
● ప్రయత్నాలలో సీమాన్ ● పన్నీరుతో భేటీతో చర్చ
సాక్షి, చైన్నె: అసెంబ్లీ ఎన్నికలలో చెరకు రైతు చిహ్నం దక్కించుకునే ప్రయత్నాలలో నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ పడ్డారు. ఈసారి తమకు ఆ చిహ్నం దక్కుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. వివరాలు.. నామ్ తమిళర్ కట్చి గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేస్తూ బలాన్ని పెంచుకుంటున్న విషయం తెలిసిందే. 2021 అసెంబ్లీ ఎన్నికలలో డీఎంకే, అన్నాడీఎంకే తదుపరి ఓటింగ్ శాతంలో నామ్ తమిళర్ కట్చి నిలబడే స్థాయికి చేరింది. గత ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికలలోనూ ఒంటరిగా పోటీ చేసి 8.9 శాతం ఓట్లు దక్కించుకుంది. అలాగే ఎన్నికల కమిషన్ గుర్తును సొంతం చేసుకుంది. అయితే గత లోక్సభ ఎన్నికల సమయంలో ఆ పార్టీకి అనాదిగా వస్తూ వచ్చిన చెరకు రైతు చిహ్నం దూరమైంది. మైక్ చిహ్నంతో సర్దుకున్నప్పటికీ ఓటింగ్ శాతం పెంచుకోవడం విశేషం. ప్రస్తుతం ఎన్నికల కమిషన్ గుర్తింపు పొందిన పార్టీ కావడంతో తమ గుర్తును మళ్లీ దక్కించుకునే ప్రయత్నాలలో సీమాన్ నిమగ్నమయ్యారు. ఎన్నికల కమిషన్ను ఆశ్రయించగా, వారి జాబితాలోని పది చిహ్నాలను కేటాయించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇందులో రైతు చిహ్నం సైతం ఉండటంతో దానినే తమకు అప్పగించాలని సీమాన్ తరపు ప్రతినిధులు ఎన్నికల కమిషన్కు విజ్ఞప్తి చేసుకున్నారు.
ఆంతర్యమేమిటో..?
చిహ్నం ప్రయత్నాలు ఓ వైపు ఉంటే, మరోవైపు మాజీ సీఎం పన్నీరు సెల్వంను సీమాన్ కలవడం చర్చకు దారి తీసింది. ఇందులోని ఆంతర్యాన్ని కనిపెట్టే పనిలో రాజకీయ విశ్లేషకులు ఉన్నారు. రాష్ట్రంలో అన్నాడీఎంకే – బీజేపీ కూటమి ఏర్పటైన నేపథ్యంలో పన్నీరు సెల్వం తదుపరి కార్యాచరణ ప్రశ్నార్థకంగా మారింది. అన్నాడీఎంకే బహిష్కృత నేతగా ఉన్న పన్నీరు సెల్వం ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పటికీ ఆయన ఓ శిబిరంగానే కొనసాగుతున్నారు. పార్టీ అంటూ వేదిక లేని దృష్ట్యా తదుపరి కార్యాచరణపై కసరత్తు చేస్తున్నారు. ఈ సమయంలో పన్నీరు సెల్వంను సీమాన్ కలవడం చర్చకు దారి తీసింది. సీమాన్ను పన్నీరు సెల్వం ఎన్డీఏ కూటమిలోకి ఆహ్వానించి ఉండవచ్చని కొందరు, పన్నీరు సెల్వం కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్టుగా మరికొందరు పేర్కొంటుండడం గమనార్హం. ఈ భేటీ గురించి సీమాన్ను ప్రశ్నించగా తండ్రి,కుమారుల బంధం తమది అంటూ, ఆ దిశగానే మర్యాద పూర్వకంగా కలిసినట్టు పేర్కొన్నారు. చివరగా రాజకీయాలకు ప్రాధాన్యత అంటూ మెలిక పెట్టడం గమనార్హం.