
అవకాశాలతో యువత ఆర్థికంగా ఎదగాలి
నెల్లూరు రూరల్: ఆహార శుద్ధి పరిశ్రమల్లో ఉన్నటు వంటి అపార అవకాశాలను వినియోగించుకుని గ్రామీణ యువత ఆర్థికంగా ఎదగాలని జిల్లా ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి శ్రీనివాసులు కోరారు. బుధవారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో డీఆర్డీఏ, మెప్మా క్షేత్రస్థాయి సిబ్బందికి ఆహార శుద్ధి కార్యకలాపాలపై సాంకేతిక శిక్షణ అందించారు. ఆయన మాట్లాడుతూ రెడీ టు ఈట్, రెడీ టు కుక్ విధానంలో ఆహార ఉత్పత్తులకు ఆదరణ పెరుగుతున్న దృష్ట్యా, ఆహార శుద్ధి రంగంలో ఉన్నటు వంటి అపార అవకాశాలను వినియోగించుకోవాలన్నారు. ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమల క్రమబద్ధీకరణ పథకం కింద సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లను ఫార్మలైజ్ చేయడం, ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని పెంచడం మౌలిక సదుపాయాలు, ప్యాకేజింగ్, మార్కెటింగ్, బ్రాండింగ్, నైపుణ్యాభివృద్ధి అందించడం, స్థిరమైన ఉపాధి అవకాశాలను సృష్టించవచ్చన్నారు. ఈ పథకంలో 30 శాతం సబ్సిడీ అందిస్తున్నారని వివరించారు. వృద్ధి కోసం ఆర్థిక సహాయం అందించడం, గ్రూపులుగా ఏర్పడిన ఉత్పత్తిదారులకు, స్వయం సహాయ సంఘాలకు మౌలిక వసతులు కల్పించడం, వాటికి బ్రాండింగ్, మార్కెటింగ్ మద్దతు కల్పించడమే కాకుండా వ్యాపార నైపుణ్యాలు, ఫుడ్ హ్యాండ్లింగ్ శిక్షణ ఇచ్చి కొత్త ఆవిష్కరణలు, స్టార్టప్లకు మద్దతు అందిస్తారన్నారు.