
ఆత్మకూరులో కార్డన్ సెర్చ్
ఆత్మకూరు రూరల్: ఆత్మకూరు పట్టణంలోని తిప్ప ప్రాంతంలో బుధవారం తెల్లవారుజాము నుంచి ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా 300 కుటుంబాల్లో తనిఖీలు చేసి సరైన పత్రాల్లేని 25 మోటార్బైక్లు స్వాధీనం చేసుకున్నారు. 15 మంది స్థానికేతరులను గుర్తించి వేలిముద్రలు సేకరించి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ దొంగతనాల నివారణ, శాంతిభద్రతల పరిరక్షణ, అసాంఘిక శక్తుల ఏరివేత లక్ష్యంగా ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశాల మేరకు సెర్చ్ నిర్వహించామన్నారు. పరారీలో ఉన్న నేరస్తులను గుర్తించి అదుపులోకి తీసుకోవడం, బంగారు, వెండి వంటి చోరీ సొత్తు, రికార్డుల్లేని వాహనాలు, అక్రమ మద్యం, ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకోవడమే సెర్చ్ ముఖ్య ఉద్దేశమన్నారు. సీఐలు గంగాధర్, వేమారెడ్డి, సబ్ డివిజన్ పరిధిలోని 8 మంది ఎస్సైలు, 60 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.