
తిష్టవేసిన ఉద్యోగులకు స్థానచలనం
బదిలీలపై నిషేధం ఎత్తివేత
వరంగల్: రాష్ట్ర ప్రభుత్వం బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ జీఓ జారీ చేయడంతో ప్రభుత్వ విభాగాల్లో తిష్ట వేసిన ఉద్యోగులకు స్థాన చలనం తప్పనిసరైంది. జూలై 5నుంచి 20వ తేదీ వరకు బదిలీలపై నిషేధాన్ని ఎత్తివేస్తూ ప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకుంది. దీంతో పంచాయతీరాజ్, వ్యవసాయ, దేవాదాయ, ఆర్అండ్బీ తదితర శాఖల్లో నాలుగేళ్లకు పైగా ఒకే చోట విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు బదిలీ కానున్నారు. పంచాయతీరాజ్ పరిధిలోని జిల్లా, మండల పరిషత్ కార్యాయాలల్లో కొందరు పదేళ్లకు పైగా విధులు నిర్వర్తిస్తున్నారు. అదే విధంగా వ్యవసాయ శాఖ పరిధిలో మార్కెట్లలో ఒకేచోట పనిచేస్తున్న వారు బదిలీ బాట పట్టక తప్పదని తెలిసింది. అయితే ప్రభుత్వం నాలుగేళ్లు ఒకే చోట పనిచేస్తున్న వారు ఎంత మంది ఉన్నప్పటికీ క్యాడర్ల వారీగా 40 శాతం మందిని మాత్రమే బదిలీ చేయాలని నిబంధన పెట్టింది. దీంతో ఎక్కువకాలం ఒకే చోట పనిచేసిన వారికి మాత్రమే బదిలీ అయ్యే అవకాశాలున్నాయి. ఉదాహరణకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో 14 మార్కెట్ కమిటీల్లో 33సూపర్ వైజర్ పోస్టులు ఉన్నాయి. ఇందులో నాలుగేళ్లు దాటిన వారు 15మంది ఉన్నప్పటికీ 12మంది మాత్రమే బదిలీ అయ్యే అవకాశాలున్నాయి. సీనియారిటీ వారీగా జాబితాలు తయారు చేస్తే ఏ శాఖలో ఏ క్యాడర్లో ఎంత మంది బదిలీ అవుతారని విషయం తెలుస్తుందని విభాగాల ఉన్నతాధికారులు తెలిపారు.