రాకేష్.. శభాష్! | Fellow IIT Children's Village teenager | Sakshi
Sakshi News home page

రాకేష్.. శభాష్!

Dec 12 2013 1:56 AM | Updated on Sep 2 2017 1:29 AM

రాకేష్.. శభాష్!

రాకేష్.. శభాష్!

‘చుట్టూరా ఆవరించుకున్న చీకటిని చూస్తూ కూర్చునే కంటే చిన్న దివ్వెనైనా వెలిగించు’ .. అన్న మాటలే అతనికి స్ఫూర్తి.

=ఈ అనాథ సరస్వతీ పుత్రుడు
 =ఐఐటీ ఫెలోగా చిల్డ్రన్స్ విలేజ్ యువకుడు

 
భీమునిపట్నం, న్యూస్‌లైన్: ‘చుట్టూరా ఆవరించుకున్న చీకటిని చూస్తూ కూర్చునే కంటే చిన్న దివ్వెనైనా వెలిగించు’ .. అన్న మాటలే అతనికి స్ఫూర్తి. విద్యాదీపాన్ని వెలిగించుకుని తన జీవితాన్ని వెలుగులతో నింపుకున్నాడు. అమ్మా నాన్నలను చిన్నతనంలోనే పోగొట్టుకుని నా అన్నవారెవరూ లేని ఓ అనాథ నేడు ఉన్నత విద్యావంతుడై ఎందరికో స్ఫూర్తిదాయకమయ్యాడు.. అప్పటికి  పాలిశెట్టి రాకేష్  వయసు పదేళ్లు.. ముక్కుపచ్చలారని బాల్యం.. ప్రపంచం అంటే ఏమిటో తెలీదు. గాజువాకలో నివాసం ఉండేవారు. కన్నవారు ఉన్నంతలో అల్లారుముద్దుగా చూసుకునేవారు.

అది 1997వ సంవత్సరం దురదృష్టవశాత్తూ అనారోగ్యకారణాలతో తల్లిదండ్రులిద్దరూ మృత్యువాతపడ్డారు. ఒంటరిగా మిగిలిన రాకేష్‌ను చుట్టుపక్కలవారు కొద్దిరోజులు ఆదరంతోనే చూసినా ఎంతో కాలం సాకలేకపోయారు. అనాథ పాలిట కోవెలగా భీమిలిలో అదే సంవత్సరంలో ఆవిర్భవించిన ఎస్‌ఓఎస్ చిల్డ్రన్స్ విలేజ్‌లో చేరిస్తే మేలని స్థానికులు రాకేష్‌ను భీమిలి తీసుకెళ్లి అక్కడ చేర్చారు. సంస్థ నిర్వాహకులు అమ్మానాన్నలను మరిపించేలా ఆ అనాథ బాలుడిని చూసుకునేవారు. పిల్లాడు చదువులో చురుగ్గా ఉండటం చూసి వారు అతణ్ణి ప్రోత్సహించారు.

తను ఒంటరినన్న బాధ మరిచిపోయి ఎస్‌ఓఎస్‌లో సేద తీరుతూ విద్యార్జనపైనే తదేక దృష్టి పెట్టాడు రాకేష్. నీడ నిచ్చిన ‘విలేజ్’ నేర్పిన క్రమశిక్షణ అతని విద్యాదీక్షకు బలం చేకూర్చింది. ఎస్‌ఓఎస్‌లోని మదర్స్, ఎడ్యుకేషన్ కౌన్సిలర్లు, డైరక్టర్లు తొలినాళ్లలో తనకు ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిదని రాకేష్ తరచూ అంటూ ఉంటాడు. చిన్నతనం నుంచి ఎప్పుడూ పాఠ్య పుస్తకాలు చదువుకునే ఆ బాలుణ్ణి దాకమర్రిలోని రఘు కాన్వెంటులో ప్రాథమిక విద్య, హైస్కూలు చదువుకు పంపారు విలేజ్ నిర్వాహకులు. ఉత్తరాఖండ్‌లోని తమ సంస్థ పాఠశాలలో టెన్త్, ఇంటర్ చదివించేందుకు ఎస్‌ఓఎస్ డైరక్టర్ పంపించారు.

ఆ రెండు దశల్లోనూ 90 శాతం ఉత్తమ శ్రేణి మార్కులు సాధించిన రాకేష్ అనంతరం శ్రీకాకుళంలోని ‘సిస్టమ్స్’ బీటెక్ చదివాడు. మంచి ఉద్యోగం సాధించే అవకాశాలు వచ్చినా ఇంకా చదువుకోవాలనే ఆశయంతో విశాఖ వచ్చి గీతం కళాశాలలో ఎంటెక్‌లో చేరి అత్యుత్తమ మార్కులు సాధించాడు. ఈ ప్రతిభ కారణంగా పాట్నాలోని ఐఐటీలో జూనియర్ రిసెర్చ్ ఫెలో(జేఏఎఫ్)గా ఎంపిక కయ్యాడు. పరిశోధన జరిపినంత కాలం నెల కు రూ. 25 వేలు స్కాలర్‌షిప్ ఐఐటీ అం దిస్తుంది. ఒక అనాథ బాలుడిగా ఇక్కడ కు వచ్చిన రాకేష్ ఎంతో కష్టపడి ఇంతటి స్థాయికి చేరుకోవడంతో ఎస్‌ఓఎస్‌లో అందరూ తమ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమ విద్యార్థి ఐఐటీ ఫెలోగా ఎంపికకావటం గర్వకారణంగా ఉందని చిల్డ్రన్స్ విలేజ్ డెరైక్టర్ ఎస్. శ్యాంకుమార్ న్యూస్‌లైన్‌తో అన్నారు.            

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement