
చంద్రబాబు పాలనపై ప్రజల చీదరింపు
● వైఎస్సార్సీపీ యువజన విభాగ
జిల్లా అధ్యక్షుడు నాగార్జున
నెల్లూరు(స్టోన్హౌస్పేట): కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఏడాదైనా.. హామీల అమల్లో విఫలమైన సీఎం చంద్రబాబును ప్రజలు చీదరించుకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ జిల్లా అధ్యక్షుడు ఊటుకూరు నాగార్జున పేర్కొన్నారు. రామ్జీనగర్లోని పార్టీ నగర నియోజకవర్గ కార్యాలయంలో పార్టీ విద్యార్థి విభాగ జిల్లా అధ్యక్షుడు ఆశ్రిత్రెడ్డితో కలిసి విలేకరులతో గురువారం ఆయన మాట్లాడారు. ఓటేసి గెలిపించిన ప్రజలను టీడీపీ మోసం చేసిందని మండిపడ్డారు. ఏడాదికి నాలుగు లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని ఇచ్చిన హామీ నీటమూటగా మిగిలిందని విమర్శించారు. నిరుద్యోగ భృతి ఊసెత్తడంలేదని ఆరోపించారు. వలంటీర్లు, ఎండీయూ వాహనాల సిబ్బందిని తొలగించి వారిని రోడ్డున పడేశారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి మహిళలపై అఘాయిత్యాలు నానాటికీ ఎక్కువయ్యాయని చెప్పారు. మహిళల భద్రతపై ఎన్నికలకు ముందు ఉపన్యాసాలిచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు ప్రస్తుతం ఇవేవీ కనిపించడంలేదానని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వ బూటకపు హామీలు, అకృత్యాలను ప్రశ్నించే తమ పార్టీ శ్రేణులపై కేసులు పెట్టి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.
నిరసన ర్యాలీ నేడు
కూటమి ఏడాది దుర్మార్గపు పాలనకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీని శుక్రవారం చేపట్టనున్నామని వెల్లడించారు. బారకాసు సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీని ఉదయం తొమ్మిది గంటలకు నిర్వహించి, కలె క్టర్కు వినతిపత్రాన్ని అందజేయనున్నామని చెప్పారు. యువత, విద్యార్థులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆశ్రిత్రెడ్డి మాట్లాడారు. యువగళంలో ఇచ్చిన హామీలను లోకేశ్ విస్మరించి, యువతను నిలువునా మోసం చేశారని మండిపడ్డారు. ఫీజులను చెల్లించలేక.. తమ సర్టిఫికెట్లను కళాశాల నుంచి తెచ్చుకోలేక విద్యార్థులకు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.