
ధరలకు రెక్కలు
యావసర వస్తువుల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. తిండి గింజలు కొనేందుకు మార్కెట్కు వెళ్లిన సామాన్యుడికి షాక్ తగులుతోంది.
మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు భగ్గుమంటున్నాయి. సంచి నిండా డబ్బు తీసుకెళ్లి జేబు నిండా సరుకులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. బియ్యం, కందిపప్పు, చింతపండు, కొబ్బెర ఇలా ఏది కొనాలన్నా సామాన్యుడికి చుక్కలు కనిపిస్తున్నాయి. సంపాదన చూస్తే అంతంతే.. ఖర్చులు మాత్రం బోలెడన్ని.. ఏం తినాలో.. ఎలా బతకాలో అర్థంకాక సగటు జీవులు సతమతమవుతున్నారు.
జమ్మలమడుగు రూరల్:నిత్యావసర వస్తువుల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. తిండి గింజలు కొనేందుకు మార్కెట్కు వెళ్లిన సామాన్యుడికి షాక్ తగులుతోంది. నెల క్రితం వరకు ఓ మోస్తరుగా ధరలు ఉండటంతో ప్రజలు తమకు కావాల్సిన నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసి తెచ్చుకునేవారు.
ఇటీవల ఈ వస్తువుల ధరలు అమాంతం పెరగడంతో సామాన్యుడిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీనికితోడు వ్యాపారులు కూడా నిత్యావసర వస్తువులకు కృత్రిమ కొరత సృష్టించి ధరలను పెంచి వ్యాపారం చేస్తున్నారు.
భారమవుతున్న జీవితాలు
సగటు మనిషి కష్టపడి పనిచేస్తే నెలకు నాలుగు వేల నుంచి ఆరువేల రూపాయల వరకు సంపాదిస్తున్నాడు. ఈ సంపాదనతోనే కుటుంబాన్ని పోషించుకుంటూ వస్తున్నాడు. సొంత గూడు ఉన్న వారికైతే ఆరువేల రూపాయల సంపాదన అంతంత మాత్రంగానే సరిపోతుంది. ఇళ్లులేని వారైతే సంపాదనలో కనీసం రెండు వేల ఐదువందల రూపాయలు ఇంటి బాడుగకు వెచ్చించాల్సి వస్తుంది.
కరెంటు, పాలు, డిష్ బిల్లులు కలిపి మరో రూ.700 అవుతుంది. పిల్లల చదువుకు నెల ఫీజు కాకుండా ఆటోకే ఒక్కొక్కరికి రెండువందలకు పైమాటే. వీటికే నెలకు రూ. 3500 వరకు ఖర్చు అవుతుంది. మిగతా నిత్యావసర వస్తువులైన బియ్యం, కందిపప్పు, చింతపండు, కొబ్బెర, నూనె, పప్పుదినుసులు తెచ్చుకోవాలంటే కనీసం రెండువేలకు పైగానే ఖర్చు అవుతుంది. అంతేకాకుండా ప్రతిరోజు కనీసం 50 రూపాయలు ఖర్చుచేస్తేగాని కూరగాయలు దొరికే పరిస్థితి లేదు. కూరగాయలకే నెలకు రూ.1500 ఖర్చు చేయాల్సి వస్తోంది. మొత్తం తాను సంపాదించిన ఆరువేలల్లో తిండికే అంతంతమాత్రంగా సరిపోతోంది. ఇక ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగా లేకుంటే ఆసుపత్రి ఖర్చులకోసం అప్పులు చేయాల్సి వస్తోంది.
పెరిగిన నిత్యావసర వస్తువులు
నెలక్రితం కొత్తగా మార్కెట్లోకి వచ్చిన సోనా బియ్యం బస్తా రూ.1400 పలికింది. అదే బియ్యం ప్రస్తుతం రూ.1850 ధర పలుకుతోంది.పాతబియ్యం రూ.1800నుంచి 2300 అంటే ఏకంగా ఐదు వందల రూపాయలు పెరిగిపోయాయి. అలాగే కిలో 80 రూపాయలు ఉన్న కొబ్బెర ఏకంగా 110లకు పెరిగి ప్రస్తుతం190 రూపాయలకు చేరుకుంది. ఉద్దిపప్పు రూ.50 నుంచి 75,ధనియాలు రూ.80 నుంచి 110, చింతపండు రూ.70నుంచి 100, పెసలు రూ.60నుంచి 80 రూపాయల వరకు ధరలు పెరిగిపోయాయి. రాబోయే రోజుల్లో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం లేకపోలేదని వ్యాపారులు పేర్కొంటున్నారు.
ధరల అదుపునకు చర్యలేవీ..
వ్యాపారులు ఇష్టారాజ్యంగా నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతున్నా అధికారులు ఏమాత్రం పట్టించుకోవడంలేదు. గోదాముల్లో బియ్యం, మండీల్లో నిత్యావసర వస్తువులను నిల్వ ఉంచి కృత్రిమంగా కొరత సృష్టిస్తున్నా అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.