
14 నుంచి విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల సమ్మె
సూర్యాపేట అర్బన్ : విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈనెల 14 నుంచి సమ్మె చేపట్టనున్నట్లు తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల జేఏసీ చైర్మన్ మేడె మారయ్య పిలుపునిచ్చారు. జిల్లా ఆర్టిజన్ కార్మికులు మంగళవారం టీజీఎస్పీడీసీఎల్ సూర్యాపేట సర్కిల్ ఆఫీస్లో సర్వసభ సమావేశం నిర్వహించి మాట్లాడారు.ప్రతి ఆర్టిజన్ కార్మికుడు యూనియన్లకు అతీతంగా సమ్మెలో పాల్గొనాలని కోరారు. ఒకే సంస్థలో రెండు రూల్స్ తీసుకురావడం అన్యాయమని పేర్కొన్నారు. స్టాండింగ్ ఆర్డర్స్ను రద్దుచేసి ఏపీ ఎస్ ఈబీ రూల్స్ వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ ఆర్టిజన్కార్మికుల జేఏసీ నాయకులు రెహమాన్, దయాకర్ రెడ్డి, మురహరి, రామస్వామి, రాఘవ గోపికృష్ణ, నాగయ్య, యాకయ్య, రమేష్, చారి, రవీంద్ర చారి, పరమేష్, సైదులు పాల్గొన్నారు.
నేటి నుంచి మూడు రోజులు కళాశాలలు బంద్ చేయాలి
సూర్యాపేట : పెండింగ్ స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ను విడుదల చేయాలని కోరుతూ ఈనెల 2, 3, 4 తేదీల్లో డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ కళాశాలలు బంద్ చేయాలని పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు పుల్లూరి సింహాద్రి కోరారు. పీడీఎస్యూ ఆధ్వర్యంలో చేపట్టే కళాశాలల బంద్కు సంబంధించిన వాల్పోస్టర్ను సంఘం నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న రూ.7200 కోట్ల స్కాలర్షిప్స్, ఫీజురీయింబర్స్మెంట్ను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డివిజన్ ప్రధాన కార్యదర్శి పిడమర్తి భరత్, మహేష్, నవీన్, వినయ్, సంధ్య, మానస, ప్రసన్న, పవన్, మనోజ్ పాల్గొన్నారు.
9న సమ్మెను జయప్రదం చేయాలి
సూర్యాపేట : మోదీ ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఈనెల 9న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి నెమ్మాది వేంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. మంగళవారం సూర్యాపేటలోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో పెయింటర్స్ వర్కర్స్ పట్టణ జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. మోదీ పదేళ్ల పాలనలో కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా చట్టాలను అమలు చేస్తున్నారని అన్నారు. 29 కార్మిక చట్టాలను రద్దు చేసి పెట్టుబడి దారులకు అనుకూలంగా ఉండే లేబర్ కోడ్లను తెచ్చారని ఆరోపించారు. ఈ సమావేశానికి పెయింటర్స్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు పాముల ఉపేందర్ అధ్యక్ష వహించగా, యూనియన్ నాయకులు కృష్ణ, రఫి, మూర సైదులు, బాబా, మార్క్ తదితరులు పాల్గొన్నారు.
ఉపాధి పనులు
వినియోగించుకోవాలి
మద్దిరాల : కూలీలు ఉపాధిహామీ పనులను వినియోగించుకోవాలని డీఆర్డీఓ వి.వి. అప్పారావు కోరారు. మద్దిరాల మండల పరిధిలోని పోలుమల్లలో కొనసాగుతున్న ఉపాధిహామీ పనులను మంగళవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. ఉపాధిహామీ పనులను సక్రమంగా చేసి ప్రభుత్వం అందించే కూలి పొందాలన్నారు.

14 నుంచి విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల సమ్మె