
వెబ్ కౌన్సెలింగ్ రద్దు చేయకపోతే ఉద్యమమే
కడప ఎడ్యుకేషన్ : ఎస్జీటీలకు వెబ్ కౌన్సెలింగ్ విధానంలో బదిలీలు నిర్వహించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కు తీసుకునే వరకు ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని ఐక్య వేదిక నాయకులు సంగమేశ్వరరెడ్డి, శివారెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వ పెద్దలు మాటిచ్చారు.. మాట నిలుపుకోండంటూ శనివారం కడప డీఈఓ కార్యాలయం ఎదట ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్జీటీలకు మాన్యువల్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో ప్రభుత్వం చెప్పిందన్నారు. మరి ఇప్పుడు వెబ్ కౌన్సెలింగ్ అంటున్నారు ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటికే తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్న ఉపాధ్యాయులు వెబ్ కౌన్సెలింగ్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఎస్జీటీలకు మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని కోరుతూ ఈనెల 8 వ తేదీన కడప డీఈఓ కార్యాలయ ముట్టడి చేయనున్నామని తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎస్టీయూ, పీఆర్టీయూ, యూటీఎఫ్, ఏపీటీఎఫ్–257, ఏపీటీఎఫ్ 1938, ఆపస్, వైఎస్సార్టీఎఫ్, ఎస్టీఎఫ్, పీఈటీ అసోసియేషన్, ఎస్ఆర్టీఎఫ్, ఎన్టీఏ, ఎస్సీ, ఎస్టీ సంఘం తదితర సంఘాల నేతలు పాల్గొన్నారు.
కదం తొక్కిన ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక