
●అవే పనులను కొనసాగిస్తున్న టీడీపీ నేతలు
సాక్షి ప్రతినిధి, కడప : ప్రభుత్వ పెద్దలు కక్ష రాజకీయాలకు తెరతీశారు. ముఖ్యంగా పులివెందుల కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా వేధిస్తున్నారు. ‘డబ్బులు వెచ్చించి కాంట్రాక్టు పనులు పూర్తి చేశాం.. బిల్లులు చెల్లించాలని..’ ఏడాదిగా అడిగి..అడిగి అలసిపోయిన కాంట్రాక్టర్లు ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ఆ కేసులు జడ్జిమెంట్ దశకు చేరకున్నాయి. ఈ దశలో ఇంకొంత కాలం బిల్లుల చెల్లింపులో జాప్యం చేయడానికి ప్రభుత్వం మరో కొత్త ఎత్తుగడ వేసింది. టెండర్ వ్యాల్యూయేషన్ ఫర్ విజిలెన్సు అంటూ మరోమారు విచారణకు ఆదేశించింది.
పులివెందులలోని పాడా పరిధిలో పనులు చేసిన కాంట్రాక్టర్లను సీఎం చంద్రబాబు సర్కార్ వేధిస్తోంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కాంట్రాక్టర్లను మానసికంగా, ఆర్థికంగా ఉద్దేశ్యపూర్వకంగా వేధింపు చర్యలు తెరపైకి వస్తున్నాయి. పూర్తి చేసిన పనులకు బడ్జెట్ కేటాయించకుండా, ీసీఎఫ్ఎంఎస్లో ఉన్నటువంటి బిల్లులను క్లియర్ చేయకుండా ప్రభుత్వ పెద్దలు వేధిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పులివెందులలో పనులు చేసిన కాంట్రాక్టర్లు హైకోర్టును ఆశ్రయించారు. త్వరలో జడ్జిమెంటు ఉంటుందనుకున్న దశలో ప్రభుత్వం చేసిన పనులపై తొలుత విజిలెన్స్ ఫర్ క్వాలిటీకి ఆదేశించింది. విజిలెన్స్ అధికారులు తీసుకున్న కోర్ శ్యాంపిల్స్ను (సహజంగా జిల్లా కేంద్రాల్లోని ల్యాబ్లో పరీక్ష చేయాలి, కానీ కూటమి ప్రభుత్వం ఒత్తిడి వల్ల) విజయవాడకు తీసుకెళ్లి పరీక్ష చేయించారు. అన్ని శ్యాంపిల్స్ (98 శాతం మెరిట్) పాస్ అయ్యాయి. నివేదికలు హైకోర్టుకు చేరితే ఇక బిల్లుల చెల్లింపులే తరువాయి అనుకున్న తరుణంలో జాప్యం కోసం కూటమి ప్రభుత్వం మరో కొత్త ఎత్తుగడ ఎంచుకుంది.
విజిలెన్సు ఫర్ టెండర్ వ్యాల్యూయేషన్
భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పూర్తి అయిన పనులకు టెండర్ వ్యాల్యూయేషన్పై విజిలెన్సు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. సహజంగా టెండర్ వ్యాల్యూయేషన్ కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేసిన తర్వాత ఎల్–1 ప్రకటించకముందే చేపట్టాలి. ఆయా ఇంజినీరింగ్ అధికారులు ఈ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత ఎల్–1, ఎల్–2 ప్రకటిస్తారు. ఆ తర్వాత కాంట్రాక్టర్లతో అగ్రిమెంటు చేయించి పనులు కొనసాగిస్తారు. అగ్రిమెంటు విధి విధానాల ప్రకారం సంబంఽధిత పనిని పూర్తి చేసిన తర్వాత క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికేట్ జత చేసి ఆ పనికి బిల్లు చెల్లించాల్సిందిగా ఆర్థికశాఖకు పంపనున్నారు. ఈ మొత్తం ప్రక్రియ పూర్తి అయ్యాక కూడా రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర ప్రభుత్వం నెలల తరబడి బిల్లులు చెల్లించకుండా వేధిస్తోందని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టులో కేసులు జడ్జిమెంటు దశకు చేరుకున్న తరుణంలో అడ్డుకునే ప్రక్రియను చేపడుతున్నారని వారు వాపోతున్నారు.
పులివెందుల కాంట్రాక్టర్లపై
పగబట్టిన ప్రభుత్వ పెద్దలు
బిల్లుల కోసం కోర్టును ఆశ్రయించిన కాంట్రాక్టర్లు
విచారణల పేరిట కోర్టు ఉత్తర్వులు
వెలువడకుండా అడ్డుకుంటున్న వైనం
పులివెందుల పరిధిలో ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, ఇరిగేషన్శాఖల పరిధిలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులు కొన్ని పెండింగ్లో ఉన్నాయి. ఆ పెండింగ్ పనులను ప్రస్తుతం తెలుగుతమ్ముళ్లు చేపడుతున్నారు. ఓవైపు బిల్లుల చెల్లింపునకు జాప్యం చేస్తూనే, టెండర్ వ్యాల్యూయేషన్ ఫర్ విజిలెన్సు, క్వాలిటీ ఫర్ విజిలెన్సు అంటూ ముప్పుతిప్పలు పెడుతున్న ప్రభుత్వ పెద్దలు అవే పెండింగ్ పనులను కొనసాగించడం గమనార్హం. తెలుగుతమ్ముళ్లు ఆయా పెండింగ్ పనులు చేపడుతున్నారు. నాడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం కులం, మతం, ప్రాంతం చూడకుండా.. రాజకీయ పార్టీలతో నిమిత్తం లేకుండా అర్హులందరీకి సంక్షేమ పథకాలు అందించింది. అంతెందుకు చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గ ప్రయోజనాలకు సైతం ఎలాంటి ఆటంకాలు లేకుండా నిధులు కేటాయించింది. కాగా కూటమి సర్కార్ పులివెందులలో చేసిన పనులకు బిల్లులు చెల్లించకుండా కాంట్రాక్టర్లను వేధిస్తుండటం, హైకోర్టు ఉత్తర్వులు సైతం జాప్యం అయ్యేలా అడ్డుకుంటూ మైండ్గేమ్ ఆడుతోందని విశ్లేషకులు వివరిస్తున్నారు.

●అవే పనులను కొనసాగిస్తున్న టీడీపీ నేతలు

●అవే పనులను కొనసాగిస్తున్న టీడీపీ నేతలు