అమ్మదర్శనం.. గంటలోపే | Sakshi
Sakshi News home page

అమ్మదర్శనం.. గంటలోపే

Published Tue, Oct 9 2018 1:39 PM

Durga temple EO Koteswaramma Special Interview - Sakshi

దుర్గమ్మ శరన్నవరాత్రి మహోత్సవాలకు సర్వం సిద్ధమైంది. తొమ్మిది రోజులపాటు రోజుకొక అవతారంలో దర్శనమిచ్చే∙అమ్మను చూసి తరించడానికి రాష్ట్రం నలుమూలల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు  తరలివస్తారు. అలా వచ్చే వారందరికీ సులభంగా అమ్మవారి దర్శనం పూర్తి చేసుకుని ఆనందంగా తిరిగి వెళ్లేలా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో దుర్గమ్మ సన్నిధిలో ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎ.కోటేశ్వరమ్మ ‘సాక్షి’కి వివరించారు.

సాక్షి: దసరా ఉత్సవాల్లో అమ్మవారి దర్శన వేళలు ఏమిటి?
ఈవో : మొదటి రోజు స్నపనాభిషేకం అనంతరం ఉదయం 9 గంటలకు భక్తుల దర్శనాలకు అనుమతిస్తాం. మిగిలిన రోజుల్లో తెల్లవారుజామున  3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అమ్మవారి దర్శనం ఉంటుంది. మూలా నక్షత్రం రోజున అర్థ్ధరాత్రి ఒంటి గంట నుంచి రాత్రి 11 గంటల వరకు దర్శనం చేసుకోవచ్చు. సాధారణ పర్వదినాల్లో గంటలోపు, మూల నక్షత్రం రోజున రెండు గంటల్లోనూ అమ్మవారి దర్శనం అయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం.

సాక్షి:ఈ ఏడాది భక్తుల రద్దీ ఏ విధంగా ఉంటుందని అంచనా?
ఈవో : సుమారు 15 లక్షల మంది భక్తులు వస్తారని భావించి అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నాం. మా అంచనాలకు మించే భక్తులు వచ్చే అవకాశం ఉంది.

సాక్షి:దసరా వ్యయంలో పొదుపు చర్యలు      పాటిస్తున్నారు? భక్తులకు ఇబ్బందులు రావా?
ఈవో : గత ఏడాది రూ.15 కోట్లు ఖర్చు అయ్యిం ది. ఈ ఏడాది సుమారుగా రూ.8.3 కోట్లతో అంచనాలు తయారు చేశాం. మహా అయితే మరో 10 శాతం పెరగవచ్చు. అయితే భక్తులు సౌకర్యాల్లో గత ఏడాది కంటే ఏమాత్రం తగ్గవు. వారికి కావా ల్సిన సౌకర్యాలన్నీ కల్పిస్తాం.

సాక్షి: భక్తులకు దర్శనం కోసం ఏ మార్గంలో వెళ్లాలి?
ఈవో : భక్తుల్ని వినాయకుడు గుడి నుంచి రెండు క్యూలలో అనుమతిస్తాం. కొండపైన ఓం టర్నింగ్‌ నుంచి ఐదులైన్లు ఏర్పాటు చేస్తున్నాం. వినాయకుడు గుడి నుంచి క్యూలైన్లోకి వచ్చి దర్శనం అనంతరం మల్లికార్జున మహామండపం ద్వారా,  శివా లయం వద్ద రాయబార మండపం మెట్లమార్గం ద్వారా క్రిందకు వెళ్లే ఏర్పాటు చేస్తున్నాం.

సాక్షి: అమ్మవారి దర్శనం టిక్కెట్లు ఎంత?
ఈవో : గత ఏడాది తరహాలోనే రేట్లు ఉన్నాయి. రేట్లు పెంచలేదు. అంతరాలయ దర్శనానికి రూ.300. ముఖమండప దర్శనానికి రూ.100 రేట్లు ఉంటాయి. ఇవే కాకుండా సర్వదర్శనం క్యూౖ లెన్లు ఉంటాయి. మూలనక్షత్రం రోజు విజయదశమి రోజున  టిక్కెట్లు ఉండవు. అందరూ ఉచిత దర్శనమే చేసుకోవచ్చు.

