కాలిఫోర్నియాలో ఘనంగా 'పాటకి పట్టాభిషేకం' | TAGS's pataki paattabishekam grand success in california | Sakshi
Sakshi News home page

కాలిఫోర్నియాలో ఘనంగా 'పాటకి పట్టాభిషేకం'

Jun 14 2017 4:45 PM | Updated on Sep 5 2017 1:37 PM

కాలిఫోర్నియాలో ఘనంగా 'పాటకి పట్టాభిషేకం'

కాలిఫోర్నియాలో ఘనంగా 'పాటకి పట్టాభిషేకం'

కాలిఫోర్నియాలో శాక్రమెంటో తెలుగు సంఘం (టాగ్స్), వేగేశ్న ఫౌండేషన్ హైదరాబాద్ల సౌజన్యంతో నిర్వహించిన 'పాటకి పట్టాభిషేకం' కార్యక్రమం ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది.

కాలిఫోర్నియా :
కాలిఫోర్నియాలో శాక్రమెంటో తెలుగు సంఘం (టాగ్స్), వేగేశ్న ఫౌండేషన్ హైదరాబాద్ల సౌజన్యంతో నిర్వహించిన 'పాటకి పట్టాభిషేకం' కార్యక్రమం ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది. స్థానిక ఫోల్సోంలోని ఫాల్సం హై స్కూల్ థియేటర్లో పాటకి పట్టాభిషేకం కార్యక్రమం జరిగింది. రామకృష్ణ యనమండ్ర, లలిత నేమన పాడిన ఘంటసాల, బాలు సినీ మధుర గీతాలతో  ప్రాంగణంలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. పలువురు స్థానిక కళాకారులు పాడిన మధురగీతాలతో ప్రాంగణం పరవశమైపోయింది.

కదలి రండి, కలసి రండి, ఘంటసాల, బాలు సినీ మధుర గీతాలతో పాటకి పట్టాభిషేకం జరుపుకొందాము అని టాగ్స్ ఇచ్చిన పిలుపుకు స్పందించిన స్థానిక తెలుగు కుటుంబాలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. మూర్తిదేవి అవార్డు గ్రహీత, పద్మ శ్రీ ప్రొఫెసర్ కొలకలూరి ఇనాక్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి చక్కని ప్రదర్శన చేసిన రామకృష్ణ యనమండ్ర, లలిత నేమన తో పాటు స్థానిక కళాకారులను అభినందించారు. వేగేశ్న ఫౌండేషన్ వంశీ రామరాజుతో తన 40 ఏళ్ల అనుబంధాన్ని ఆహుతులకు ఆయన వివరించారు. దివ్యాంగులు, అనాథలకు వేగేశ్న ఫౌండేషన్ ద్వారా వంశీ రామరాజు చేస్తున్న సేవలను వివరించడమే కాకుండా, ఇటువంటి సేవా కార్యక్రమాలకు సహాయపడడం ద్వారా శాక్రమెంటో స్థానిక తెలుగు కుటుంబాలు మరింత ఉన్నత స్థాయికి చేరతాయని చెప్పారు. టాగ్స్ కార్యవర్గం సభ్యులు, ప్రొఫెసర్ కొలకలూరి ఇనాక్కి జ్ఞాపికను అందజేసి ఘనంగా సన్మానించారు.


హైదరాబాద్లో తమ ఆశ్రమంలో స్వర్గీయ ఘంటసాలకి గుడి కట్టించామని వేగేశ్న ఫౌండేషన్ వంశీ రామరాజు తెలిపారు. ఈ 'పాటకి పట్టాభిషేకం' కార్యక్రమం ద్వారా వేగేశ్న ఫౌండేషన్ కార్యక్రమాలను శాక్రమెంటో స్థానిక తెలుగు కుటుంబాలవారికి తెలియజేయడం ఆనందకరంగా ఉందని చెప్పారు. 'పాటకి పట్టాభిషేకం' బృందం  అమెరికాలో పర్యటించడానికి సహాయ సహకారాలు అందజేసిన తెలంగాణ సీఎం కేసీఆర్ కి, తెలంగాణా టూరిజం శాఖకు వంశీ రామరాజు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రెండు నెలల పాటు అమెరికాలో పర్యటిస్తూ  పలు పట్టణాలతో పాటు  శాక్రమెంటోలో 'పాటకి పట్టాభిషేకం' జరుపుకోవడం ఆనందగా ఉంది అని ఆయన చెప్పారు. శాక్రమెంటో తెలుగు సంఘం కార్యవర్గ సభ్యులు వంశీ రామరాజును ఘనంగా సన్మానించారు.

టాగ్స్ చైర్మన్ వెంకట్ నాగం మాట్లాడుతూ, పద్మ శ్రీ ప్రొఫెసర్ కొలకలూరి ఇనాక్ రెండవసారి శాక్రమెంటో పర్యటనకు రావడం తమ అదృష్టమన్నారు. ఈ సందర్భంగా  జూన్ 17న "ఇనాక్ గారితో మాటా మంతి" ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. ఆ రోజు సాయంత్రం ఆరు గంటలకు స్థానిక రుచి ఇండియన్ రెస్టారెంట్ కు అందరూ విచ్చేసి  ప్రొఫెసర్ కొలకలూరి ఇనాక్ ప్రసంగంతో పాటు, డా సి నారాయణరెడ్డి గారితో వారికి ఉన్న అనుబంధం, వారి  సాహితీ ప్రయాణానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుకోవచ్చునని తెలిపారు.

 
మనోహర్ మందడి, మోహన్ కాట్రగడ్డ, సందీప్ గుడుపెల్లి, శ్రీదేవి మాగంటి, కీర్తి సురం, సురేంద్రనాథ్ కొప్పారపు, శ్రీరామ్ అకిన, మమతా దాసి, నాగేశ్వరరావు దొండపాటి,నాగేంద్రనాథ్ పగడాల, శ్రీనివాస రావు యనపర్తి, ప్రసాద్ కేతిరెడ్డి,  శ్రీధర్ రెడ్డి, అశ్విన్ తిరునాహరి, మల్లిక్ సజ్జనగాండ్ల, స్వర్ణ కంభంపాటి, వాసు కుడుపూడి, సుధాకర్ వట్టి, రాంబాబు బావిరిశెట్టి, అనిల్ మండవ, వెంకట్ నాగం, భాస్కర్ దాచేపల్లి, ప్రసాద్ కేటిరెడ్డి,  డా సంజయ్ యడ్లపల్లిలు కాలిఫోర్నియా శాక్రమెంటోలో కార్యక్రమం విజయవంతం కావడానికి అహర్నిశలు కృషి చేశారు. టాగ్స్ కోశాధికారి సందీప్ గుడుపెల్లి  ఫోటోగ్రఫీ సహకారం అందించారు. ఈ సందర్భం గా టాగ్స్ కార్యనిర్వాహక సభ్యులు,  వికలాంగ, అనాథ బాలబాలికల సహాయార్ధం వేగేశ్న ఫౌండేషన్కు ఆరు వేల డాలర్ల విరాళాన్ని ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement