వ్యాపారి కిడ్నాప్‌

– నలుగురు అరెస్ట్‌

తిరువొత్తియూరు: మదురైలో వ్యాపారిని కిడ్నాప్‌ చేసి రూ.50 లక్షలు డిమాండ్‌ చేసిన నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మదురై సుబ్రహ్మణ్యంపురానికి చెందిన సగాధీను (33). ఇతను కార్లను కొని విక్రయించే వ్యాపారం చేస్తుంటాడు. సంఘటన జరిగిన రోజున సగాధీను సొక్కికులంకు చెందిన స్నేహితుడు సాహల్‌ హమీద్‌తో మోటార్‌ సైకిల్‌పై వెళుతుండగా కారులో వచ్చిన పదిమంది వారిపై దాడి చేసి కారులో కిడ్నాప్‌ చేశారు. సగాధీను భార్యకు ఫోన్‌ చేసి భర్తను కిడ్నాప్‌ చేసినట్టు తెలిపి, రూ. 50 లక్షలు తీసుకురావాలని బెదిరించాడు. దీంతో ఆమె రూ.లక్ష సర్దడంతో కిడ్నాపర్‌ ఒకరు బైక్‌లో వచ్చి ఆ నగదు తీసుకెళ్లినట్లు తెలిసింది. ఈ క్రమంలో మరుసటి రోజు ఉదయం భార్య సెల్‌ఫోన్‌లో మాట్లాడిన సగాధీను తాను ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపాడు. దీంతో అతని భార్య, బంధువులు అక్కడికి వెళ్లారు. ఆ సమయంలో అతని తలకు కత్తిపోటుకు గురై చికిత్స పొందుతున్నాడు. ఫిర్యాదు మేరకు పోలీసుల విచారణలో నగదు లావాదేవీల్లో సగాధీనుకు, అట్టీప్‌తో పాత కక్షలు ఉన్నట్లు తెలిసింది. దీంతో అట్టీప్‌, అతని సహచరులు అబ్దుల్‌ ఇమ్రాన్‌ (23), అఖిల్‌ ఆసీఫ్‌ (24), మహమ్మద్‌ సబీక్‌ (23) నలుగురిని అరెస్టు చేశారు. పరార్‌లో ఉన్న తిరుమణి సెల్వం, హరి, వాషిమ్‌, అరుల్‌, వసంత అనే ఐదుగురి కోసం గాలిస్తున్నారు.

Read latest Tamil Nadu News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top