
ఎన్డీఏ కూటమిదే అధికారం!
● అధికారంలో బీజేపీకి వాటానా? ● సీఎం ఎవరో తేల్చని అమిత్ షా ● అన్నాడీఎంకేలో గందరగోళం ● పళణి నేతృత్వంలోనే అధికారం అన్న రెండాకుల సేనలు
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకేలో కేంద్ర హోంమంత్రి అమిత్షా వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. ఓ తమిళ మీడియాకు శుక్రవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో తమిళనాట ఎన్డీఏ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వస్తుందని, కూటమి పాలన తథ్యమని అమిత్షా సంకేతాన్ని ఇచ్చారు. అయితే, సీఎం ఎవరో అన్న ప్రశ్నకు ట్విస్టు పెట్టే రీతిలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి పేరును ఆయన ప్రస్తావించకపోవడం గమనార్హం.
ఇటీవల చైన్నెకి వచ్చిన అమిత్షా సమక్షంలో జాతీయస్థాయిలో ఎన్డీఏ కూటమిలోకి అన్నాడీఎంకే మళ్లీ చేరిన విషయం తెలిసిందే. అదేసమయంలో తమిళనాట మాత్రం అన్నాడీఎంకే నేతృత్వంలోనే కూటమి అని ప్రకటించారు. అన్నాడీఎంకే నీడలోనే ఎన్నికలు అని స్పష్టం చేశారు. అయితే, ఇటీవల కాలంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు, బీజేపీ నేతల వ్యాఖ్యలు అన్నాడీఎంకే వర్గాలను అయోమయంలోకి నెట్టేస్తున్నాయి. పళణిస్వామి నేతృత్వంలోనే తమిళనాట కూటమి అన్న పరిణామాలు సాగుతున్న సమయంలో అధికారంలో వాటా అనే నినాదాన్ని అందుకునే విధంగా బీజేపీ నేతలు ముందడుగు వేయడం చర్చకు దారి తీసింది. ఈ పరిస్థితుల్లో తాజా తమిళనాట ఎన్డీఏ కూటమిదే అధికారం అని స్పష్టం చేసిన అమిత్షా సీఎం అభ్యర్థి విషయంలో ట్విస్టు పెట్టడం అన్నాడీఎంకేలో తీవ్ర గందరగోళాన్ని సృష్టించినట్లైంది.
అమిత్షా వ్యాఖ్యలపై చర్చ
ఓ తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ప్రశ్నలకు అమిత్షా స్పందించారు. తమిళనాడులో కూటమి పాలనే అని ఓ ప్రశ్నకు స్పష్టం చేస్తూ, ఎన్డీఏ కూటమి ఇక్కడ అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. అన్నాడీఎంకేలో వివాదాల గురించి స్పందిస్తూ, విడిపోయిన వారిని ఒక చోట చేర్చడం తమ పని కాదని, ఎవరి పని వాళ్లు చేసుకోవాల్సిందేనని, అది వారి పార్టీకి సంబంధించిన వ్యవహారం అంటూ, ఇందులో తలదూర్చమన్నారు. తమిళనాడులో బీజేపీ, అన్నాడీఎంకేలతో కూడిన ఎన్డీఏ కూటమి బలంగా ఉందని, అధికారంలో బీజేపీ భాగస్వామ్యం తప్పనిసరిగా ఉంటుందని మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. కూటమిలో సీఎం అభ్యర్థి ఎవరో అన్న ప్రశ్నకు ట్విస్ట్ ఇచ్చారు. తమిళనాట ఎన్డీఏ నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చినా, సీఎం అభ్యర్థి అన్నాడీఎంకేకు చెందిన ఒకరు ఉంటారన్న వ్యాఖ్యతో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి మద్దతు దారుల గుండెల్లో బాంబును పేల్చారు. పళణిస్వామి పేరును సీఎం అభ్యర్థిగా అమిత్షా పరిగణించనట్టుగానే ఈ ట్విస్టును భావించాలన్న కొత్త చర్చ ఊపందుకుంది. అదే సమయంలో ఇటీవల కాలంగా బీజేపీ పెద్దలతో అన్నాడీఎంకేకు చెందిన ఎస్పీ వేలుమణి, సెంగోట్టయన్ సన్నిహితంగా ఉంటూ రావడంతో ఆ ఇద్దర్ని అమిత్షా దృష్టిలో పెట్టుకున్నారా అనే ప్రశ్న ఉత్పన్నమైంది. ఇక, విజయ్ ఎన్డీఏలోకి వస్తారా అనే ప్రశ్నకు ఎన్నికలకు ఇంకా సమయం ఉందని వేచి చూడండి అని సమాధానం ఇచ్చారు.
న్యూస్రీల్
పళణిస్వామి సీఎం అభ్యర్థి
అమిత్షా వ్యాఖ్యలపై పలువురు అన్నాడీఎంకే నేతలు స్పందిస్తూ పరోక్షంగా ఖండించారు. మాజీ మంత్రి రాజేంద్రబాలాజీ స్పందిస్తూ తమిళనాడులో అన్నాడీఎంకే నేతృత్వంలోనే కూటమి అధికారంలోకి వస్తుందన్నారు. సీఎం అభ్యర్థి పళణిస్వామి మాత్రమే అని స్పష్టం చేశారు. మరో మాజీ మంత్రి వైగై సెల్వన్ స్పందిస్తూ తమిళనాట కూటమి పాలనకు ఆస్కారం లేదన్నారు. ఇందుకు తమిళనాడు ప్రజలు అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. కూటమి పాలన అన్నది చరిత్రలో ఇక్కడ జరగలేదని, ఇక మీదట కూడా జరగబోదని స్పష్టం చేశారు. అన్నాడీఎంకే కూటమి లక్ష్యం డీఎంకేను గద్దె దించడమే అని పేర్కొంటూ, కూటమి పాలనను అంగీకరించం అని తేల్చి చెప్పారు. ఇక, బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ను ప్రశ్నించగా, కూటమి, అధికారం అన్న విషయాల గురించి తమ నేత అమిత్షా, పళణిస్వామి చర్చించి నిర్ణయం తీసుకుంటారని దాట వేశారు.