
గంగమ్మ జాతర చాటింపు
తిరుపతి రూరల్ : తిరుపతి రూరల్ మండలం పెరుమాళ్లపల్లిలో గంగమ్మ జాతర చాటింపు నిర్వహించారు. గ్రామపెద్దలు బుధవారం తెల్లవారుజామున నడివీధి గంగమ్మ వద్దకు చేరుకుని వేపాకులతో పాటు పసుపు, కుంకుమలు తీసుకెళ్లి గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో జాతర చాటింపును నిర్వహించారు. మే 6వ తేదీన గ్రామంలో జాతరను నిర్వహించనున్నట్లు గ్రామస్తులకు తెలియపరిచేలా డప్పు కొట్టి చాటింపు వేయించారు. జాతర చాటింపు వేయడంతో గ్రామస్తులు ఎవరూ గ్రామ పొలిమేర్లు దాటి రాత్రిళ్లు నిద్ర చేయరాదని, అలాగే బయటి వ్యక్తులు ఎవరూ గ్రామంలోకి వచ్చి నిద్ర చేయరాదని గ్రామపెద్దలు సూచించారు. గంగ జాతరను పురస్కరించుకుని గ్రామంలో పారిశుద్ధ్య పనులు లోపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పంచాయతీ సర్పంచ్ మోహన్ సిబ్బందికి సూచించారు.