టీడీపీని వీడిన సుగవాసి | - | Sakshi
Sakshi News home page

టీడీపీని వీడిన సుగవాసి

Jun 8 2025 12:38 AM | Updated on Jun 8 2025 12:38 AM

టీడీప

టీడీపీని వీడిన సుగవాసి

సాక్షి ప్రతినిధి, కడప : తెలుగుదేశం పార్టీ బలిజ సామాజిక వర్గ నేతలను వ్యూహాత్మకంగా దూరం పెడుతోందా.. ఎన్నికల్లో వాడుకొని ఆపై ప్రాధాన్యత లేకుండా చేస్తోందా అంటే ఔను అనే విశ్లేషకులు జవాబిస్తున్నారు. ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య, మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్‌రాయుడు, సుగవాసి బాలసుబ్రమణ్యంలకు కరివేపాకు సామెతను వర్తింపజేశారు. యూజ్‌ అండ్‌ త్రో పాలసీ అమలు చేశారు. ఎన్నికల్లో వాడుకుని ఆపై ఏమీ పట్టనట్లు వదిలేశారు. ఉమ్మడి వైఎస్సార్‌ జిల్లాలో బలిజ సామాజిక వర్గ నేతలను క్రమేపీ దూరం చేశారు. ఆలోచనలు, వ్యూహం, ఎత్తుగడలు మీవే, ఆచరణలో మాత్రమే మేముంటామని చెప్పుకొచ్చి ఎన్నికల్లో వాడుకున్నారు. అధికారంలోకి వచ్చాక ప్రాధాన్యత లేకుండా చేశారు. వెరసి టీడీపీతో ఉన్న 40 ఏళ్ల అనుబంధాన్ని దివంగత మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండ్రాయుడు కుమారుడు బాల సుబ్రహ్మణ్యం తెంచుకు న్నారు. ఆయన శనివారం టీడీపీకి రాజీనామా చేశారు. ఈ అంశం ఉమ్మడి జిల్లాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది.

నాడు చక్రం తిప్పి..

జిల్లాలో బలిజ సామాజికవర్గాన్ని తెలుగుదేశం పార్టీ క్రమేపీ దూరం పెడుతోంది. ఒకప్పుడు చక్రం తిప్పిన నేతలంతా కనుమరుగయ్యారు. మేధస్సు, సామాజిక బలంతో ఎమ్మెల్సీ రామచంద్రయ్యకు ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ కండువా కప్పారు. ఎన్నికల్లో కోరి రామచంద్రయ్యను రప్పించుకున్నారు. ఎన్నికల తర్వాత విస్మరిస్తూ వచ్చారు. అధికారిక కార్యక్రమాల్లో ఎందులోనూ రామచంద్రయ్యకు ప్రాధాన్యత లభించలేదు. జిల్లాలో కూడా అదే పరిస్థితి. ఎమ్మెల్యే మాధవీరెడ్డి పూర్తిగా విస్మరించారనే ఆరోపణలున్నాయి. ఉనికి కోసం అన్నట్లుగా ఎమ్మెల్సీ రామచంద్రయ్య అప్పుడప్పుడు కన్పించడం ఆరంభించారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.

మనస్తాపం చెందిన సుగవాసి కుటుంబం

తెలుగుదేశం పార్టీ వైఖరిపై సుగవాసి బాలసుబ్రహ్మణ్యం మనస్తాపం చెందారు. సీఎం చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి సహచరుడిగా మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండ్రాయుడు ఉన్నారు. మునుపటి కాలంలో రాయచోటి ఎన్నికలంటే ప్రత్యక్ష యుద్ధం తెరపైకి వచ్చేది. 1978, 83, 99, 2004లో రాయచోటి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1984–89 కాలంలో రాజంపేట ఎంపీగా పని చేశారు. అలాంటి రాజకీయ చరిత్ర ఉన్న పాలకొండ్రాయుడు అనారోగ్యంతో మృతి చెందితే.. ఆయన కుటుంబ పరామర్శకు రాలేదు. జిల్లాలో మహానాడు చేపట్టినా ఆ కుటుంబం వరకూ పోయి వద్దామనే ఆలోచన లేకపోయింది. మరోవైపు రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా సుగవాసి బాలసుబ్రమణ్యం పోటీ చేసి ఓడిపోతే, కనీసం ఇన్‌చార్జిగా కూడా కేటాయించలేదు. అటు అధిష్టానం వద్ద ఇటు స్థానికంగా మర్యాద లేకుండా పోయింది. పొమ్మనకుండా పొగబెట్టడంతో టీడీపీతో ఉన్న 40 ఏళ్ల అనుబంధాన్ని సుగవాసి బాలసుబ్రహ్మణ్యం తెంచుకోవాల్సి వచ్చిందని పలువురు వివరిస్తున్నారు.

బత్యాల కనుమరుగు..

అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలో అన్నీ తానై నడిపించిన మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్‌రాయుడు ఇటీవల కాలంలో పూర్తిగా కనుమరుగయ్యారు. రైల్వేకోడూరు, రాజంపేట సెగ్మెంట్లలో కాపు సామాజిక వర్గాన్ని అనువుగా మల్చుకునేందుకు ఎన్నికల ముందు బత్యాలకు ప్రాధాన్యత లభించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత చెంగల్‌రాయుడును రాజకీయంగా దెబ్బకొట్టే చర్యలకు టీడీపీ వ్యవహరిస్తూ వస్తోంది. మరోవైపు సుగవాసి బాలసుబ్రమణ్యం రాజంపేట నుంచి తప్పించే క్రమంలో.. బత్యాలకు ప్రాధాన్యత లభించిందా అంటే అదీ లేదు. కాగా, పరిశీలకుడిగా కడపకు చెందిన అదే సామాజిక వర్గానికి చెందిన దుర్గా ప్రసాద్‌రావును నియమించారు. దుర్గా ప్రసాద్‌ మీద ప్రేమతో వేశారంటే తప్పులో కాలేసినట్లేనని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. 2014లో కడప టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన దుర్గాప్రసాద్‌కు తర్వాత ఇన్‌చార్జి పదవి అప్పగించలేదు. టీడీపీ అధికారంలో ఉండగా ఆ పదవి ఆర్‌.శ్రీనివాసులరెడ్డికి అప్పగించారు. బలిజ సామాజిక వర్గనేతల్ని తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా దెబ్బతీస్తున్నట్లు విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.

బలిజ సామాజిక వర్గాన్ని విస్మరిస్తున్న తెలుగుదేశం పార్టీ

ఎమ్మెల్సీ సీఆర్సీ, మాజీ ఎమ్మెల్సీ బత్యాల, సుగవాసి బ్రదర్స్‌కు అప్రాధాన్యత

ఎన్నికల్లో ముందు పెట్టుకొని,ఆపై పక్కన పెట్టిన టీడీపీ నేతలు

ఎన్నో ఏళ్ల అనుబంధాన్ని తెంచుకున్న బాలసుబ్రహ్మణ్యం

పాలకొండ్రాయుడు మృతి తర్వాత పరామర్శ లేకపోవడం

రాజంపేట ఇన్‌చార్జి ఇవ్వకపోవడంతో అవమానంగా భావించిన వైనం

టీడీపీని వీడిన సుగవాసి1
1/1

టీడీపీని వీడిన సుగవాసి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement