేలిన సీమలో రతనాలు రాసిగాపోసి అమ్మారన్న గతం ఎంత గొప్పగా ఉన్నా రైతులు మాత్రం అప్పటి నుంచి ఇప్పటి వరకు కరువు రక్కసితో పోరాడుతూనే ఉన్నారు. ఓటమి చెవి చూస్తూనే ఉన్నారు. జాలి లేని మేఘాలు రాయలసీమ రైతులపై కన్నీటి చుక్కనైనా రాల్చడం లేదు. ఆకాశ గంగ సహకరించక, పాతాలగంగ నోటికందక  వందల సంవత్సరాల నుంచి రాయలసీమ కరువు రక్కసికి పుట్టినిల్లుగా మారింది. దీంతో రతనాలు రాళ్లయ్యాయి. బువ్వ పెట్టే అన్నదాత అప్పుల పాలవుతున్నాడు. మడక పట్టాల్సిన రైతు వలసపోతున్నాడు. పాడిపంటల సౌభాగ్యంతో జాతికి భిక్ష పెట్టాల్సిన రైతు కరువు కాటకాల బారీన పడి తనువు చాలిస్తున్నాడు. 
 రాయలసీమ రైతుపై ప్రతి సంవత్సరం కరువు పంజా విసురుతుండటంతో విలవిల్లాడుతున్నాడు. తొలకరి పలకరించగానే పులకించి విత్తు వేసే అన్నదాతకు ప్రతి ఏడాదీ నిరాశే ఎదురవుతోంది. అందుకు ఈ ఏడాదీ మినహాయింపేం కాదు. ఖరీఫ్‌కు ముందే చినుకులు కరువడంతో సాధారణం కంటే ఎక్కువే సాగయ్యింది. విత్తు తరువాత రుతుపవనాలు ముఖం చాటేయడంతో అన్నదాత కన్నీటి పర్యంతం అవుతున్నాడు. సీమ ఒడిలో కరువు తీతువు కూస్తుండటంతో కనుకు లేకుండా గడుపుతున్నాడు. ఈ నెల సాధారణం కంటే అతి తక్కువ వర్షపాతం నమోదవడంతో వేరుశనగ ఎండుముఖం పట్టింది. దీంతో రైతు దిగాలు పడుతున్నాడు. వరణుడు కరుణించేంత వరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని ప్రభుత్వం చెబుతున్నా.. అది నోటి మాటగానే మిగిలింది. దీంతో రాయలసీమలో సాగైన పంటలో సుమారు 60 శాతం వరకు ఎండిపోయింది. ఇంకో వారం రోజులు వర్షం కురవకపోతే పూర్తి పంట దెబ్బతినే అవకాశం ఉంది. 
వరణుడి దెబ్బతో రైతుకు వడదెబ్బ..
వరణుడు కరుణించకపోవడంతో రైతు దిక్కు తోచని పరిస్థితిలో చిక్కుకున్నాడు. సాధారణ వర్షపాతం కంటే 12 రెట్ల వర్షపాతం తక్కువ కురువడంతో అన్నదాతకు కనుకు కరువైంది. రాయలసీమలో సాధారణ వర్షపాతం 120 మిల్లీమీటర్లు కురవాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం 10 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. చిత్తూరు జిల్లాలో ఆగస్టులో 100 మిల్లీ మీటర్లు కురవాల్సి ఉండగా 4.5, కడపలో 86 మిల్లీమీటర్లు కురవాల్సి ఉండగా 2.9, అనంతపురంలో 65మి.మీగాను 4.5, కర్నూలులో 98 మి.మీకు గాను 20.2 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. జూన్‌లో వేసిన పంటలు మెత్తం, జులైలో వేసిన విత్తు సగం వరకు ఎండిపోయింది. 
రూ.1,210 కోట్ల పెట్టుబడి మట్టిలో..
ఈ సంవత్సరం రాయలసీమలో సుమారు 11లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగు చేశారు. సాగైన హెక్టార్లలో సుమారు 60 శాతం పంట దెబ్బతినడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎకరాకు సుమారు రూ.11 వేల పెట్టుబడి అవుతుంది. ఈ లెక్కన 1,210 కోట్ల పెట్టుబడి మట్టిలో పోసినట్లయింది. 
కంటితుడుపుగా పెట్టుబడి రాయితీ...
2011 నుంచి 2015 వరకు వర్షాభావంతో పంట దెబ్బతిని రైతులు నష్టపోయారు. పెట్టుబడిపై రాయితీలు ఇవ్వాల్సిన ప్రభుత్వం మాత్రం కంటితుడుపు చర్యలు తీసుకుంటూ రైతులను మరింత కుంగుబాటుకు లోను చేస్తోంది. 2013,2015 పెట్టుబడి రాయితీ కేవలం కాగితాలకే పరిమితం అయింది. ఏళ్లు గడుస్తున్నా పెట్టుబడి రాయితీ గురించి పట్టించుకునే నాథుడే లేడు. దీనికి తోడు వేరుశనగ బీమా కూడా రైతులకు దీమా ఇవ్వడం లేదు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement