● ఇతర ప్రైవేటు కార్యక్రమాలకు ఇలాగే ఇస్తారా? | - | Sakshi
Sakshi News home page

● ఇతర ప్రైవేటు కార్యక్రమాలకు ఇలాగే ఇస్తారా?

Jun 3 2025 5:27 AM | Updated on Jun 3 2025 5:27 AM

● ఇతర ప్రైవేటు కార్యక్రమాలకు ఇలాగే ఇస్తారా?

● ఇతర ప్రైవేటు కార్యక్రమాలకు ఇలాగే ఇస్తారా?

విద్యుత్‌ స్తంభాలు, దిమ్మెల ఆనవాళ్లు లేకుండా క్రేన్‌తో ఊడబెరుకుతున్న దృశ్యాలు

ఇంకా తొలగించని ట్రాన్స్‌ఫార్మర్‌

కడప కార్పొరేషన్‌: అధికార తెలుగుదేశం పార్టీ కడప నగరంలో నిర్వహించిన మహానాడు కార్యక్రమం ముగిసింది. ప్రొటోకాల్‌ బాధ్యతలకే పరిమితం కావాల్సిన అధికారులు...ఆ పేరు చెప్పి సమస్త పనులు చక్కబెట్టారు. జిల్లా కలెక్టర్‌ మొదలుకొని చిన్నస్థాయి అధికారుల వరకూ అన్ని శాఖల అధికారులు స్వామి భక్తిని ప్రదర్శించడంలో పోటీలు పడ్డారు. కాగా మా రూటే సపరేటు అన్నట్లు విద్యుత్‌ శాఖ అధికారులు ఓ పది అడుగులు ముందుకేసి సంస్థ ఆదాయాన్ని సైతం ఫణంగా పెట్టి పనిచేశారని తెలుస్తోంది. మహానాడు ఏర్పాట్ల దశ నుంచే సుమారు 150కిపైగా విద్యుత్‌ స్తంభాలు నాటి, 11 కేవీ విద్యుత్‌ లైన్‌ ప్రత్యేకంగా లాగి, 50 ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసి అందుకు సంబంధించిన మెటీరియల్‌ను భారీగా వినియోగించారు. అందులో మహానాడు వేదిక వెనుకవైపు 10 ట్రాన్స్‌ఫార్మర్లను ఏయే కార్యక్రమాలకు వినియోగించాలో రాసి మరీ ఏర్పాటు చేశారు. మిగిలిన ట్రాన్స్‌ఫార్మర్లకు కూడా ప్రత్యేకంగా లైన్లు లాగి పార్కింగ్‌ స్థలాల్లో, వేదిక చుట్టుపక్కల వెలుతురు కోసం ఉపయోగించారు. ట్రాన్స్‌ఫార్మర్లు కూర్చొబెట్టడానికి సిమెంటు కాంక్రీట్‌తో రెడీమేడ్‌గా తయారు చేసిన దిమ్మెలను ఏర్పాటు చేశారు. కరెంటు వినియోగాన్ని తెలుసుకునేందుకు కనీసం మీటర్లు కూడా అమర్చలేదు. ఇలా ఏర్పాట్ల నుంచి మహానాడు మూడు రోజులపాటు ఇష్టం వచ్చినట్లు విద్యుత్‌ను లెక్కా పక్కా లేకుండా లక్షల యూనిట్ల విద్యుత్‌ను యథేచ్ఛగా వాడేసినట్లు తెలుస్తోంది. విద్యుత్‌ సరఫరాలో చిన్న అంతరాయం కూడా కలగకుండా సుమారు 200 మంది విద్యుత్‌ ఉద్యోగులు, సిబ్బందికి 24 గంటలపాటు డ్యూటీలు వేసి ఆయా ట్రాన్స్‌పార్మర్ల వద్ద నియమించినట్లు సమాచారం.

50 ట్రాన్స్‌ఫార్మర్లు, 150 స్తంభాలు అక్రమంగా వినియోగం

మీటర్లు కూడా అమర్చకుండానే విద్యుత్‌ వాడకం

ఆ భారమంతా ప్రజలపైనే

200 మంది ఉద్యోగులు, సిబ్బందికి 24 గంటలు డ్యూటీలు

ఓ పార్టీ కార్యక్రమానికి ఇంతలా ప్రజాధనందుర్వినియోగంపై తీవ్ర విమర్శలు

దీనిపై విద్యుత్‌శాఖ ఎస్‌ఈ రమణకు వివరణ కోరగా మహానాడు కార్యక్రమానికి మేం విద్యుత్‌ ఇవ్వలేదు. వాళ్లు జనరేటర్లు పెట్టుకున్నారు...విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయంగా మాత్రమే ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశాం...ఇందుకు వారు రూ.25వేలు డిపాజిట్‌ చెల్లించారని చెప్పారు. ఎస్‌ఈ ఇచ్చిన వివరణపై అనేక సందేహాలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరొక పార్టీయో, వ్యక్తులో ఇలా ప్రైవేటు కార్యక్రమాలు నిర్వహించుకుంటే విద్యుత్‌ అధికారులు ఇలాగే రూ.25వేలు కట్టించుకొని ఇలాగే ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాలు ఏర్పాటు చేస్తారా. ప్రత్యేకంగా లైన్లు లాగి కరెంటు ఇస్తారా...అప్పుడు కూడా మీటర్లు అమర్చకుండా విద్యుత్‌ను వాడేసుకోవచ్చా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఏదైనా శుభకార్యానికి 12 గంటలు విద్యుత్‌ వాడితే యూనిట్‌కు రూ.19లు చొప్పున వసూలు చేసే విద్యుత్‌ అధికారులు రూ.15వేలు కంటే తక్కువ కట్టించుకోరు. ఇంత పెద్ద మహానాడు కార్యక్రమానికి సుమారు పది రోజులు కరెంటు వినియోగిస్తే కేవలం రూ.25వేలు మాత్రమే డిపాజిట్‌ కట్టించుకోవడం పట్ల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement