
వందేళ్ల నాటి శ్మశానాన్ని ఆక్రమించుకున్న టీడీపీ నేతలు
● పదేళ్లుగా ఆక్రమణలను అడ్డుకుంటున్న వైఎస్సార్సీపీ కార్పొరేటర్ అనిల్కుమార్ ● ఆ కక్షతోనే అనిల్పై టీడీపీ నేత వెంకటరత్నం అనుచరులతో దాడి ● రాష్ట్రంలో లోకేష్ రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోంది ● టీడీపీ గూండాల నుంచి రక్షణ కల్పించాలంటున్న హరిజనవాడ గ్రామస్తులు ● ఇరువర్గీయులపై కేసు నమోదు చేసిన అలిపిరి పోలీసులు
కార్పొరేటర్ అనిల్ తల్లి కుప్పమ్మను ఓదార్చి భరోసా ఇస్తున్న భూమన కరుణాకరరెడ్డి
తిమ్మినాయుడుపాళెం హరిజనవాడలోని శ్మశాన స్థలంలో రెండు రోజులుగా జేసీబీతో అక్రమ నిర్మాణాలు చేపడుతున్న టీడీపీ నాయకులు
తిరుపతి మంగళం : తిరుపతి 50వ డివిజన్ తిమ్మినాయుడుపాళెం హరిజనవాడలో టీడీపీ నాయకులు చేస్తున్న కబ్జాలను ప్రశ్నిస్తున్నందుకే కార్పొరేటర్ బోకం అనిల్ కుమార్పై గురువారం దాడులకు తెగబడ్డారు. తిమ్మినాయుడుపాళెం హరిజనవాడలో గత టీడీపీ ప్రభుత్వంలో స్థానిక టీడీపీ నేత కాయం వెంకటరత్నం తన అనుచరులతో పాటు గ్రామస్తులు కొంత మంది తిమ్మినాయుడుపాళెంలోని సర్వే నంబర్ 199లో కాలువ పొరంబోకు స్థలం 1.45 ఎకరాలు గత వందేళ్లుగా తాతల ముత్తాతల నాటి శ్మశాన స్థలాన్ని ఆక్రమించుకుని రేకుల ఇల్లు నిర్మించుకున్నారు. దీని పై అప్పటి నుంచి జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులకు అనిల్ ఫిర్యాదులు చేస్తూ శ్మశాన స్థల ఆక్రమణను అడ్డుకుంటూ వస్తున్నారు. గత వైఎస్సార్సీపీ పాలనలో శ్మశానం ఆక్రమణకు గురికాకుండా అడ్డుకున్నారు.
50 మందికి పైగా అనుచరులతో దాడి
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తిరిగీ శ్మశాన స్థలాన్ని పూర్తిగా ఆక్రమించుకుని నిర్మాణాలను రెండు రోజులుగా చేపట్టారు. దీనిపై ఎక్కడ మళ్లీ అధికారులకు ఫిర్యాదు చేస్తాడోననే భయంతో కార్పొరేటర్ అనిల్ ఇంటి నుంచి గ్రామంలోని అమ్మవారి ఆలయానికి వెళుతుండగా కాయం వెంకటరత్నం 50 మందికి పైగా తన అనుచరులతో వచ్చి దాడి చేశాడని కార్పొరేటర్ బోకం అనిల్కుమార్, అతని తల్లి కుప్పమ్మ, సోదరి కాటమ్మలతో పాటు గ్రామస్తులు తెలిపారు. ఇంత దౌర్జన్యమేమిటని ప్రశ్నించినందుకు తమపై కూడా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని అనిల్ తల్లి కుప్పమ్మ, సోదరి కాటమ్మ బోరున విలపిస్తూ చెప్పారు. ఇంకొకసారి తమకు అడ్డు వస్తే చంపేస్తామంటూ బెదిరించారని అనిల్ కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు చెబుతున్నారు. అధికార గర్వంతో ఇంతటి రౌడీయిజం మంచిది కాదని స్థానికులు చెబుతున్నా పట్టించుకోకుండా టీడీపీ నాయకులు ఇష్టమొచ్చినట్లు అనిల్ను కొట్టారని స్థానికులు తెలిపారు. వెంటనే ఆసుపత్రికి తీసుకుపోండి లేకుంటే ఇక్కడే చంపేస్తామని బెదిరించినట్లు చెప్పారు. దాంతో ఒక్క సారిగా హరిజనవాడ గ్రామస్తులంతా భయాందోళనకు గురయ్యారు. తీవ్రంగా గాయపడిన కార్పొరేటర్ అనిల్తో పాటు సోదరి కాటమ్మను రుయా ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డుకు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు.
టీడీపీ నేతల దౌర్జన్యం.. దెబ్బలు తిన్నవారిపైనే కేసులు
తిరుపతి 50వ డివిజన్ హరిజన వాడలో జరిగిన దాడుల నేపథ్యంలో కార్పొరేటర్ అనిల్పై తీవ్రంగా దాడి చేసిన టీడీపీ నాయకులే ముందుగా రుయా ఆసుపత్రికి వచ్చి తమను అనిల్ బైక్తో గుద్దేశాడని, దాంతో కాలుకు తీవ్రంగా గాయం అయిందంటూ టీడీపీ నాయకుడు వెంకటరత్నం ఆసుపత్రిలో చేరాడు. ఇదంతా అనిల్పై చేసిన దాడి నుంచి తప్పించుకునేందుకు ఆడుతున్న నాటకాలని స్థానిక గ్రామస్తులు చెబుతున్నారు. అయితే ఇరు వర్గాలు దాడు చేసుకుని గాయాలపాలైనట్లుగా తూతూమంత్రంగా కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అలిపిరి పోలీసులు మాత్రం ఇరువురిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామని చెబుతున్నారు. కానీ తనకు చెప్పకుండా బయటకు ఎక్కడికీ వెళ్లకూడదని టీడీపీ నాయకుడు వెంకటరత్నంను అలిపిరి సీఐ రాంకిషోర్ హెచ్చరించారు.
రెడ్బుక్ పాలనతో ఆరాచకం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం కాకుండా లోకేష్ రాసుకున్న రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోందని చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డితో పాటు తిరుపతి నగర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి నాయకులకు ఓట్లు వేసి గెలిపించినందుకు సంక్షేమాన్ని పక్కనపెట్టి కక్ష పూరిత రాజకీయాలు చేస్తున్నారని మండి పడుతున్నారు. ఇలాగే కూటమి నాయకులు రెచ్చిపోతే స్వచ్ఛందంగా తామే రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపడుతామని నగర ప్రజలు చెబుతున్నారు.

వందేళ్ల నాటి శ్మశానాన్ని ఆక్రమించుకున్న టీడీపీ నేతలు

వందేళ్ల నాటి శ్మశానాన్ని ఆక్రమించుకున్న టీడీపీ నేతలు

వందేళ్ల నాటి శ్మశానాన్ని ఆక్రమించుకున్న టీడీపీ నేతలు