ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించాలి
భానుపురి (సూర్యాపేట) : పంచాయతీ ఎన్నికలు నిష్పక్షపాతంగా, శాంతియుత వాతావరణంలో నిర్వహించాలని జనరల్ పరిశీలకుడు గుగులోతు రవినాయక్ సూచించారు. గురువారం సూర్యాపేట కలెక్టరేట్లో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్, ఎస్పీ కె.నరసింహలతో కలిసి ఆయన గ్రామ పంచాయతీ ఎన్నికల నోడల్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటర్లకు అవగాహన కల్పించి తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకుని ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియలో పాల్గొనేలా చూడాలన్నారు. ఓటర్ స్లిప్స్ పంపిణీలో ఎలాంటి పొరపాట్లు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికలపై వచ్చిన ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో నిజ నిర్ధారణ చేసిన తర్వాతనే చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉద్యోగులు ఎన్నికల్లో అభ్యర్థులకు మద్దతు తెలిపినా ప్రచారంలో పాల్గొన్నా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ మాట్లాడుతూ మొదటి విడతలో నామినేషన్ స్వీకరణ కేంద్రాలు మొదటి విడతలో 44 , రెండవ విడతలో 49 , మూడవ విడతలో 38 ఏర్పాటు చేశామని వివరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని అభ్యర్థుల ఖర్చులు లెక్కించేందుకు 23 ఫ్లయింగ్ స్క్వాడ్లు,4 స్టాటిస్టిక్ టీములు నిరంతరం పర్యవేక్షణ చేస్తాయని చెప్పారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎస్పీ కె.నరసింహ మాట్లాడుతూ పోలింగ్ ప్రక్రియ సాఫీగా సాగేందుకు పోలీసు శాఖ నామినేషన్ కేంద్రాల వద్ద, పోలింగ్ కేంద్రాలలో భద్రతకు బలగాలను ఏర్పాటు చేశామన్నారు. సోషల్ మీడియా, గ్రీవెన్స్ సెల్ ప్రారంభం
సోషల్ మీడియాలో రాజకీయ ప్రచారం, అసత్య ప్రచారం, ద్వేషపూరిత పోస్టులు, ఓటర్లను ప్రభావితం చేసే సందేశాలు, ఉద్రిక్తతలను రేకెత్తించే వ్యాఖ్యలు నిషేధించామని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల సంబంధిత ఫిర్యాదులు, సూచనలు స్వీకరించి చర్యలు తీసుకోవడానికి ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనలు వంటి అంశాలపై వెంటనే 6281492368 కు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ కె. సీతారామారావు, డీఎస్పీ రవీందర్ రెడ్డి, జెడ్పీ సీఈఓ వి.వి. అప్పారావు, డీపీఓ యాదగిరి, డీఎల్పీఓలు నారాయణ రెడ్డి, పార్థ సారధి, నోడల్ అధికారులు పాల్గొన్నారు.
జనరల్ పరిశీలకుడు రవినాయక్