సాక్షి: ప్రత్యేక పూజల వివరాలు చెప్పగలరు?
ఈవో : ప్రత్యేక  కుంకుమార్చన మల్లికార్జున మహా మండపం 6వ అంతస్తులో జరుగుతాయి.  రుసుం రూ.3,000. ఉదయం 7గంటల నుంచి 9 గంటల వరకు, 10 గంటల నుంచి 12 గంటల వరకు రెండు బ్యాచ్‌లు ఉంటాయి. విశేష చండీ హోమం రుసుము రూ.4000.ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది.  మూల నక్షత్రం రోజు రుసుము రూ.5000. మూడు బ్యాచ్‌లు ఉంటాయి. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు, 10 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3 గంటల వరకు బ్యాచ్‌లు ఉంటాయి.

సాక్షి: లడ్డూ, పులిహోర ప్రసాదాలు అందక చివర్లో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది అదే పరిస్థితి తప్పదా?
ఈవో : ఈ ఏడాది 40 లక్షలు లడ్డూలు, 20 వేల కేజీల పులిహోర  ప్రసాదాలు తయారు చేయిస్తున్నాం.  భక్తులకు కావాల్సి న ప్రసాదాలు అందుబాటులో ఉంటాయి. ఇవి కాకుండా క్యూౖ లెన్లో వచ్చే భక్తులకు జల, క్షీర, కదంబ ప్రసాదాలను ఉచితంగా పంపిణీ చేయాలని భావిస్తున్నాం. ఇంద్రకీలాద్రి పై మూడు చోట్ల ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ఉచి తంగా అప్పం ప్రసాదం పం పిణీ చేస్తాం.  కనకదుర్గానగర్‌లో ప్రసాదాల కౌంటర్లు ఉంటాయి.

సాక్షి: అన్నప్రసాదం ఎంతమందికి ఉంటుంది?
ఈవో : అర్జున వీధిలోని అన్నప్రసాద భవనంలోనే అన్నదానం జరుగుతోంది. ప్రతిరోజు 20 వేల మందికి, మూల నక్షత్రం రోజు 40 వేల మందికి అన్నదానం జరుగుతుంది. ఎక్కువ మందికి భోజనాలు పెట్టేందుకు అవసరమైతే బఫే పద్ధతిని ప్రవేశపెడతాం. ఉచిత కదంబం ప్రసాదం ఉంటుంది.

సాక్షి:భక్తులు రాత్రి పూట బస చేయాలంటే ఇబ్బందిగా ఉందా?
ఈవో : కాటేజీలు లేకపోవడం  ఇబ్బందే. అయితే మల్లికార్జున మహామండపంలో నిద్రించవచ్చు. కాగా పేద, మధ్య తరగతి భక్తుల కోసం సీవీ రెడ్డి చారిటీస్‌లో కాటేజ్‌లు ఉన్నాయి. వాటిని వినియోగించుకోవచ్చు.

సాక్షి:అదనపు సిబ్బంది సేవలు వినియోగించుకుంటున్నారా?
ఈవో : ఇతర దేవాలయాల నుంచి 167 మం ది సిబ్బంది ఇప్పటికే వచ్చారు. వీరు కాకుండా 4,600 మం ది పోలీసులు అందుబాటులో ఉంటారు.  భక్తులకు తక్షణ సహాయం అందచేసేందుకు వెయ్యి మంది ఎన్‌సీసీ,, ఎన్‌ఎస్‌ఎస్‌   వాలంటీర్లను సిద్ధః చేశాం. అత్యవసర పరిస్థితుల్లో భక్తులు క్యూ మార్గం లోంచి బయటకు వచ్చేందుకు ప్రతి ఐదు మీట ర్లకు ఒక అత్యవసర ద్వారం ఏర్పాటు చేస్తున్నాం.  «రథం సెంటర్, మున్సిపల్‌ ఆఫీసుల వద్ద చెప్పులను, సామాన్లును భద్రపరుచుకునే కౌంటర్లు ఏర్పాటు చేశాం. భక్తుల సౌకర్యార్ధం ఘాట్‌రోడ్డులోనూ, కనకదుర్గానగర్‌ తదితర 15 ప్రదేశాల్లో ప్రధమ చికిత్సా కేంద్రాలు, అంబులెన్స్‌లు ఏర్పాటు చేశాం.

సాక్షి:భక్తులు తలనీలాలు ఎక్కడ సమర్పించుకోవాలి?
ఈవో : సీతమ్మవారి పాదాలు వద్ద కేశఖండన శాల ఏర్పాటు చేస్తున్నాం. దేవస్థానానికి చెందిన 200 మంది నాయీ బ్రాహ్మణులు అందుబాటులో ఉంటారు. జల్లు స్నానాలు చేయవచ్చు.  సీతమ్మవారి పాదాలు వద్ద 30, పద్మావతి ఘాట్‌ వద్ద 30, దోబిఘాట్‌ వద్ద 10 తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేశాం.

సాక్షి:నగరోత్సవం, తెప్పోత్సవం ఎప్పుడు    నిర్వహిస్తారు?
ఈవో : దసరా ఉత్సవాల్లో ప్రతి రోజు సాయంత్రం 4 గంటలకు నగరోత్సవం శివాలయం మెట్ల మార్గం నుంచి ప్రారంభం అవుతుంది. ఈ నగరోత్సవం అర్జున వీధి, రథం సెంటర్, వినాయకుడు గుడి, మరలా రథం సెంటర్‌ టోల్‌గేట్‌ మార్గం ద్వారా కొండపైకి వెళ్తుంది. నగరోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా బ్రహ్మరథం, బేతాళనృత్యాలు, తాళభజన్లు, సంకీర్తణలు, కోలాట బృందాలు, నృత్య బృందాలు, వేద విద్యార్థులుతో పాటు అనేక బృందాలు పనిచేస్తాయి. చండీశ్వరుడు చిన్న పల్లకి, తిరుచ్చి, స్వామి వారు, అమ్మవారు పల్లకి, ఘాటాటోపం కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. విజయదశమి రోజు దుర్గాఘాట్‌లో దుర్గమల్లేశ్వరుల తెప్పోత్సవం అంగరంగవైభవంగా నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నాం. పున్నమి ఘాట్, దుర్గాఘాట్‌ల నుంచి భక్తులు అమ్మవారి నదీ విహారం తిలకించి పునీతులవ్వచ్చు.

సాక్షి:పాలకమండలి సభ్యుల సేవలు ఏ విధంగా ఉంటాయి?
ఈవో : ఉత్సవాల్లో పాలకమంది సభ్యులు, సిబ్బంది కలిసి మెలసి ముందుకు వెళ్తున్నారు.  భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో వారి అమూల్యమైన సలహాలు ఇస్తున్నారు. పండుగ రోజుల్లో వారు భక్తులకు అందుబాటులోనే ఉంటారు.

అందరి సహకారంతో...
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో నిర్వహించే దసరా మహోత్సవాలను అందరి సహాకారంతో విజయవంతంగా నిర్వహిస్తామని ఈవో వీ. కోటేశ్వరమ్మ అన్నారు. సోమవారం మహా మండపం ఆరో అంతస్తులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉత్సవాల ఏర్పాట్ల గురించి వివరించారు.  దసరా ఉత్సవాల విజయవంతం చేయడంలో మీడియా సహకారం కూడా అవసరమని, గతంలో అనేక ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించడంలో మీడియా సహకారం ఎంతో ఉందన్నారు.

Advertisement
Advertisement