సమస్యల పరిష్కారమే లక్ష్యం

Deputy CM narayana Swamy Speech In Chittoor - Sakshi

సమావేశానికి గైర్హాజరైన అధికారులపై మంత్రి ఆగ్రహం  

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి 

సాక్షి, చిత్తూరు: దళితుల సమస్యలను మానవతా దృక్పథంతో పరిష్కరించాలని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి సూచించారు. శుక్రవారం స్థానిక జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో చిత్తూరు డివిజన్‌ విజి లెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. జాయింట్‌ కలెక్టర్‌ మార్కండేయులు, చిత్తూరు ఆర్డీవో రేణుక సమావేశానికి అధ్యక్షత వహించారు. నారాయణస్వామి మాట్లాడుతూ నియోజకవర్గ స్థాయిలో విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశాలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రజాప్రతినిధులను తప్పనిసరిగా ఆహ్వానించాలన్నారు. వీటి ద్వారా సమస్యలను అప్పటికప్పుడే పరిష్కరించవచ్చని చెప్పారు. అక్కడ పరిష్కారం కాని సమస్యలు డివిజన్, జిల్లా స్థాయిల్లో జరిగే సమావేశాల్లో పరిష్కరించే అవకాశం ఉంటుందన్నారు.

ముఖ్యమంత్రి   వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల సంక్షేమంతోపాటు అన్ని వర్గాలకు లబ్ధి కలిగేలా నవరత్నాలను అమలు చేస్తున్నారని చెప్పారు. ఎస్సీ, ఎస్టీల భూ సమస్యలు పరిష్కరించేందుకు రెవెన్యూ అధికారులు చొరవ చూపాల్సిన అవసరముందన్నారు. అర్హులైన లబ్ధిదారులందరికీ ఉగాది రోజున ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లోనే కాకుండా అన్ని చోట్ల శ్మశాన వాటికల ఏర్పాట్లకు అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. డివిజన్‌ స్థాయిలో నిర్వహించిన విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశానికి పలు శాఖల అధికారులు హాజరుకాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ను ఆదేశించారు.  
మండల స్థాయిలో తహసీల్దార్లు 
జాయింట్‌ కలెక్టర్‌ మార్కండేయులు మాట్లాడుతూ మండల, నియోజకవర్గాల స్థాయిల్లో తప్పనిసరిగా విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశాలు నిర్వహించేలా తహసీల్దార్లు చర్యలు చేపట్టాలన్నారు. అధికారులందరూ తప్పనిసరిగా సమావేశాలకు హాజరుకావాలని ఆదేశించారు. శ్మశానవాటికల ఏర్పాటుకు ప్రభుత్వ భూమి లేని చోట ప్రైవేటు భూమిని కొనుగోలు చేయాలని చెప్పారు. అందుకు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులను మంజూరు చేస్తామన్నారు. అనంతరం పలువురు దళిత సంఘాల నాయకులు ఉపముఖ్యమంత్రికి వినతులు అందజేశారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top