
ఆటో వచ్చింది.. కాలినడక తప్పింది
మఠంపల్లి: మఠంపల్లి మండలం అల్లీపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గతంలో చదివిన విద్యార్థులు చదువులో రాణించడంతో పాటు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో వివిధ క్రీడా పోటీల్లో పాల్గొని పాఠశాలకు మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చారు. ఈ పాఠశాలలో అల్లీపురంతో పాటు కాల్వపల్లి తండా, పాతదొనబండ తండా, కొత్తదొనబండ తండా, జామ్లా తండా గ్రామాలకు చెందిన విద్యార్థులు చదువుకునేవారు. కానీ ప్రస్తుతం సరైన రవాణా సౌకర్యం లేక ఆయా తండాల విద్యార్థులు పట్టణాల్లో బడులకు వెళ్తున్నారు. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన బడిబాట కార్యక్రమంలో భాగంగా అల్లీపురం జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం మోదుగు శేషిరెడ్డి, ఉపాద్యాయులు ఎలాగైనా పాఠశాలకు పూర్వ వైభవం తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో పాఠశాల పరిధిలోని ఆయా తండాలకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి అల్లీపురం జెడ్పీహెచ్ఎస్కు తమ పిల్లలను పంపించాలని కోరారు. అయితే అల్లీపురం పాఠశాలకు గతంలో తమ తండాల నుంచి బస్సులు, ఆటోలు నడిచేవని, ప్రస్తుతం బస్సు లేకపోవడంతో 2 నుంచి 4 కిలోమీటర్ల దూరం ఉన్న తండాల నుంచి పిల్లలు పాఠశాలకు చేరుకోవాలంటే కాలినడకన రావాల్సి ఉంటుందని తల్లిదండ్రులు పేర్కొన్నారు. దీంతో ఎలాగైనా విద్యార్థులకు వాహనం ఏర్పాటు చేస్తామని వారి తల్లిదండ్రులకు హెచ్ఎం, ఉపాధ్యాయులు హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం కాల్వపల్లితండా మాజీ సర్పంచ్ మాలోతు సుజాతాసక్రునాయక్ను హెచ్ఎం, ఉపాధ్యాయులు కలిసి.. పరిస్థితిని వివరించి, ఏడాది కాలానికి పాఠశాల పరిధిలోని తండాలకు చెందిన విద్యార్థులు పాఠశాలకు వచ్చి వెళ్లేలా ఆటో ఏర్పాటు చేశారు. దీంతో పాఠశాలలో 40మంది వరకు ఉన్న విద్యార్థుల సంఖ్య 60కి పెరిగింది. ఇప్పటికీ నిత్యం అడ్మిషన్లు జరుగుతూనే ఉన్నాయని హెచ్ఎం తెలిపారు. ఆటో ఏర్పాటు చేసిన దాతను, హెచ్ఎం, ఉపాధ్యాయులను విద్యార్థుల తల్లిదండ్రులు అభినందిస్తున్నారు.
దాత సహకారంతో అల్లీపురం
జెడ్పీహెచ్ఎస్కు ఆటోను ఏర్పాటు చేసిన హెచ్ఎం, ఉపాధ్యాయులు
చుట్టుపక్కల తండాల నుంచి వచ్చే విద్యార్థులతో పెరిగిన అడ్మిషన్లు
రోజూ ఆటోలోనే వచ్చివెళ్తున్నాం
మా తండా నుంచి అల్లీ పురం జెడ్పీహెచ్ఎస్ పాఠశాలకు సుమారు 3 కిలో మీటర్లు దూరం ఉండటంతో పాఠశాలకు కాలినడకన రాలేక ఇబ్బందులు పడేదాన్ని. ఇప్పుడు ప్రతిరోజు హెచ్ఎం సార్, టీచర్లు ఏర్పాటు చేయించిన ఆటోలోనే వచ్చివెళ్తున్నాం. ఎంతో ఆనందగా ఉంది. – భూక్యా శరణ్య, 7వ తరగతి, కాల్వపల్లితండా
దాత సహకారం మరువలేనిది
అల్లీపురం జెడ్పీహెచ్ఎస్కు విద్యార్థులను చేరవేయడానికి ఆటోను సమకూర్చిన కాల్వపల్లితండా మాజీ సర్పంచ్ మాలోతు సుజాతాసక్రునాయక్ సహకారం మరువలేనిది. ఆటో ఏర్పాటు చేయడంతో విద్యార్థుల సంఖ్య పెరగడంతో పాటు ఇంకా అడ్మిషన్లు జరుగుతూనే ఉన్నాయి.
– మోదుగు శేషిరెడ్డి, హెచ్ఎం

ఆటో వచ్చింది.. కాలినడక తప్పింది

ఆటో వచ్చింది.. కాలినడక తప్పింది