
బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్గా రెడ్డి ప్రసాద్
వల్లూరు (చెన్నూరు) : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్గా తనను ఎంపిక చేసినట్లు చెన్నూరుకు చెందిన రెడ్డి ప్రసాద్ తెలిపారు ఈ మేరకు బీజేపీ జిల్లా అధ్యక్షుడి నుంచి ఉత్తర్వులు అందాయన్నారు. తన నియామకానికి సహకరించిన నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
రూ. కోట్ల విలువైన స్థలం ఆక్రమణ
అట్లూరు : అధికార పార్టీ నేతల భూ దాహానికి అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. బద్వేలు మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడ జాగా కనిపిస్తే అక్కడ వాలిపోతున్నారు.
బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని సచివాలయం పక్కనే గుంతపల్లి రెవెన్యూ పొలంలో సర్వే నంబరు 948లో 10.38 ఎకరాలు(పది ఎకరాల 38 సెంట్లు విస్తీర్ణం) ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమి సెంటు సుమారు రూ.10 లక్షల వరకూ విలువ చేస్తుంది. అధికార పార్టీకి చెందిన నియోజకవర్గ ముఖ్య నేత అనుచరుడికి ఆ భూమిపై కన్ను పడింది. ఇంకేముంది అదును కోసం ఎదురు చూశాడు. శనివారం బక్రీద్ పండుగ సెలవు అలాగే ఆదివారం కూడా సెలవు దినం కావడం ఆయనకు కలిసి వచ్చింది. శుక్రవారం రాత్రి నుంచి స్థలంలో సుమారు 50 సెంట్ల మేర అంటే ఐదు కోట్ల రూపాయలు విలువ చేసే మేర స్థలంలో యంత్రాలతో చదును చేయించుకున్నాడు. ఎవరూ అడ్డు లేకపోవడంతో శనివారం ఆ స్థలంలో నిర్మాణం కోసం సామగ్రిని తరలించాడు. ఇంత విలువైన స్థలంలో అక్రమ నిర్మాణాలకు ఏర్పాట్లు జరుగుతున్నా రెవెన్యూ అధికారులు అటు వైపు కన్నెత్తి చూడక పోవడం ప్రజలను విస్మయానికి గురిచేస్తోంది.
హెచ్చరిక బోర్డును లెక్క చేయని వైనం..
గుంతపల్లి రెవెన్యూ పొలంలోని సర్వే నెంబరు 948లో 10.38 ఎకరాలు విస్తీర్ణంలోని ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమిస్తే చర్యలు తప్పవని రెవెన్యూ అధికారులు గతంలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. అయితే ఆ బోర్టు తమకు కాదనుకున్నారేమో బోర్డును సైతం లెక్క చేయకుండా అధికార పార్టీ నేతలు ఆక్రమించడం గమనార్హం.
చర్యలు తీసుకుంటాం..
సర్వే నంబరు 948లో విలువైన ప్రభుత్వ భూమిని టీడీపీ నాయకుడి అనుచరుడు కబ్జాకు పాల్పడిన విషయమై బద్వేలు తహసీల్దార్ ఉదయ్భాస్కర్రాజును వివరణ కోరగా నెల రోజులుగా తాను అందుబాటులో లేనని, నిన్ననే విధుల్లో చేరానని తెలిపారు. ప్రభుత్వ భూమి కబ్బాకు గురైన విషయం తన దృష్టికి వచ్చిందని, బాధ్యులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుంటామని తెలిపారు.

బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్గా రెడ్డి ప్రసాద్