
చిరుత కళేబరానికి పోస్టుమార్టం నిర్వహిస్తున్న పశువైద్యాధికారి
నల్లగొండ క్రైం : నల్లగొండ పట్టణ సమీపంలోని చందనపల్లి చెత్త డంపింగ్ యార్డులో చిరుత కళేబరం బుధవారం వెలుగులోకి రావడంతో సమీప గ్రామాల ప్రజల ఉలి క్కిపడ్డారు. సుమారు పది రోజుల క్రితం చిరుత మృతిచెంది ఉంటుందని అటవీ శాఖ అధికారులు, పశువైద్యులు అంచనా వేస్తున్నారు.
ఇలా వెలుగులోకి...
శేషమ్మగూడెం గ్రామానికి చెందిన కిరణ్ తన పందుల ను చూసుకునేందుకు చెత్తడంపింగ్ యార్డు వద్దకు వెళ్లాడు. అక్క డే రెండు పందులు చనిపోయి ఉండటంతో రోజు పందుల గుంపు సేద తీరే ప్రాంతానికి వెళ్లి చూ డగా చెట్ల పొదల్లో చిరుత నిద్రలో ఉన్న ట్లు కనిపించింది. దాన్ని పక్కనే మరో పంది చనిపోయి ఉండటాన్ని చూసి కంగుతిన్నాడు. భయపడి దూరంగా వెళ్లి బంధువైన అటవీ శాఖ ఉద్యోగికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. సమీపంలో ఉన్న వారికి కూడా విషయం చెప్పడంతో పులిని పరిశీలించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించుకున్నారు. ఫొటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో వైరల్గా మారింది.
చిరుత కళేబరానికి పోస్టుమార్టం
సమాచారం మేరకు అటవీశాఖ అధికారులు ఘటన స్థలాన్ని పరిశీలించి చనిపోయిన మగ చిరుత 5 నుంచి 6 సంవత్సరాల వయస్సు ఉంటుందని తెలిపారు.పశువైద్యాధికారి సందీప్రెడ్డి ఆధ్వర్యంలో చిరుత కళేబరానికి పోస్టుమార్టం నిర్వహించారు. అవయవాలు, గోర్లను సేకరించి హైదరాబాద్లోని పశు వైద్య బయోలాజికల్ రీసెర్చ్ ల్యాబ్కు పంపించారు. రైతులు పెట్టిన మందును తిని చనిపోయిన కళేబరాన్ని తినడం లేదా పొలాల్లో గుళికలు కలిపిన నీళ్లు తాగడంతోనైనా మృతిచెంది ఉండొచ్చని భావిస్తున్నట్లు పశువైద్యాధికారి తెలిపారు. చిరుతపులి పడుకున్న కిందిభాగం పూర్తిగా కుళ్లిపోయి ఉన్నట్లు తెలిపారు. అనంతరం అక్కడే చిరుత కళేబరాన్ని కాల్చేశారు.
రాచకొండ నుంచి రాక?
రాచకొండ అటవీ ప్రాంతం నుంచి చిరుతపులి వచ్చినట్లు అటవీ శాఖ అధికారులు అంచనాకు వచ్చారు. 2018వ సంవత్సరంలో మర్రిగూడం ప్రాంతంలో చిరుత సంచరించినట్లు అధికారులు గుర్తించారు. మూసీ కాల్వగుండా చిరుత చందనపల్లి వైపు వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. రాచకొండ ప్రాంతంలో ఆరు చిరుతలు ఉన్నాయని, ఆ ప్రాంత పులులే బలహీనంగా ఉంటాయని జిల్లా అటవీ శాఖ అధికారి రాంబాబు తెలిపారు. అయితే, 15రోజుల క్రితమే చిరుతను గుర్తించి సమాచారం ఇచ్చినా అటవీ అధికారులు పట్టించుకోలేదని రైతులు ఆరోపిస్తున్నారు. కాగా, డంపింగ్ యార్డు పరిసరాల్లో పెద్దగా జనసంచారం ఉండదు. పులి సమీప చెట్లపొదల్లోనే గడుపుతూ పందులను ఆహారంగా తీసుకుందని, పొలాల వైపు రాకపోవడంతో ప్రాణా పాయం తప్పిందని రైతులు అంటున్నారు.
ఫ ఉలిక్కిపడిన సమీప గ్రామాల ప్రజలు
ఫ పది రోజుల క్రితం మృతిచెంది
ఉంటుందని అధికారుల వెల్లడి
ఫ రాచకొండ ప్రాంతం నుంచి వచ్చి
ఉంటుందని అంచనా
ఫ 15రోజుల క్రితమే రైతులు గుర్తించినా తేలిగ్గా తీసుకున్న అటవీ అధికారులు
భయంతో పరుగులు తీశాను
పందుల గుంపు కోసం డంపింగ్ యార్డు శివారు చెట్ల పొదల వైపు వెళ్లాను. అక్కడ ఓ పంది చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. దానిని లేపుతూ చెట్ల పొదల వైపు చూడగా చిరుతపులి పడుకుని ఉన్నట్లు కనిపించింది. భయంతో పరుగులు తీసి విషయం అందరికీ చెప్పా.
– కిరణ్, శేషమ్మగూడెం

చిరుత కళేబరాన్ని బయటకు తీసి పరిశీలిస్తున్న అటవీ, పశువైద్యాధికారులు, స్థానికులు
